logo

మాదిగల ఐక్యతకు త్వరలో పర్యటన

ఇటీవల భారాస ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ దళితబంధు పథకం గురించి ప్రసంగిస్తూ మాదిగలు, మాదిగ ఉపకులాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు.

Published : 04 Jun 2023 04:12 IST

తిరుమలగిరిలో విపక్ష నాయకులతో కలిసి అభివాదం చేస్తున్న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

తిరుమలగిరి, న్యూస్‌టుడే: ఇటీవల భారాస ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ దళితబంధు పథకం గురించి ప్రసంగిస్తూ మాదిగలు, మాదిగ ఉపకులాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. తిరుమలగిరిలోని వంగపల్లి నర్సయ్య ఫంక్షన్‌హాల్‌లో శనివారం ఏర్పాటుచేసిన విపక్షాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పనట్లయితే తుంగతుర్తి టికెట్‌ నిరాకరిస్తారా అని ప్రశ్నించారు. ఒకవేళ టికెట్‌ ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా భారాసకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలిపిన ఎమ్మార్పీఎస్‌, విపక్షాలను పోలీసులతో నిర్బధించడం చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్లు భావించాల్సి వస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకంలో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల అనుచరులను పార్టీకి దూరం పెట్టాలని డిమాండ్‌ చేశారు. తుంగతుర్తిలో అధికార పార్టీ వారిని ప్రశ్నిస్తే భౌతికదాడులు, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వ్‌ శాసనసభ నియోజకవర్గ స్థానాల్లో 85 శాతం మాదిగలు, ఉపకులాలున్న చోట ఏ పార్టీ అయినా మాదిగ అభ్యర్థులకు టికెట్‌ ఇవ్వాలని అన్ని పార్టీల ముఖ్యులను కోరనున్నట్లు తెలిపారు. అలా కాకుండా మాలలకు ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మాదిగల ఐక్యత కోసం త్వరలో నియోజకవర్గంలో ఐదు రోజుల పర్యటన చేపట్టనున్నట్లు చెప్పారు. సమావేశంలో భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి కడియం రాంచంద్రయ్య, వైతెపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న, సీపీఎం నాయకుడు కడెం లింగయ్య, ఎమ్మార్పీఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుకూరి సోమన్న, కందుకూరి శ్రీను, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు కందుకూరి అంబేడ్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని