భారాస హయాంలోనే తెలంగాణ అభివృద్ధి: పద్మ
పద్నాలుగు ఏళ్ల పోరాటం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని, అనంతరం ప్రభుత్వం ఏర్పాటయ్యాక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి...అన్ని రంగాలను ముందుకు నడిపి తొమ్మిదిన్నరేళ్లలో భారాస అధినేత కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా
పార్టీ జెండా ఎగురవేస్తున్న పద్మ, ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి
మెదక్, న్యూస్టుడే: పద్నాలుగు ఏళ్ల పోరాటం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని, అనంతరం ప్రభుత్వం ఏర్పాటయ్యాక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి...అన్ని రంగాలను ముందుకు నడిపి తొమ్మిదిన్నరేళ్లలో భారాస అధినేత కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. భారాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డితో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మిషన్ భగీరథ, రైతుబంధు, సాగునీరు, దళితబంధు, బీసీ బంధు, గొర్రెల పంపిణీ, కల్యాణలక్ష్మి, రెండు పడక గదుల ఇళ్లు, పింఛన్ల పంపిణీ, కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు... నాలుగు వరుసల రహదారుల నిర్మాణం ఇలా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలో తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. తిరిగి ఆయనే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అబద్ధాలు, అసత్య హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. మెదక్ పట్టణానికి తాము వంద పడకలతో ప్రభుత్వ వైద్యకళాశాలను మంజూరు చేస్తే, అందులో 50 పడకలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్కు తరలించారని ఆరోపించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ భారాస హయాంలో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను బాధపెడుతోందని విమర్శించారు. కేంద్రంలో భాజపా తిరిగి అధికారంలోకి వస్తే వ్యవసాయరంగాన్ని ప్రైవేటీకరణ చేస్తారని విమర్శించారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ వైస్ఛైర్మన్ మల్లికార్జున్గౌడ్, జడ్పీ ఉపాధ్యక్షురాలు లావణ్యరెడ్డి, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, ఆంజనేయులు, లలిత, జయరాజ్, కిషోర్, భారాస నాయకులు దేవేందర్రెడ్డి, బట్టి జగపతి, చంద్రాగౌడ్, ఉమ్మన్నగారి దేవేందర్రెడ్డి, సోములు, కృష్ణ, అంజాగౌడ్, కిష్టయ్య, మల్లేశం, చంద్రకళ, శ్రీనివాస్రెడ్డి, రాజు, జుబేర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.