logo

మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ

కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది.

Updated : 30 Apr 2024 07:55 IST

నాగ శ్రావణి (పాత చిత్రం)

తాడేపల్లిగూడెం వన్‌టౌన్‌, న్యూస్‌టుడే : కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది. గ్రామీణ ఎస్సై సురేశ్‌ తెలిపిన వివరాలు... విశాఖపట్నానికి చెందిన ఎమ్‌.శ్రీనివాస్‌, సత్యకుమారిల ఏకైక కుమార్తె నాగ శ్రావణిని అయిదేళ్ల కిందట జగన్నాథపురం గ్రామానికి చెందిన లక్కోజు కేశవరావు (విశ్రాంతి రైల్వే ఉద్యోగి), సూర్యకుమారిల కుమారుడు శ్రీనివాసరావుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమారుడు రిశాంత్‌ కుమార్‌(4), కుమార్తె జస్విత సూర్యశ్రీ(3) సంతానం ఉన్నారు. శ్రీనివాసరావు రెండేళ్ల కిందట జీవనోపాధికి దుబాయి వెళ్లారు. నాగ శ్రావణి తన పిల్లలతో ఇంట్లోనే ఉంటున్నారు. ఆదివారం గ్రామంలో ఒక శుభకార్యానికి అత్తమామలతో కలిసి వెళ్లారు. ఇంటికొచ్చాక తన కుమారుడి నడుముకు ఉండాల్సిన వెండి మొలతాడు కనిపించకపోవడాన్ని గమనించారు. అజాగ్రత్తగా ఉంటున్నావంటూ కుమారుడిని కొట్టారు. ఈ నేపథ్యంలో కేశవరావు ఆమెపై గొడవకు దిగారు. అదే రోజు రాత్రి నిద్రిస్తున్న శ్రావణి తలపై అతడు పచ్చడిబండతో బాదడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందింది.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియాసుపత్రికి తరలించారు. నిందితుడు కేశవరావు తోపాటు అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. తరచూ తన కుమార్తె నాగశ్రావణిని ప్రతి చిన్న విషయానికీ మామ కేశవరావు నిందిస్తూ ఉంటాడని మృతురాలి తండ్రి ఎమ్‌.శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని