Supreme Court: ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

మనీలాండరింగ్‌ కేసుల దర్యాప్తుల సమయంలో ఈడీ (ED) అధికారులు చేపడుతున్న చర్యలపై సుప్రీంకోర్టు (Supreme Court) అసహనం వ్యక్తం చేసింది. ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని సూచించింది.

Published : 04 Oct 2023 12:00 IST

దిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)పై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుల దర్యాప్తుల సమయంలో ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని, చట్టప్రకారం వ్యవహరించాలని సూచించింది. గురుగ్రామ్‌కు చెందిన ఎం3ఎం కంపెనీపై మనీలాండరింగ్‌ కేసు (money laundering case)లో ఆ కంపెనీ డైరెక్టర్లు బసంత్‌ బన్సల్‌, పంకజ్‌ బన్సల్‌ అరెస్టును కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఓ అవినీతికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎం3ఎం డైరెక్టర్లు బసంత్‌ బన్సల్‌, పంకజ్‌ బన్సల్‌పై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే జూన్‌ 1వ తేదీన ఈడీ (ED) అధికారులు ఎం3ఎం గ్రూప్‌ (M3M Group), బన్సల్‌ సోదరుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు. దీంతో వీరు జూన్‌ 9న పంజాబ్‌-హరియాణా హైకోర్టును ఆశ్రయించగా.. జులై 5 వరకు వారికి అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించింది. అయితే, జూన్‌ 14న వారిని ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది.

సిక్కింలో మెరుపు వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు

ఈ అరెస్టును సవాలు చేస్తూ బన్సల్‌ సోదరులు పంజాబ్‌, హరియాణా హైకోర్టును ఆశ్రయించగా.. వారి పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కోర్టు వేసింది. దీంతో వారు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపి వీరికి బెయిల్‌ మంజూరు చేసింది. ఆ ఉత్తర్వుల కాపీ తాజాగా బయటికొచ్చింది. కాగా.. విచారణ సమయంలో ఈడీ అధికారుల చర్యలపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

‘‘ఈడీ ప్రతి చర్య పాదర్శకంగా, ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. కానీ, ఈ కేసులో దర్యాప్తు సంస్థ తన అధికారాలను, విధులను అనుసరించడంలో విఫలమైనట్లు తేలింది. ఈడీ ప్రతీకారపూరిత చర్యలకు పాల్పడకూడదు. అత్యంత పారదర్శకంగా, న్యాయంగా వ్యవహరించాలి. ఈడీ అడిగిన ప్రశ్నలకు నిందితులు సమాధానాలు చెప్పలేదన్న కారణంతో వారిని అరెస్టు చేయడం సరికాదు. మనీలాండరింగ్‌ చట్టం కింద వారు నేరానికి పాల్పడ్డారని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలను సేకరించి అరెస్టు చేయాలి. అంతేగానీ, సమన్లకు సరిగా స్పందించలేదని ఎవరినీ అరెస్టు చేయకూడదు. అంతేగాక, అరెస్టు సమయంలో అందుకు గల కారణాలను కూడా నిందితులకు లిఖితపూర్వకంగా అందించాలి’’ అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ కేసులో బన్సల్‌ సోదరుల అరెస్టు చట్ట వ్యతిరేకమన్న ధర్మాసనం.. వారిని తక్షణమే విడుదల చేయాలని ఈడీని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని