Kadapa: బీటెక్ రవిని కిడ్నాప్ చేసి చంపాలనుకున్నారు: సీఎం రమేశ్‌

కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న తెదేపా నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్‌ రవిని భాజపా నేత సీఎం రమేశ్‌ మంగళవారం పరామర్శించారు.

Updated : 21 Nov 2023 19:39 IST

కడప: కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న తెదేపా నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్‌ రవిని భాజపా నేత సీఎం రమేశ్‌ మంగళవారం పరామర్శించారు. 10 నెలల క్రితం కడప విమానాశ్రయం వద్ద ఆందోళన కేసుతోపాటు, క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో బీటెక్‌ రవికి న్యాయస్థానం రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. రవిని కలిసిన తర్వాత సీఎం రమేశ్‌ మీడియాతో మాట్లాడారు.

‘‘బీటెక్ రవిని 14న కిడ్నాప్ చేసి చంపేయాలనుకున్నారు. కడప నగర శివార్లలో పోలీసు వాహనంలో మూడు గంటల పాటు తిప్పారు. ఆ తర్వాత పాడుబడ్డ భవనంలోకి తీసుకెళ్లారు. నిజం చెప్పకపోతే చంపేస్తామని బీటెక్ రవిని బెదిరించారు. బతికి ఉంటే కదా నువ్వు పులివెందులలో పోటీ చేసేది అని హెచ్చరించారు. మీడియా వల్లే రవి బయటపడ్డారు. ఈ వ్యవహారం అంతా మీడియాలో వస్తుందని తెలియగానే ఈ కేసు పెట్టారు. వైకాపాకు తొత్తుగా సీఐ అశోక్ రెడ్డి పని చేస్తున్నారు. అశోక్ రెడ్డికి కచ్చితంగా బుద్ధి చెబుతాం. ఒకరి కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడి ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంటాం. అశోక్ రెడ్డి అండ్ టీమ్‌.. బీటెక్ రవిని కిడ్నాప్ చేసింది. అందుకు సంబంధించిన ఆధారాలున్నాయి. సీఎం జగన్‌కు రోజులు దగ్గర పడ్డాయి. బీటెక్ రవిని అరెస్టు చేసిన తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తాం’’ అని సీఎం రమేశ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని