Supreme Court: ఆ ‘గుండె చప్పుడు’ ఆపలేం.. గర్భవిచ్ఛిత్తికి నిరాకరించిన సుప్రీం కోర్టు

తన 26 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని కోరుతూ ఓ మహిళ చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు నిరాకరించింది.

Published : 16 Oct 2023 16:30 IST

దిల్లీ: తన 26 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని కోరుతూ ఓ మహిళ చేసిన విజ్ఞప్తిని భారత సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఇప్పటికే 24 వారాలు దాటాయని.. ఇప్పుడు ఆ గుండె చప్పుడును ఆపలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో తల్లికి ఎటువంటి ముప్పూ లేదని, గర్భస్థ శిశువుకు కూడా ఎటువంటి అసాధారణ పరిస్థితి లేదని ఎయిమ్స్‌ వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా గర్భ విచ్ఛిత్తికి అంగీకరించడం లేదని పేర్కొంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.

‘గర్భిణికి ఇప్పటికే 26 వారాల, 5 రోజులు పూర్తయ్యాయి. ప్రస్తుతం తల్లికి ఎటువంటి ముప్పులేదు. గర్భస్థ శిశువు అసాధారణతకు సంబంధించి కేసు కూడా కాదు. ఈ క్రమంలో విచ్ఛిత్తికి అనుమతిస్తే.. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ యాక్టు (MTP Act)లోని సెక్షన్‌ 3, సెక్షన్‌ 5 ఉల్లంఘనే అవుతుంది’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ఆ ‘గుండె చప్పుడు’ను ఆపేందుకు కోర్టు సుముఖంగా లేదన్నారు. ప్రస్తుతానికి ఆ మహిళ ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారని.. ఆ ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. చిన్నారి పుట్టిన తర్వాత స్వయంగా పెంచుకోవడమా లేదా దత్తత ఇచ్చే అంశంపై తల్లిదండ్రులు తర్వాత నిర్ణయం తీసుకోవచ్చన్నారు.

పిండం గుండె చప్పుడు ఆపాలని ఏ కోర్టు చెబుతుంది!

తనకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని, ప్రసవానంతర కుంగుబాటుతో ఇబ్బంది పడుతున్నానని.. మానసికంగా, ఆర్థికంగా తాను మూడో బిడ్డను కని పెంచే పరిస్థితుల్లో లేనందున గర్భవిచ్ఛిత్తికి అనుమతివ్వాలంటూ ఓ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఎయిమ్స్‌ వైద్యుల నివేదిక ఆధారంగా అక్టోబర్‌ 9న ఆ మహిళ 26 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేయడానికి సుప్రీం కోర్టు అనుమతించింది. దీనిని సవాల్‌ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అనంతరం దీనిపై ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడంతో ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు చేరింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన విస్తృత ధర్మాసనం.. ఆ తల్లి విజ్ఞప్తిని నిరాకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని