logo

చేతలు లేక.. చెత్తే గుట్టలై..!

పట్టణీకరణ ప్రభావంతో పట్టణాల్లో జనాభా ఏటా పెరిగి పోతుండగా.. నిత్యం టన్నుల కొద్దీ చెత్త వెలువడుతోంది. చెత్తను నిర్ణీత విధానంలో రీసైక్లింగ్‌ చేయకపోవడంతో.. డంపింగ్‌ యార్డుల్లో టన్నుల కొద్దీ పేరుకుపోతున్నాయి.

Updated : 24 Mar 2023 06:20 IST

ఎరువుల తయారీతోనే సమస్యకు పరిష్కారం  
నల్గొండ పురపాలిక, మిర్యాలగూడ, న్యూస్‌టుడే:

మిర్యాలగూడ డంపింగ్‌ యార్డులో పేరుకుపోయిన చెత్త నిల్వలు

పట్టణీకరణ ప్రభావంతో పట్టణాల్లో జనాభా ఏటా పెరిగి పోతుండగా.. నిత్యం టన్నుల కొద్దీ చెత్త వెలువడుతోంది. చెత్తను నిర్ణీత విధానంలో రీసైక్లింగ్‌ చేయకపోవడంతో.. డంపింగ్‌ యార్డుల్లో టన్నుల కొద్దీ పేరుకుపోతున్నాయి. నూతన పురపాలక చట్టం తెచ్చినప్పటికీ.. పట్టణాల్లో నిత్యం వెలువడే చెత్తను రీసైక్లింగ్‌ చేసి పర్యావరణానికి మేలు జరిగేలా ఎరువుల తయారీ చేపట్టక పోవటంతో సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పురపాలికల్లో రీసైక్లింగ్‌ చర్యలు అరకొరగానే సాగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం సూర్యాపేట- నల్గొండ క్లస్టర్‌ పరిధిలో 11 పురపాలికల్లో ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించటంతో చెత్త రీసైక్లింగ్‌ ప్రక్రియ మళ్లీ చర్చలోకి వచ్చింది.

ఇంటింటికి తిరిగి చెత్త సేకరించినా..?

పురపాలిక వాహనాల్లో ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తున్నారు. నేరుగా డంపింగ్‌ యార్డులకు తరలించి చేతులు దులుపుకుటుంన్నారు. 2007లో ఉమ్మడి రాష్ట్రంలో నాటి పురపాలక సంచాలకులు డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి, ప్రాంతీయ పర్యవేక్షకులు డాక్టర్‌ సత్యనారాయణ ప్రత్యేక దృష్టిసారించి డంపింగ్‌ యార్డులను ‘ వ్యర్థ్య సమర్థ నిర్వహణ పార్కులు’గా మార్చి ఎరువులు తయారు చేయించారు. కమిషనర్లు, పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారులకు, ఇంజినీరింగ్‌ అధికారులకు తగిన శిక్షణ ఇప్పించి ఎరువులు తయారు చేయించటంతో పాటుగా డంపింగ్‌ యార్డులను సుందరంగా తీర్చిదిద్దించారు. 2008లో మిర్యాలగూడ పురపాలికలో నాటి కమిషనర్‌ రాయప్రోలు రాంబాబు ఎరువుల తయారీ విజయవంతంగా చేపట్టగా.. అప్పటి పురపాలిక సంచాలకులు డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి, ప్రాంతీయ పర్యవేక్షకులు డాక్టర్‌ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్‌ ముక్తేశ్వర్రావు  డంపింగ్‌ యార్డును సందర్శించి అక్కడే భోజనాలు సైతం చేశారు. ఈ విధానాన్ని అన్ని పురపాలికల్లో అనుసరించాలని ఆదేశించినా.. ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. మరోవైపు కాలక్రమంలో ఎరువుల తయారీ ప్రక్రియ మిర్యాలగూడ పురపాలిక సహా ఇతర పురపాలికల్లో నిలిచి పోయింది. ప్రస్తుతం చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది.

నీలగిరి కేంద్రంగా క్లస్టరు..

రాష్ట్రంలోని 130 మున్సిపాలిటీలను ప్రభుత్వం తొమ్మిది క్లస్టర్లుగా విభజించింది. నల్గొండ క్లస్టరులో నీలగిరి మున్సిపాలిటీతోపాటు మిర్యాలగూడ, సూర్యాపేట, చండూరు, చిట్యాల, చౌటుప్పల్‌, దేవరకొండ, నందికొండ, నేరేడుచర్ల, తిర్మలగిరి, హాలియా, హుజూర్‌నగర్‌ పట్టణాలను చేర్చారు. యాదాద్రి జిల్లాలోని మున్సిపాలిటీలను జనగాం క్లస్టర్‌లో చేర్చారు. ఆయా మున్సిపాలిటీల్లో వెలువడే వ్యర్థాలను నల్గొండ కేంద్రంగా పనిచేసే సీఅండ్‌డీ కేంద్రానికి తరలించి శుద్ధి చేసే విధంగా ప్రణాళిక తయారు చేశారు

ప్రైవేటు ఏజెన్సీకి వ్యర్థాల తరలింపు పక్రియ జాప్యం..

పురపాలికల్లో వ్యర్థాల తరలింపు బాధ్యతను ప్రభుత్వం ఐదునెలల క్రితం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించింది. పురపాలిక అధికారులు ఇచ్చిన నివేదికల ప్రకారం వ్యర్థాల తరలింపు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. అనుమతి పొందిన ఏజెన్సీ గతేడాది ఆగస్టులో పురపాలికల్లోని డంపింగ్‌ యార్డులను సందర్శించి డ్రోన్‌ సర్వేచేసి.. పేరుకున్న చెత్త నిల్వలను అంచనా వేశారు. చెత్తను రీసైకిల్‌ చేసేందుకు ప్రభుత్వం హర్షిత ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఈ సంస్థ కొంతవరకు ప్లాంటు ఏర్పాటు సామగ్రిని తీసుకువచ్చి ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పురపాలికల డంపింగ్‌ యార్డుల్లో ఉంచింది. ప్లాంట్లు ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు వ్యర్థాల తరలింపు ప్రక్రియ చేపట్టక పోగా నిల్వలు పేరుకుపోతున్నాయి. పలు ప్రాంతాల్లో వ్యర్థాల దుర్వాసనలను స్ధానికులు భరించలేకపోతున్నారు. పొగతో ఇబ్బంది పడుతూ.. ఆందోళనలు చేస్తున్నారు.

100 టీపీడీ సామర్థ్యంతో శుద్ధి కేంద్రం

నల్గొండ జిల్లా కేంద్రంలో సుమారు రూ. 6 కోట్ల వ్యయంతో 100 టీపీడీ(ట్రాన్స్‌ పర్‌ డే) సామర్థ్యంతో సీఅండ్‌ డీ యూనిటు ఏర్పాటు కసరత్తు జరుగుతోంది. జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ మార్గదర్శకాలకు లోబడి ఇది పనిచేస్తుంది. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామంతో డీబీఎఫ్‌వోటీ( బిల్డ్‌.. పైనాన్స్‌.. ఆపరేట్‌.. ట్రాన్స్‌ఫర్‌) విధానంతో ఏర్పాటు చేయనున్నారు. టెండరు దక్కించుకున్న సంస్థ పదేళ్ల పాటు శుద్ధి కేంద్రం నిర్వహించేలా వీలు కల్పించారు.


టెండరు దశలో ఉంది:
రమణాచారి, కమిషనర్‌ నల్గొండ

పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం నల్గొండ క్లస్టరు కేంద్రంగా సీఅండ్‌డీ కేంద్రాన్ని మంజూరు చేసింది. ప్రస్తుతం టెండరు దశలో ఉంది. సీఎన్‌జీసీ మార్గదర్శకాలకు లోబడి శాస్త్రీయంగా వ్యర్థాలను శుద్ధి చేస్తారు. గుత్తేదారు సంస్థతో ఒప్పందం తదుపరి యూనిటు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని