Supreme Court: 30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’

అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు ఇటీవల అనుమతించిన సుప్రీంకోర్టు.. ఆ ఆదేశాలను తాజాగా వెనక్కి తీసుకుంది.

Published : 29 Apr 2024 20:19 IST

దిల్లీ: అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) అనుమతించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ తీర్పును వెనక్కి తీసుకుంటున్నట్లు సోమవారం వెల్లడించింది. గర్భవిచ్ఛిత్తి తదనంతర పరిణామాలతో తమ కుమార్తె ఆరోగ్యం విషయంలో ఆందోళనగా ఉందని బాలిక తల్లిదండ్రులు వీడియో మాధ్యమం ద్వారా సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బాలిక ప్రయోజనాలే పరమావధిగా పేర్కొన్న సీజేఐ.. ఇదివరకటి ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.

మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలిక లైంగిక దాడికి గురై గర్భం దాల్చింది. కాస్త ఆలస్యంగా ఈవిషయం తెలుసుకున్న ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన కుమార్తె 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని ఏప్రిల్‌ ఆరంభంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గర్భవిచ్ఛిత్తికి నిరాకరించింది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ చివరి త్రైమాసికంలో ఉందని.. ఇప్పుడు విచ్ఛిత్తి చేస్తే పూర్తిగా రూపుదిద్దుకున్న పిండస్థ శిశువు జన్మించే అవకాశముందని అభిప్రాయపడింది. ఈమేరకు బాలిక తల్లి పిటిషన్‌ను ఏప్రిల్‌ 4వ తేదీన కొట్టేసింది.

వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా?

ఈ తీర్పుపై బాధితురాలి తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గతవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. ముంబయిలోని సియాన్‌ ఆసుపత్రి మెడికల్‌ బోర్డును నివేదిక కోరింది. గర్భవిచ్ఛిత్తిపై తీసుకునే నిర్ణయం వల్ల బాలిక శారీరక, మానసిక పరిస్థితి ఎలా ఉండనుందో చెప్పాలని సూచించింది. దీనిపై మెడికల్‌ బోర్డు న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ‘‘ఈ సమయంలో గర్భవిచ్ఛిత్తితో కొంత ప్రమాదం ఉన్నప్పటికీ.. కాన్పు తర్వాత ఎదురయ్యే ముప్పుతో పోలిస్తే ఇది ఎక్కువ కాదు’’ అని అందులో పేర్కొంది.

దీన్ని పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం బాలిక 30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతినిచ్చింది. దీనిని ‘అసాధారణ’ కేసుగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం.. బాధితురాలికి సంపూర్ణ న్యాయం అందించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద ఉన్న విస్తృత అధికారాలతో ఈ తీర్పు వెలువరిస్తున్నట్లు తెలిపింది. సాధారణంగా మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం.. వివాహిత మహిళలు, ప్రత్యేక అవసరాలున్నవారు, అత్యాచార బాధితులు 24 వారాల వరకు తమ గర్భాన్ని వైద్యుల సూచనల మేరకు విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతి ఉంది. ఆ సమయం దాటితే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని