Revanth reddy: మోదీకి చిత్తశుద్ధి ఉంటే మణికంఠ రాథోడ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలి: రేవంత్‌

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే నాయకత్వాన్ని ఎదుర్కోలేక హత్య చేయాలని కుట్ర చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Published : 07 May 2023 21:47 IST

హైదరాబాద్‌: రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేను మణికంఠ రాథోడ్‌ హత్య చేస్తానని బెదిరించడంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఖర్గే కుటుంబంతో సహా హతమారుస్తానని బెదిరించిన ఆడియోలు కూడా బయటకు వచ్చాయని, నిజంగా మోదీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మణికంఠ రాథోడ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

ఖర్గే నాయకత్వాన్ని ఎదుర్కోలేక హత్య చేయాలని కుట్ర చేస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడిన మణికంఠపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఆయన తెలిపారు. ఖర్గేను చంపడమంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనన్నారు. ఈనెల 10న కర్ణాటక ప్రజలు కీలకమైన తీర్పు వెల్లడించబోతున్నారని చెప్పారు. ఓటమి ఎరుగని ఖర్గే లోక్‌సభలో మోదీ అవినీతిని నిలదీస్తుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని విమర్శించారు. ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గేను ఓడించడానికి భాజపా ప్రయత్నిస్తోందన్నారు. నగర బహిష్కరణకు గురైన ఒక రౌడీషీటర్‌ను భాజపా చిట్టపుర్‌లో బరిలో దించిందన్నారు. ఖర్గే నేతృత్వంలో కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని