Delhi: దిల్లీ బిల్లు ఆమోదం వేళ.. మంత్రుల శాఖలు మార్చిన కేజ్రీవాల్‌..!

పార్లమెంట్‌లో దిల్లీ బిల్లుకు ఆమోదం లభించిన సమయంలో దిల్లీ(Delhi) కేబినెట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌కు షాక్ తగిలింది. 

Updated : 08 Aug 2023 12:39 IST

దిల్లీ: దిల్లీ(Delhi)లోని ఆప్‌(AAP) ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గంలో అనూహ్య మార్పు చేసింది. మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌(Saurabh Bhardwaj)ను సేవలు, విజిలెన్స్‌ విభాగం బాధ్యతల నుంచి తప్పించి.. ఆ రెండు శాఖలను ఆతిశీ(Atishi)కి అప్పగించింది. పార్లమెంట్‌లో దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుకు ఆమోదం లభించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 

ఆప్‌లో కీలక నేతలుగా వ్యవహరించిన మనీశ్‌ సిసోదియా, సత్యేందర్ జైన్ జైలుకెళ్లడంతో కొద్దినెలల క్రితం ఆతిశీ(Atishi), సౌరభ్‌ భరద్వాజ(Saurabh Bhardwaj) కేబినెట్‌లో కీలక శాఖల బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు సౌరభ్‌ ఆధ్వర్యంలోని ఈ శాఖల బాధ్యతలు కూడా ఆతిశీకి అప్పగించారు. ఈ మార్పుతో దిల్లీ ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక్క మహిళా మంత్రి వద్ద అత్యధికంగా 14 శాఖలు ఉన్నట్లైంది. తాజా మార్పునకు సంబంధించిన ఫైల్‌ను ఆమోదం నిమిత్తం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు పంపారని సమాచారం.  

రాజ్యసభలో దిల్లీ బిల్లుపై చర్చ జరుగుతోన్న సమయంలో సౌరభ్‌ భరద్వాజ్‌ చూస్తున్న శాఖలను ఉద్దేశించి కేంద్రమంత్రి అమిత్‌ షా తీవ్ర ఆరోపణలు చేశారు. అర్థరాత్రి ఫైల్స్ అడుగుతారని, స్పెషల్ సెక్రటరీ(విజిలెన్స్‌)కి రిపోర్టు చేయుద్దని అధికారులకు చెప్తారంటూ విమర్శలు చేశారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సర్వీస్‌ సెక్రటరీని బదిలీ చేశారని గుర్తు చేశారు. కేంద్రమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలోనే ప్రస్తుత పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని