టెండర్ అక్రమాలపై విచారణ షురూ
ఈనాడు డిజిటల్, బెంగళూరు : రాష్ట్ర సర్కారును ప్రతి నెలా ఏదో ఒక సమస్య వెన్నాడుతోంది. తాజాగా టెండర్ అక్రమాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. టెండర్ దక్కాలంటే కమీషన్ చెల్లించాలన్న సంప్రదాయం క్రమంగా ఓ బలమైన వ్యవస్థగా మారిందని రాష్ట్ర గుత్తేదారుల సంఘం ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సంఘం లేఖ రాయటంతో సర్కారు అప్రమత్తమై విచారణకు ఆదేశించింది. గురువారం ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను అందిపుచ్చుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్ శుక్రవారం తన పని మొదలు పెట్టారు.
కొత్తగా మంత్రివర్గం ఏర్పాటైనా, శాఖల కేటాయింపులు మొదలైనా జల వనరుల శాఖకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ శాఖలో టెండర్లంటే వందల కోట్ల రూపాయల పైమాటే. గుత్తేదారుల పంట పండించే జల వనరుల శాఖలో కమీషన్ దందా రాజ్యమేలుతోందని గుత్తేదారుల సంఘం ప్రధానికి రాసిన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ కారణంగా ప్రధాన కార్యదర్శి రవికుమార్ స్పందించి- జల వనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రాకేశ్సింగ్కు వివరాలు అందించాలని సూచించారు. దాదాపు రూ.10 కోట్ల విలువైన బిల్లులకు లెక్కలు తేలలేదని ఆయన గుర్తించారు. వీటిపై త్వరగా విచారణ జరిపి వివరాలు అందివ్వాలని పురమాయించారు. ఉత్తరంలో ప్రస్తావించిన ప్రజా పనులు, గ్రామీణాభివృద్ధి, బీబీఎంపీ, ఆరోగ్యశాఖల్లోనూ త్వరలో దృష్టి సారించనున్నట్లు సమచారం. ఎమ్మెల్యేలకు 30 శాతం, మంత్రులకు 5 శాతం తప్పనిసరిగా కమీషన్ చెల్లించాల్సి వస్తోందని గుత్తేదారులు ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు.
విచారణ కేవలం తన సర్కారు ఏర్పాటైన కాలానికి కాకుండా కాంగ్రెస్ పాలన సమయానికి కూడా విస్తరించాలని ముఖ్యమంత్రి సూచించారు. కాంగ్రెస్ నేతలు ఈ కమీషన్ వ్యవహారంపై ఆ పార్టీ కార్యాలయంలోనే చర్చించుకున్న ఆడియో సంఘటనను ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పార్టీ మాధ్యమ సంచాలకులు ఏకంగా అధ్యక్షుడే కమీషన్ ఏజెంటుగా మారినట్లు ఆరోపించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కమీషన్ సృష్టికర్తలే గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయటం హాస్యాస్పదమన్నారు. తాము చేపట్టే విచారణలో కాంగ్రెస్ డొంక కూడా కదలక తప్పదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.