No-Trust Motion: ఆగస్టు 8న ‘అవిశ్వాసం’పై పార్లమెంట్‌లో చర్చ..

పార్లమెంట్‌(Parliament)లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. దానికి సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. 

Updated : 01 Aug 2023 15:33 IST

దిల్లీ: విపక్ష ఎంపీలు ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం(No-Trust Motion)పై చర్చించేందుకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10వ తేదీన ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. లోక్‌సభ సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో జాతుల మధ్య వైరం జరుగుతోంది. దానిపై ప్రకటన చేసేందుకు మోదీ పార్లమెంట్‌కు రావాలని గత కొద్దిరోజులుగా విపక్షాలు పట్టుబడుతున్నాయి. దాంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. దీనిపై హోం మంత్రి అమిత్‌ షా బదులిస్తారని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఈ కీలక అంశంపై ప్రధానే స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విపక్షాలు అవిశ్వాస అస్త్రాన్ని ఉపయోగించాయి.

కనీవినీ ఎరుగని ఘోరం

లోక్‌సభలో అధికార ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. విపక్షాల కూటమి ఇండియాకు 144 మంది సభ్యులు ఉన్నారు. ఈ తీర్మానంపై విజయం సాధించడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ.. మణిపుర్‌పై ప్రధాని స్పందించాలనే లక్ష్యంతోనే దీనిని ప్రవేశపెట్టారు.  

అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు చేపట్టకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఇదివరకు విపక్షాలు చేసిన ఆరోపణలను భాజపా ఖండించింది. తమకు మూడింట రెండొంతుల మెజారిటీ ఉందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌  స్పష్టం చేశారు. బిల్లులను ప్రవేశపెట్టడానికి ముందే అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టాలనే నిబంధనేమీ లేదని, 10 రోజుల్లోగా ఎప్పుడైనా చేపట్టవచ్చని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని