Margadarsi: మార్గదర్శి ఉల్లంఘనలు అబద్ధం.. ప్రభుత్వ దాడి నిజం

మార్గదర్శి చందాదారులను బెదిరించడానికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి మరీ పత్రికా ప్రకటనలు ఇస్తోంది అని మార్గదర్శి పేర్కొంది. మార్గదర్శి చిట్‌ఫండ్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన నిందారోపణల్లో నిజానిజాలను వివరించింది. 

Updated : 30 Jul 2023 21:20 IST

చందాదారులను బెదిరించేందుకే ప్రజాధనం కోట్లలో ఖర్చు పెట్టి మరీ పత్రికా ప్రకటనలు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్గదర్శి చిట్‌ఫండ్‌పై చేసిన నిందారోపణలు.. వాటిలోని నిజానిజాలు


ఆరోపణ 1: మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరు మీద ఉన్న టికెట్స్ కు, కంపెనీ వారు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా ఈ గ్రూపునకు సంబంధంలేని సభ్యులు (వేరే చిట్‌ గ్రూప్‌) చెల్లించిన చందా డబ్బుతో చెల్లింపులు పూర్తిచేశారు. ఇది చట్ట ఉల్లంఘన. నియమావళి మేరకు కంపెనీ ఆధీనంలోని టికెట్సు (వేకెంట్‌ చిట్స్‌)కు మార్గదర్శి ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు, సొంత నిధులతో మాత్రమే చెల్లింపులు చేయాలి.

వాస్తవం: ప్రతి ఒక్క చిట్‌ గ్రూపులో కంపెనీ (ఫోర్‌మన్‌) చెల్లింపులకు సంబంధించి అత్యున్నత అకౌంటింగ్‌ వ్యవస్థ ‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా’ 2004లో జారీచేసిన సాంకేతిక మార్గదర్శకాల ప్రకారం మాండేటరీ చిట్‌తోపాటు ఖాళీ చిట్స్‌లోనూ ఫోర్‌మన్‌ చందాను ఖాతా పుస్తకాలలో చూపించడానికి నిర్దిష్టమైన వ్యాపార విధానాన్ని కంపెనీ నిరంతరం అవలంబిస్తుంది. ఈ విధానం ప్రకారం కంపెనీ ఎప్పటికప్పుడు తన సొంత నిధులతో మాత్రమే చందాలు చెల్లిస్తూ పుస్తకాల్లో పద్దులు రాయడం జరుగుతుంది. వాస్తవం  ఈ విధంగా ఉండగా కంపెనీ చందా  చెల్లించటం లేదనే పరిస్థితే ఉత్పన్నంకాదు. ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారం. అంతే కాకుండా చిట్  పాడుకున్న వారికి ఎలాంటి జాప్యం లేకుండా చట్ట ప్రకారం కంపెనీ ఎప్పటికప్పుడు చెల్లిస్తోంది. ఈ వాస్తవాలన్నీ సాక్ష్యాధారాలతో కంపెనీ పుస్తకాలు నిరూపిస్తున్నాయి.  చందాదారులు తగిన ష్యూరిటీలు  సమర్పించడంలో జాప్యం జరిగిన సందర్భంలో పాడుకున్న చిట్ మొత్తాన్ని చిట్‌ఫండ్‌ యాక్ట్‌ 1982లోని సెక్షన్‌ 22(2) ప్రకారం రెండో బ్యాంకు ఖాతాకు చట్ట ప్రకారం బదిలీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ చిట్ మొత్తాన్ని కంపెనీ తన సొంత చందాలు చెల్లించడానికి వినియోగించే అవకాశమే లేదు. 

  • మరో విషయం ఏమిటంటే, చట్టంలోని సెక్షన్‌ 21(1)(ఎ) కింద ఖాతా నుంచి స్థూల చిట్‌ మొత్తాన్ని తీసుకొనే అవకాశం కంపెనీకి ఉన్నప్పటికీ, వ్యవస్థలో తగినంత మేర నగదు  నిల్వ నిర్వహించడానికి ఆ మొత్తాన్నీ సంస్థ అదే ఖాతాలోనే ఉంచుతోంది. మాండేటరీ చిట్‌తోపాటు అవసరమైతే ఖాళీ చిట్‌లకు చందా సమకూర్చడానికి ఫోర్‌మన్‌కు ఈ మొత్తం ఉపయోగపడుతుంది. ఖాతా పుస్తకాల్లో పాడుకున్న చిట్ మొత్తాన్ని నమోదు చేసినప్పుడల్లా బ్యాలన్స్‌ షీట్‌లో దాన్ని బకాయిగానే చూపుతారు. 
  • ఏదైనా గ్రూప్‌లోని ఖాళీ చిట్‌లో పెట్టిన పెట్టుబడిని ఆ చిట్‌లోకి కొత్త చందాదారులు చేరిన వెంటనే ఎప్పటికప్పుడు నెలవారీగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నారు. మాండేటరీ చిట్‌ కాకుండా మరేదైనా చిట్‌ గ్రూప్‌ పూర్తయ్యేవరకూ భర్తీకాకపోతే, ఆ చిట్‌ను చివరి వరకూ కొనసాగించడంతోపాటు, ఆ గ్రూప్‌ సభ్యుల్లోని చందాదారులకు పారదర్శకంగా పూర్తిగా చెల్లింపులు జరిగిన తర్వాతే ఆ మొత్తాన్ని సంస్థ డ్రా చేస్తుంది. చివరి వరకు పెట్టుబడి పెట్టిన ఈ మొత్తాన్ని గ్రూప్‌ గడువు పూర్తయిన చివరి నెలలో తీసుకొనే సౌలభ్యం ఉన్నప్పటికీ బ్రాంచ్‌ల నగదు నిల్వలను బలోపేతం చేయడానికి ఆ మొత్తాన్నంతా వ్యవస్థలోనే ఉంచటం జరుగుతుంది. 
  • కనుక మాండేటరీ చిట్లు, తాత్కాలికంగా ఖాళీగా ఉండే చిట్లకు  ఫోర్‌మన్‌ బ్యాంకు ఖాతాలో ఉన్న నిధుల నుంచే పూర్తిగా చందాలు సమకూరుస్తున్నారు. అందుకు సంబంధించిన పద్దులను ప్రతినెలా ఖాతా పుస్తకాల్లో నమోదు చేస్తున్నారు. అందువలన మాండేటరీ చిట్‌లకు, ఖాళీ చిట్‌లకు కంపెనీ చందాలు సమకూర్చడంలేదన్న ఆరోపణల్లో ఏమాత్రం పసలేదు. చిట్‌లు పాడుకున్న చందాదారులకు వారికి రావాల్సిన మొత్తాన్ని ప్రతినెలా ఎలాంటి జాప్యం లేకుండా చెల్లిస్తున్నట్లు సంపూర్ణమైన సాక్ష్యాలున్నందున ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారం. 

ఆరోపణ 2: చిట్‌ కంపెనీ వారు చెల్లించాల్సిన చెల్లింపులు చేయకుండా వేరే గ్రూపునకు సంబంధించిన చందాదారుల డబ్బులను దారి మళ్లించడం వల్ల, పాటపాడుకున్న చందాదారులకు చాలా ఆలస్యంగా చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించడమైనది. చిట్‌ పాటదారులకు కొన్ని సందర్భాలలో నాలుగు నెలలకు మించి చెల్లింపులు ఆలస్యం చేశారు. 

వాస్తవం: బ్యాంకు ఖాతాలో నిధులు అందుబాటులో ఉండటం వల్ల కంపెనీ ఎప్పటికప్పుడు చందాలు చెల్లించి ఆ విషయాన్ని ఖాతా పుస్తకాల్లో ఎప్పటికప్పుడు చూపుతోంది. అందువల్ల నగదు కొరత కారణంగా చిట్లు పాడుకున్న చందాదారులకు చెల్లింపుల్లో జాప్యం జరిగే ప్రసక్తే లేదు.  అంతే కాకుండా చట్ట ప్రకారం ష్యూరిటీలు సమర్పించడంలో జాప్యం జరిగినప్పుడు పాడుకున్న చిట్ మొత్తాన్ని రెండో ఖాతాకు బదిలీ చేయడం జరుగుతుంది. 

  • ఒక చిట్‌ గ్రూపులోని మొత్తాన్ని మరో గ్రూప్‌ చెల్లింపులకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం. చట్టం ప్రకారం వివిధ గ్రూప్‌ చందాదారుల నుంచి వసూలు చేసిన చందాలను ఆ శాఖలో కుదుర్చుకున్న చిట్‌ ఒప్పందం ప్రకారం నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తారు. చిట్ పాడుకున్న చందాదారుకి చట్ట ప్రకారం అదే బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపులు చేస్తున్నారు. ఆ వివరాలను ఎప్పటికప్పుడు చందాదారుకు, రిజిస్ట్రార్‌లకు తెలియపరుస్తున్నారు.
  • చిట్‌ఫండ్‌ చట్టం-1982లోని సెక్షన్‌ 22(2) ప్రకారం చిట్‌ పాట మొత్తాన్ని బ్యాంకు ఖాతా నం.1 నుంచి ఎప్పటికప్పుడు చెల్లించడం జరుగుతోంది.  అంతేకాకుండా చందాదారు ష్యూరిటీ సమర్పించడంలో జాప్యం జరిగినప్పుడు ఆ మొత్తాన్ని చట్ట ప్రకారం నిర్దేశించిన ఖాతా నం.2కి బదిలీచేయడం జరుగుతుంది. చందా మొత్తాలను  ఈ విధంగా  నిబద్ధతతో వ్యాపారం కచ్చితంగా నిర్వహిస్తున్నపుడు ఒక గ్రూప్‌కి చెందిన చందా మొత్తాలను మరో గ్రూప్‌లో పాడుకున్న చిట్ దారుల చెల్లింపులకు ఉపయోగించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. 
  • ఎవరైనా చందాదారుడు పాట పాడుకున్నప్పుడు అతను భవిష్యత్తులో చెల్లించాల్సిన చందా మొత్తానికి సెక్యూరిటీ సమర్పించమని అడిగే హక్కును చట్టంలోని సెక్షన్‌ 21(1)(ఇ) ఫోర్‌మన్‌కు కల్పిస్తోంది. 
  • ఇలాంటి సమయంలో చందాదారులు భవిష్యత్తులో చెల్లించాల్సిన బకాయిలను మినహాయించుకోమని కోరడంతోపాటు ష్యూరిటీలు/గ్యారంటీలు, సెక్యూరిటీ మొత్తాలు, ఎల్‌ఐసీ పాలసీ తనఖా, బ్యాంకు గ్యారంటీలు, ఆస్తుల తనఖా పెట్టడంలాంటివి చేస్తుంటారు. వాళ్లు భవిష్యత్తులో చెల్లించాల్సిన మొత్తానికి వీటిని సమర్పిస్తుంటారు. ఇలాంటి సమయంలో కంపెనీ తనకున్న హక్కులను ఉపయోగించుకొని సదరు చందాదారు సమర్పించిన ష్యూరిటీల్లోని విశ్వసనీయతను పూర్తిగా విశ్లేషిస్తుంది. ఆ గ్రూప్‌లోని చిట్లు పాడుకోని చందాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కచ్చిత పారదర్శక విధానాన్ని పాటిస్తుంది. అది అవసరం కూడా. చిట్ పాడుకున్న చందాదారు తగిన సెక్యూరిటీ సమర్పించిన వెంటనే కంపెనీ తక్షణం చెల్లింపులు చేస్తోంది. చిట్ పాడుకున్న చందాదారు ష్యూరిటీలు సమర్పించడంలో జాప్యం చేస్తే, వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని తదుపరి వాయిదా చెల్లించడానికి ముందే చట్టప్రకారం ఆమోదించిన ప్రత్యేక ఖాతాలో డిపాజిట్‌ చేసి, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న వివరాలను సదరు చందాదారుతోపాటు, రిజిస్ట్రార్‌కూ లిఖితపూర్వకంగా తెలియజేస్తున్నారు. అందువల్ల ఇక్కడ ఆరోపిస్తున్నట్లుగా చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగడంలేదు. చిట్ పాడుకున్న మొత్తానికి సరిపడా అవసరమైనంత సెక్యూరిటీ కోరే హక్కు కంపెనీకి ఉంది. ఈ విషయంలో చట్టంలోని నిబంధనలను కంపెనీ పూర్తి నిబద్ధతతో పాటిస్తోంది. 

ఆరోపణ 3: నూతన చిట్‌ ప్రారంభించే సమయంలో తగు అనుమతులు పొందకుండా చిట్‌ మెంబర్స్‌ నుంచి ఎలాంటి మొత్తాలు స్వీకరించకూడదు. కానీ చిట్‌ఫండ్‌ నియమావళిని ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా పబ్లిక్‌ నుంచి నిధులు స్వీకరించడం జరిగింది. 

వాస్తవం: చిట్‌ఫండ్స్‌ చట్టం 1982లోని సెక్షన్‌ 4 ప్రకారం రిజిస్ట్రార్ల దగ్గరి నుంచి ప్రీవియస్‌ శాంక్షన్‌ ఆర్డర్‌ (పీఎస్‌ఓ) స్వీకరించిన తర్వాతే కంపెనీ చందాదారుల పేర్లను నమోదు చేసుకుంటోంది. అలా నమోదు చేసుకున్న చందాదారు తన స్వీయ విచక్షణ మేరకు వేలంపాటకు ముందు చందా మొత్తాన్ని చెల్లిస్తారు. కొన్ని సమయాల్లో చందాదారు ముందస్తుగానే చందా మొత్తాన్ని చెల్లిస్తుండొచ్చు. చందాదారులు స్వీయ సౌకర్యార్థం చెల్లిస్తే తప్ప కంపెనీ ఎప్పుడూ తొలి వాయిదాకంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించమని చందాదారుడిని ప్రోత్సహించదు. అలా వచ్చిన చందాలన్నింటినీ ఖాతా పుస్తకాల్లో ప్రత్యేకంగా ముందస్తు చందాలుగా జమచేయడంతోపాటు, బ్యాలన్స్‌షీట్‌లో వాటిని బకాయిలు అన్న హెడ్‌ కింద చూపుతోంది. 

  • ప్రారంభానికి ముందే చందా మొత్తాన్ని స్వీకరించకూడదని చిట్‌ఫండ్స్‌ చట్టంలో ఎక్కడా ప్రస్తావించలేదు. దాన్ని నిరోధించే నిబంధన కూడా ఎక్కడా లేదు.
  • అయితే కంపెనీ ప్రతిష్ఠను దిగజార్చడానికి రిజిస్ట్రార్లు ఊహాజనితమైన, నిరాధారమైన తప్పుడు ఆరోపణలు పదేపదే వల్లెవేస్తున్నారు. 

ఆరోపణ 4: చిట్‌ గ్రూపులోని చందాదారులు వారి అవసరాలకు చిట్‌ పాట పాడుకోగా, వారికి సకాలంలో చిట్‌ మొత్తాన్ని చెల్లించకుండా చిట్‌ నిబంధనల పేరుతో సరైన హామీలను (సెక్యూరిటీ) సమర్పించలేదనే కారణంతో మరియు వడ్డీ ఆశ చూపించి భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాకు హామీగా (సెక్యూరిటీగా) చిట్‌ మొత్తాన్ని కంపెనీ వద్దే డిపాజిట్‌ చేసుకుని 4% లేదా 5% వడ్డీ చెల్లిస్తామని రశీదులు ఇచ్చి ఎలాంటి మొత్తాలు చిట్‌ పాడుకున్న వారికి చెల్లించకుండా చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. 

వాస్తవం: చిట్‌ పాడుకున్న చందాదారుడు ఇకపై చెల్లించాల్సిన చందా మొత్తాలకు తగిన పూచీకత్తును పొందేందుకు చట్టంలోని సెక్షన్‌ 21(1)(ఈ) ప్రకారం ఫోర్‌మన్‌కు పూర్తి హక్కు ఉంది. చిట్‌ ఒప్పందంలో ఉన్న పద్ధతిని అనుసరించి చందాదారులు తాము ఇకపై చెల్లించాల్సిన మొత్తాలను మినహాయించుకోవాలని స్వయంగా కోరినప్పుడు,  పూచీకత్తు(ష్యూరిటీ)లు ఇవ్వడం, హామీ (సెక్యూరిటీ) మొత్తాలు చూపించడం, ఎల్‌ఐసీ పాలసీలను తాకట్టు పెట్టడం, బ్యాంకు గ్యారంటీ ఇవ్వడం, ఆస్తులు తాకట్టు పెట్టడం వంటివి చేస్తారు. కంపెనీ కార్పొరేట్‌ కార్యాలయం తనకున్న హక్కును వినియోగించుకుంటూ వీటిని క్షుణ్నంగా పరిశీలిస్తుంది. హామీగా చూపిన ష్యూరిటీలను నిర్దిష్టంగా పరిశీలించే విధానాన్ని అమలుచేస్తుంది.  గ్రూపులో చిట్ ఇంకా పాడుకోని చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇది కచ్చితంగా పాటించాలి. చిట్ పాడుకుని.. కంపెనీని సంతృప్తిపరిచేలా తగిన హామీలు సమర్పించిన వారికి త్వరగా, సులభంగా చెల్లింపులు చేయడంలో చిట్ ఫండ్ పరిశ్రమలో పారదర్శకమైన విధానాలు అవలంభిస్తున్నట్లు గత ఆరు దశాబ్దాలుగా మార్గదర్శికి పేరుంది.  

  • చందాదారుడు కోరుకున్నట్లయితే.. భవిష్యత్తులో ఇంకా చెల్లించాల్సిన వాయిదాల సొమ్ముకు సెక్యూరిటీ మొత్తాన్ని ఫోర్‌మన్‌ అనుమతించవచ్చని చిట్ ఫండ్ చట్టంలోని నిబంధనలతోపాటు, భారతీయ రిజర్వు బ్యాంకు 2016లో జారీచేసిన మూడో అధ్యాయంలో ని మార్గనిర్దేశకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా చిట్‌ఫండ్‌ వ్యాపారాన్ని ‘మిస్లేనియస్‌ నాన్‌ బ్యాంకింగ్‌ కంపెనీలు’గా  ఆర్‌బీఐ వర్గీకరించింది. అందువల్ల ప్రస్తుత, లేదా భవిష్యత్తు వాయిదాలుగా చెల్లించే చిట్ చందా మొత్తాలను ‘డిపాజిట్‌‘ గా పరిగణించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా స్వీకరించిన చిట్ చందాలు డిపాజిట్‌ నిర్వచనం పరిధిలోకి రానేరావు. ఈ విషయన్ని ధ్రువీవకరిస్తూ ఆర్‌బీఐ చట్టంలోని 45-ఐ (బిబి) సెక్షన్‌ ‘డిపాజిట్‌‘కు ఉన్న నిర్వచనాన్ని పూర్తిగా స్పష్టం చేస్తోంది. 

ఆరోపణ 5: మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ శాఖకు చెందిన ఖాతా నిర్వహణ చిట్‌ నియమావళి మేరకు ఆ శాఖకు సంబంధించిన ఫోర్‌మన్‌ ఆధీనంలో ఉండాలి. కానీ ఈ శాఖలకు సంబంధించిన బ్యాంకు ఖాతాల నిర్వహణ ఆ శాఖ ఫోర్‌మన్‌ కాకుండా వారి కేంద్ర కార్యాలయంలో పనిచేసే అనధికార సిబ్బందిచే నిర్వహిస్తూ చిట్‌ నిధులను చట్ట విరుద్ధంగా దారి మళ్ళిస్తున్నారు. 

వాస్తవం: చట్ట నిబంధనలు, నియమాల ప్రకారం ప్రతి బ్రాంచి మూడు బ్యాంకు ఖాతాలు కచ్చితంగా నిర్వహిస్తుంది.  ఫోర్‌మన్, అంటే కంపెనీకి అధీకృత ప్రతినిధిగా బ్రాంచి మేనేజర్‌ వ్యవహరిస్తారు. బ్రాంచి బ్యాంకు ఖాతాల నిర్వహణ, కార్యకలాపాల నియంత్రణలపై మేనేజర్లకు పూర్తి అవగాహన ఉంటుంది. బ్రాంచిలో చిట్‌ కార్యకలాపాలన్నింటికీ మేనేజర్‌ ఇన్‌ఛార్జిగా ఉంటారు. సమర్థమైన కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థ కోసం.. హైదరాబాద్‌లోని కంపెనీ నమోదిత కార్యాలయంలో సీనియర్‌ సిబ్బందికి బ్రాంచి మేనేజర్ల సూచనలమేరకు చెక్కులపై సంయుక్తంగా సంతకాలు చేసే అధికారం మాత్రమే ఉంటుంది. బ్రాంచి మేనేజర్ల సూచనల మేరకే చెక్కులు జారీ  చేసి, చందాదారులకు పంపిణీకోసం వాటిని బ్రాంచిలకే పంపిస్తారు. చట్ట ప్రకారం కార్యకలాపాలన్నీ బ్రాంచిలలోనే నిర్వహించబడుతున్నాయన్నది వాస్తవం. 

  • చందాదారుల నుంచి వసూలయిన చందా మొత్తాలు ఎప్పటికప్పుడు బ్యాంకు ఖాతాల్లో జమచేయడం జరుగుతుంది. చిట్ పాడుకున్న చందాదారులకు ఈ ఖాతాల నుంచే ప్రైజ్ మొత్తాలను చెల్లించడం జరుగుతుంది. అంతేకాకుండా ష్యూరిటీ సమర్పించడంలో జాప్యం జరిగినప్పుడు  చెల్లించాల్సి ఉన్న చిట్ మొత్తాలను చిట్‌ఫండ్‌ చట్టం-1982లోని సెక్షన్‌ 22(2) ప్రకారం ప్రత్యేక బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడానికి  ఈ మొత్తాలను వినియోగిస్తారు.  ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే చందాదారుల నుంచి ఎప్పటికప్పుడు వసూలైన మొత్తాన్ని ప్రైజ్ చెల్లింపులకు మాత్రమే ఎలాంటి జాప్యం లేకుండా వినియోగించడం జరుగుతుంది.  ఈ సందర్భంలో బ్రాంచిలలోని నిధులను దారి మళ్లించే అవకాశమే ఉత్పన్నంకాదు.  ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారమైంది. 
  • అందువల్ల కార్పొరేట్‌ కార్యాలయం నుంచి బ్యాంకు ఖాతాలను సమర్థవంతంగా కంపెనీ నిర్వహించడం జరుగుతున్నందున బ్రాంచి నిధులను దారిమళ్లించే అవకాశమే ఉత్పన్నం కాదు.  ఈ ఆరోపణ నూటికి నూరు శాతం నిరాధారం. 

ఆరోపణ 6: చందా చెల్లింపులలో డీ-ఫాల్ట్‌ అయిన లేదా ఎలాంటి చందా చెల్లించని వారి పేరు మీద చిట్‌ పాట పాడి నిబంధనలకు విరుద్ధంగా సదరు మొత్తాలను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు.

వాస్తవం: సకాలంలో కిస్తీలు వసూలు కాకపోవడమనే సమస్య ఆర్థిక రంగంలో సహజంగానే తలెత్తుతూ ఉంటుంది. చందాదారులతో పరస్పర విశ్వాసం ప్రాతిపదికన కంపెనీ నడుస్తుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా చిట్‌ గ్రూపును నడిపిస్తుంది. 

  • ప్రతినెలా తన వాటా కిస్తీని చెల్లించిన తర్వాతే వేలం పాటలో పాల్గొనటానికి చందాదారుకు అనుమతి లభిస్తుంది.
  • వేలం పాటలో చందాదారు పాడుకున్న(ప్రైజ్‌మనీ) మొత్తం నుంచి గతంలో బకాయిపడిన సొమ్మును కంపెనీ మినహాయించుకుంటుంది. భవిష్యత్తు కిస్తీలకు అవసరమైన పూచీకత్తు సమర్పించిన తర్వాతే మిగిలిన మొత్తాన్ని చందాదారుకు కంపెనీ అందజేస్తుంది.
  • సరైన పూచీకత్తు లభించక పాడుకున్న మొత్తాన్ని చందాదారుకు చెల్లించని పక్షంలో ....చిట్‌ అగ్రిమెంట్‌లో పేర్కొన్న చట్టంలోని సెక్షన్‌ 22(2) ప్రకారం తదుపరి వాయిదాకు ముందే అధీకృత బ్యాంకులోని ప్రత్యేక ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇలా జమ చేయడానికి గల కారణాలను చిట్‌ పాడుకున్న చందాదారుతో పాటు రిజిస్ట్రార్‌కు కూడా లిఖితపూర్వకంగా కంపెనీ ఎప్పటికప్పుడుతెలియజేస్తుంది. అందువల్ల నిబంధనలకు విరుద్ధంగా సదరు మొత్తాలను వినియోగించే ప్రశ్నే ఉత్పన్నంకాదు. 
  • చిట్‌ పాడుకున్న చందాదారు సరైన పూచీకత్తు సమర్పించకపోవడం వల్ల బ్యాంకు ప్రత్యేక ఖాతాలో జమచేయాల్సి వచ్చిన ప్రైజ్‌ మనీని ప్రతి ఆరు నెలలకోసారి చెల్లించాల్సిన కిస్తీలకు సర్దుబాటు చేయడం జరుగుతుంది. చిట్‌ గ్రూప్‌లోని ఇతర చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసమే కంపెనీ ఈ సర్దుబాటు చేస్తూ ఉంటుంది. ఇలా ఓ క్రమపద్దతిలో చందాదారు ప్రైజ్‌మనీని చిట్‌ గ్రూప్‌నకు బదిలీ చేయటం వల్ల దీనికి సంబంధించిన మిగులు సొమ్ము ఏదీ కంపెనీ వినియోగించే ప్రశ్నే ఉత్పన్నంకాదు.  ఈ చందా మొత్తాలు తత్సంబంధిత చిట్‌ గ్రూప్‌నకే  వినియోగించడం జరుగుతుంది. 
  • బ్యాంకు ప్రత్యేక ఖాతాలో ఉంచిన సొమ్మును సంబంధిత చిట్‌ గ్రూప్‌నకే సకాలంలో బదిలీ చేయాల్సి ఉన్నందున అటువంటి మొత్తాలను అక్రమంగా దారి మళ్లించే పరిస్థితే ఉత్పన్నం కాబోదు.  ఈ ఆరోపణ పూర్తి నిరాధారం.

ఆరోపణ 7: చిట్‌ఫండ్‌ చట్టం 1982లోని సెక్షన్‌ 24 మరియు రూల్‌ 28 నిబంధన మేరకు సమర్పించాల్సిన బ్యాలన్స్‌ షీట్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ అకౌంట్‌ షెడ్యూల్‌ 1, 2 మేరకు, సంబంధిత పర్యవేక్షణ అధికారులకు సమర్పించవలసి ఉన్నప్పటికీ ఎలాంటి బ్యాలన్స్‌ షీట్‌లు, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ అకౌంట్‌లు సమర్పించకుండా చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు.

వాస్తవం: బ్యాలన్స్‌ షీట్‌ తయారీ, సమర్పణ గురించి 1982 చిట్‌ఫండ్‌ చట్టంలోని 24వ సెక్షన్‌ చెబుతోంది. ప్రతి ఫోర్ మెన్ కంపెనీల చట్టం 1956 ప్రకారం ఆడిట్ చేయబడిన లేదా చిట్ ఫండ్ చట్ట ప్రకారం పార్ట్ 1, 2 ఏది వీలైతే అది సమర్పించాలని చట్టం స్పష్టంగా వెసులుబాటు కల్పించింది. చట్ట ప్రకారం అర్హత కలిగిన ఆడిటర్లు ధ్రువీకరించిన ఆస్తి అప్పుల పట్టీ, లాభ నష్టాల ఖాతాలు చట్టం నిర్దేశించిన గడువులోగా సమర్పించాల్సి ఉంటుంది. 

చిట్ ఫండ్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా కంపెనీ ఎప్పటికప్పుడు ఆడిట్ చేయబడిన ఆస్తి అప్పుల పట్టీలు, లాభనష్టాల ఖాతాలను సెక్షన్ 24 ప్రకారం రిజిస్ట్రార్లకు సమర్పించడం జరిగింది. ఇప్పటివరకు గత 60 సంవత్సరాల్లో రిజిస్ట్రార్ల నుంచి ఎలాంటి నోటీసులు రావడం కానీ, వివరణలు కోరిన సందర్భం కానీ లేదు. 

వాస్తవంగా సెక్షన్ 24(1) ప్రకారం ఆడిట్ చేయబడిన ఆస్తి అప్పుల పట్టీ, లాభనష్టాలఖాతాలు, తదితర వివరాలను లేదా చిట్ ఫండ్ చట్టంలోని పార్ట్ 1, 2 నమూనా పట్టిక ప్రకారం ఏది వీలైతే అది సమర్పించాలని చట్టం నిర్దేశిస్తోంది. అంతే కాకుండా రూల్ 28(2) ప్రకారం ప్రతీ చిట్ కు ఆస్తి అప్పుల పట్టీ, లాభనష్టాల ఖాతాలు సమర్పించాలని చట్టంలోని నిబంధనలు నిర్దేశించలేదు. చిట్ ఫండ్ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం  రూల్ 28(2)కి  నిర్దేశించే అధికారం సంక్రమించలేదు.  కనుక ప్రతి చిట్ గ్రూప్ కు ఆస్తి అప్పుల పట్టీ, లాభనష్టాల ఖాతాలను రిజిస్ట్రార్ కు సమర్పించాలని చట్టం నిర్దేశించలేదు. 

  • చిట్‌ గ్రూపులు వేలల్లో ఉన్నప్పుడు  చిట్‌ గ్రూప్ ల వారీగా ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవడం, ఆస్తి అప్పుల పట్టీలు, లాభనష్టాల ఖాతాలను తయారుచేయడం ఆచరణలో సాధ్యం కాని విషయం. ఆంధ్రపదేశ్‌లో 1900కుపైగా చిట్‌ గ్రూపులు నిర్వహిస్తున్న మార్గదర్శికి ఇది ఎలా సాధ్యమవుతుంది. అంతే కాకుండా  చిట్‌ఫండ్‌ చట్టంలోని సెక్షన్‌ 89లోని నిబంధనల ప్రకారం వ్యాపారం మొత్తానికి ఆస్తి అప్పులపట్టీ, లాభనష్టాల ఖాతా సమర్పించాలన్నది సుస్పష్టం. కనుక 28(2) నిబంధనకు చట్టం ప్రకారం  చిట్ గ్రూప్ ల వారీగా బ్యాలన్స్‌ షీట్‌లను డిమాండు చేసే అధికారం లేదని స్పష్టమవుతోంది.  అంతేకాకుండా  అసాధ్యమైన వాటిని వ్యాపారంలో అమలు చేయాల్సిందేనని చట్టం ఎప్పుడూ నిర్దేశించిన సందర్భాలు లేవు.  ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఎల్‌ఐసీ వర్సెస్ సీఐటీ, 219 ఐటీఆర్‌ 410, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ నర్మదా బచావో ఆందోళన్‌ (2011) 7 ఎస్‌సీసీ 639 కేసుల్లో స్వయంగా సుప్రీంకోర్టే   స్పష్టీకరించింది.  

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని