Vaccination: మందగించిన వ్యాక్సిన్‌ పంపిణీ.. రాష్ట్రాలను అలెర్ట్‌ చేసిన కేంద్రం

పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందగించడంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 20 May 2022 22:19 IST

జూన్‌-జులై నెలల్లో ఇంటింటికీ టీకా కార్యక్రమం

దిల్లీ: పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందగించడంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులందరికీ వ్యాక్సిన్‌ పంపిణీ చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇంటింటికీ టీకా కార్యక్రమం మరో దఫా చేపట్టాలని సూచించారు.

విదేశాలకు వెళ్లాలనుకునే వారు ప్రికాషనరీ డోసు (మూడో డోసు) తీసుకోవాలనుకుంటే అందుకు సంబంధించిన ఆధారాలు చూపించాలని కొన్ని వ్యాక్సిన్‌ కేంద్రాలు డిమాండ్‌ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లే వారి నుంచి ప్రయాణానికి సంబంధించిన అధికారిక రుజువులు వ్యాక్సినేషన్‌ కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. వీటికి సంబంధించి ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపింది.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 191 కోట్ల డోసులను పంపిణీ చేశామన్న కేంద్ర ఆరోగ్యశాఖ.. ప్రతి లబ్ధిదారునికి వ్యాక్సిన్‌ అందించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. ముఖ్యంగా వచ్చే రెండు నెలలు (జూన్‌, జులై)ల్లో ‘హర్ ఘర్ దస్తక్ 2.0’ పేరుతో ఇంటింటికీ వెళ్లి టీకా పంపిణీ చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని అన్ని రాష్ట్రాల వైద్యాధికారులకు స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రమాలు, పాఠశాలలు/కాలేజీలు, ఖైదీలు, ఇటుక బట్టీల వంటి ప్రాంతాల్లో పనిచేసేవారు, విద్యకు దూరమైన చిన్నారులకు వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని తెలిపింది. ముఖ్యంగా 12 నుంచి 14ఏళ్ల పిల్లలకు టీకా పంపిణీ తక్కువగా ఉండడం, మరోవైపు ఆ వయసువారికి కొవిడ్‌ ముప్పు అధికంగా ఉన్నందున వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని