Robotic soldier: ఎల్​ఏసీ వద్ద చైనా రోబో సైన్యమా?.. అలాంటిదేం లేదన్న భారత ఆర్మీ

ఎల్​ఏసీ వెంబడి సహా సరిహద్దుల్లో ఎలాంటి రోబో సైనికులు కనిపించలేదని భారత భద్రతా దళాల ఉన్నత వర్గాలు తెలిపాయి.......

Published : 08 Jan 2022 01:35 IST

దిల్లీ: వాస్తవాధీనరేఖ వద్ద గస్తీ కోసం చైనా తమ సైన్యంలో రోబోలను మోహరించినట్లు అక్కడి మీడియాలో కథనాలు వస్తున్న వేళ.. భారత భద్రతా దళాల ఉన్నత వర్గాలు స్పందించాయి. ఎల్​ఏసీ వెంబడి సహా సరిహద్దుల్లో ఎలాంటి రోబో సైనికులు కనిపించలేదని తెలిపాయి. తుపాకులతో ఉన్న రోబో సైనికులు కంటపడలేదని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. అయితే చైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం చలికి అసలు తట్టుకోలేని డ్రాగన్​ పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీకి ఇది ఉపకరిస్తుందని తెలిపారు.

‘శీతాకాలం ఎముకలు కొరికే చలిలో చైనా సైనికులు ఉండలేరు. సైన్యంలో రోబోలను మోహరించడం చైనా పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీకి ఉపకరిస్తుంది. అది వారికి మేలు చేసేదే’ అని ఆర్మీ ఉన్నత వర్గాలు పేర్కొన్నాయి. అంతటి చలిలో గస్తీ కాయడం డ్రాగన్​ సైనికులకు పెను సవాలేనని.. తమ శిబిరాల్లో నుంచి అలా వచ్చి కాసేపట్లోనే లోపలికి వెళ్లిపోతారని సైనిక వర్గాలు వెల్లడించాయి. గతేడాది కూడా చైనా సైన్యానికి ఈ ఇబ్బందులు తప్పలేదని వివరించాయి.

భారత సైన్యం తమ సైనికులను రెండేళ్ల పాటు ఎత్తయిన ప్రాంతాల్లో మోహరిస్తూ ఉంటుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొని దీటుగా గస్తీకాసే శిక్షణ పొందుతాయి. దీంతో సాయుధ దళాలు ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో క్లిష్ట పరిస్థితులకు అలవాటుపడ్డాయి. ఇదిలా ఉంటే.. మైనస్​ 20-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే భారత సరిహద్దుల వెంబడి చైనా భద్రతా సిబ్బంది బలవంతంగా కాపుగాస్తున్నారు. ఉన్నతాధికారుల కఠిన ఆదేశాలతో వారు వరుసగా రెండో ఏడాది అక్కడే ఉండాల్సి వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని