Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Dec 2023 09:18 IST

1. పాలిటెక్నిక్‌కు సరికొత్త సిలబస్‌

రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ విద్యకు వచ్చే విద్యాసంవత్సరం (2024-25) నుంచి కొత్త సిలబస్‌ అమలు కానుంది. తొలిసారిగా విదేశాల్లోని డిప్లొమా చదువులకు అమలు చేస్తున్న పాఠ్యప్రణాళికను కూడా పరిశీలించి.. వచ్చే అయిదేళ్ల కోసం నూతన సిలబస్‌ను రూపొందించనున్నారు. ఈ మేరకు వచ్చే ఏడాది జూన్‌/జులైలో ప్రారంభమయ్యే పాలిటెక్నిక్‌ తొలి సంవత్సరం విద్యార్థులకు కొత్త పాఠ్యప్రణాళిక అమలవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సభలకు వస్తారా.. చస్తారా!

డ్వాక్రా సంఘాల మహిళలను అధికార వైకాపా రాజకీయ సభలకు తరలివచ్చే ముడిసరకుగా మార్చేశారు. ఊరూ, మండలం, జిల్లా, రాష్ట్రం... ఏ స్థాయిలో సభలూ సమావేశాలు నిర్వహించినా వాటికి భారీగా చేపట్టే జన సమీకరణంతా ఈ డ్వాక్రా మహిళలే! ఎక్కడ సభలున్నా ఆటోలలో, వ్యాన్లలో, బస్సుల్లో మహిళలను కుక్కేసి తరలిస్తున్నారు. వారి పరిస్థితి ఎలా ఉన్నా ఈ సభలకు వచ్చి తీరాల్సిందే! రాకపోతే అదిరిస్తారు.. సంక్షేమ పథకాలు ఇవ్వబోమని బెదిరిస్తారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మీ భాష, ఆలోచన అసహ్యంగా ఉన్నాయి

‘మీ భాష, ఆలోచన విధానం చాలా అసహ్యంగా ఉన్నాయి. ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ వినడానికి ఎవరూ లేరు. నేను చెప్పేదే వినండి’ అంటూ క్రీడలు, పర్యాటక శాఖల మంత్రి రోజా మీడియాపై విరుచుకుపడ్డారు. ఈనెల 15 నుంచి నిర్వహించే ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంపై శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, క్రీడలశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, శాప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ధ్యానచంద్రతో కలిసి విజయవాడలో శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఈ సారి చలి తీవ్రత తక్కువే!

దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో డిసెంబరు నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా కాస్త అధికంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర, వాయవ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో చలి గాలుల తీవ్రత సాధారణ స్థాయి కన్నా తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర శుక్రవారం వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పర్యాటకాభివృద్ధి సంస్థ కార్యాలయంలో మంటలు

హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) కార్యాలయంలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో దస్త్రాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. పరిపాలన కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నిచర్‌, కీలక ప్రాజెక్టులకు సంబంధించిన పత్రాలు కాలి బూడిదయ్యాయి. కిటికీ అద్దాలకు ఉండే ఫైబర్‌ బీడింగ్‌ మంటలకు మెత్తబడి.. కింద నిలిపి ఉంచిన కారుపై పడటంతో అది కూడా కాలిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. టీచర్‌ అవుదామనుకొని..

 రెండు చేతులు లేకపోవడంతో జీవితంలో ఏం సాధించలేనని ఒకప్పుడు అనుకున్నానని పారా ఆర్చర్‌ శీతల్‌దేవి చెప్పింది. నంబర్‌వన్‌ అయిన నేపథ్యంలో ఆమె ఇలా స్పందించింది. ‘‘జీవితంలో ఏదీ సాధించలేనని అనుకునేదాన్ని. కానీ ప్రతి ఒక్కరూ ఎంతో సాయం చేశారు. అందుకే ఈ స్థితిలో నిలవగలిగా’’ అని శీతల్‌ చెప్పింది. ఒకప్పుడు ఉపాధ్యాయురాలిని కావాలనే ఆలోచన ఉండేదని కానీ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చల్లని చంద్రయ్యా.. మా ప్రేమ చూడయ్యా..

‘సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి..!’  ‘గన్నవరం గడ్డా.. యార్లగడ్డ అడ్డా..!’ ‘జై చంద్రబాబు.. జైజై తెలుగుదేశం..’ నినాదాలు మార్మోగాయి. కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. జనసేన కార్యకర్తల ఆవేశం కలగలిసింది. జనంతో జాతీయ రహదారి బంతిపూల వనంగా మారింది. అడుగడుగునా చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కార్యకర్తల ఆనందోత్సాహాలు, కేరింతల నడుమ తెదేపా అధినేత చంద్రబాబు స్వాగత ర్యాలీ వైభవంగా సాగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వైకాపా కక్ష.. యువతకు శిక్ష!

ధికార వైకాపా కక్ష... క్రీడాకారులకు శిక్షగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం ప్రజాధనాన్ని వృథా చేసింది. గత ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి పనులు అధికార పగ్గాలు చేపట్టగానే నిలిపేయడంతో రూ.కోట్ల నిధులు బూడిదలో పోసిన పన్నీరైంది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో క్రీడా వికాస కేంద్రాల నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జగన్‌ చిత్రాలున్న సరకులన్నీ పంపిణీ చేసేయండి

‘సీఎం జగన్‌ చిత్రాలున్న సరకులన్నీ వెంటనే పంపిణీ చేసేయండి. ఏ ఒక్క ప్యాకెట్‌ ఉండటానికి వీల్లేదు. బోర్డులోనూ పలు మార్పులు చేయాలి.. అందరూ జాగ్రత్తగా ఉండండి. లేదంటే మొదటికే మోసం వస్తుంది’ ఇదీ అంగన్‌వాడీ కార్యకర్తలకు ఉన్నతస్థాయి నుంచి శుక్రవారం వచ్చిన సందేశాలు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో హడావుడి నెలకొంది. కేంద్ర పథకాలకు వైకాపా ప్రభుత్వం తన ముద్ర వేసుకుని ఇస్తే.. పథకాలు నిలిపివేస్తామని మోదీ ప్రభుత్వం హెచ్చరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అక్రమానికి సక్రమ ముద్ర వేసేందుకేనా?!

2021 ఫిబ్రవరి 18న విజయవాడ దుర్గగుడిలో అనిశా (అవినీతి నిరోధక శాఖ) అధికారులు దాడులు నిర్వహించి అనేక అక్రమాలను గుర్తించారు. వీటిపై సమగ్ర నివేదికను అప్పుడే రూపొందించి దేవాదాయశాఖ కమిషనర్‌... ప్రభుత్వానికి అందజేశారు. వీటి ఆధారంగా దుర్గగుడికి సంబంధించిన 14 మంది సిబ్బందిని సస్పెండ్‌ చేసి, ఈవో సురేష్‌బాబుపై బదిలీ వేటు వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని