Pushpa2: సింగం3 వాయిదా పడనుందా..!

తాజాగా ‘పుష్ప2’ (Pushpa 2) విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ తేదీన విడుదల ప్లాన్ చేసుకున్న ఓ బాలీవుడ్‌ చిత్రం వెనక్కు వెళ్లనున్నట్లు సమాచారం.

Published : 13 Sep 2023 17:42 IST

ముంబయి: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తోన్న సినిమా ‘పుష్ప2’ (Pushpa 2). తాజాగా దీని విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టీమ్‌ వెల్లడించింది. దీంతో ఆ తేదీకి ఉన్న సినిమాలు వాటి రిలీజ్ డేట్‌లను మార్చుకునే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో ఓ బాలీవుడ్‌ చిత్రం పేరు బాగా వినిపిస్తోంది.

రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సింగం3’ (Singham 3). ఇప్పటికే రెండు సార్లు సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ‘సింగం’ సిరీస్‌ సినిమా కావడంతో బాలీవుడ్‌ ప్రేక్షకులు దీనిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని మొదట ఈ ఏడాది ఆగస్టు 15కు విడుదల చేయాలని భావించారు. కానీ రోహిత్‌ శెట్టి మరో సినిమాతో బిజీ అవ్వడంతో ‘సింగం3’ పనులు ఆలస్యమయ్యాయి. దీంతో వచ్చే ఏడాది ఆగస్టు15కు వాయిదా వేశారు. అయితే, తాజాగా ఆ తేదీని ‘పుష్ప2’ లాక్‌ చేసుకోవడంతో దీన్ని మరో తేదీన తీసుకురావాలని చూస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. రెండూ భారీ బడ్జెట్‌ సినిమాలు కావడంతో ఒకేసారి విడుదల చేయడం ఎందుకని రోహిత్‌శెట్టి ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

అతడితో వర్క్‌ చేయడం ఎప్పటికీ జరగదు: విశాల్‌ ఆగ్రహం

ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘పుష్ప2’. గతంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ‘పుష్ప’కు సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుగుతోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక నటిస్తోంది. ఇక ‘సింగం3’ విషయానికొస్తే.. రోహిత్‌ శెట్టి దర్శకత్వంతో ఇది రానుంది. అజయ్‌ దేవగణ్‌తో పాటు కరీనా కపూర్‌, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించనున్నారు. అలాగే ఇందులో టైగర్ ష్రాఫ్‌, అక్షయ్‌కుమార్‌లు అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాపై బీటౌన్‌ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని