TS Budget: ఆరు గ్యారంటీలకు పెద్దపీట.. రూ.2,75,891 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌

తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.

Updated : 10 Feb 2024 15:13 IST

హైదరాబాద్‌: తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,669 కోట్ల మూలధన వ్యయంతో కొత్త ప్రభుత్వ తొలి పద్దును ప్రతిపాదించారు. మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని.. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో భట్టి తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు వివరించారు. గత ప్రభుత్వ పథకాలు గొప్ప.. అమలుకు దిబ్బ అన్నట్లుగా ఉండేవన్నారు. గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రం ఆర్థిక కష్టాల పాలైందని చెప్పారు. గత ప్రభుత్వ అప్పులను అధిగమించి అభివృద్ధిలో సంతులిత వృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామని వెల్లడించారు. 

బడ్జెట్‌ కేటాయింపులు ఇలా.. 

  • ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
  • వ్యవసాయానికి రూ.19,746 కోట్లు
  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు
  • నీటిపారుదల శాఖకు రూ.28,024 కోట్లు
  • ఐటీ శాఖకు రూ.774 కోట్లు
  • పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
  • విద్యా రంగానికి రూ.21,389 కోట్లు
  • మూసీ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు
  • వైద్య రంగానికి రూ.11,500 కోట్లు
  • ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,874 కోట్లు
  • బీసీ సంక్షేమ శాఖకు రూ.8,000 కోట్లు
  • ఎస్టీ సంక్షేమ శాఖకు రూ.13,313 కోట్లు
  • మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,262 కోట్లు
  • గృహ నిర్మాణ రంగానికి రూ.7,740 కోట్లు

ఆర్థిక మంత్రి ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు

  • త్వరలో 15 వేల మంది కానిస్టేబుళ్ల నియామకం పూర్తి చేస్తాం.
  • త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం.
  • టీఎస్‌పీఎస్సీ నిర్వహణ, అదనపు సిబ్బంది నియామకానికి రూ.40 కోట్లు
  • గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి సామాజిక భద్రత స్కీమ్‌ కింద రూ.5 లక్షల ప్రమాద బీమా.
  • ‘ప్రజావాణి’లో రెండు నెలల్లో వచ్చిన దరఖాస్తులు 43,054. ఇళ్ల కోసం వచ్చినవి 14,951
  • దరఖాస్తుల పరిశీలన కోసం కలెక్టర్లు, శాఖాధిపతులకు పర్యవేక్షణ బాధ్యత
  • ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వ తొలి ప్రాధాన్యత
  • మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తున్నాం
  • ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధులు అందిస్తాం
  • గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌
  • త్వరలో రూ.500కే  గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తాం
  • దావోస్‌ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి
  • పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు మరింత అభివృద్ధి
  • ప్రభుత్వం నుంచి 2 లెదర్‌ పార్కులు, రాష్ట్రం నలుమూలలా ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం
  • డ్రై పోర్టులను అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్‌ ప్రణాళిక
  • గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృత్రిమ మేధ ఉపయోగిస్తాం
  • ఐటీ రంగంలో నైపుణ్యాభివృద్ధికి నూతన పాలసీ.. రాష్ట్ర నలుమూలలకు విస్తరించేందుకు ప్రణాళికలు
  • ఐటీ విస్తరణకు అమెరికాలోని ఐటీ సర్వ్‌ సంస్థతో సంప్రదింపులు
  • దేశంలోనే అత్యంత పటిష్ఠమైన ఫైబర్‌ నెట్‌వర్క్‌ కనెక్షన్లు ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు