Kodandaram: కేసీఆర్‌ జాతీయ పార్టీ విఫల ప్రయోగం: కోదండరామ్‌

సీఎం కేసీఆర్ తక్షణ రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఆలోచిస్తారని.. దీర్ఘకాలిక ప్రయోజనాలపై కాదని తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ఫ్రొ.కోదండరామ్‌ అన్నారు.

Published : 07 Oct 2022 13:51 IST

హైదరాబాద్: సీఎం కేసీఆర్ తక్షణ రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఆలోచిస్తారని.. దీర్ఘకాలిక ప్రయోజనాలపై కాదని తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ఫ్రొ.కోదండరామ్‌ అన్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, అంబేడ్కర్‌ లాంటి వారికి సిద్ధాంతం ఉంది కాబట్టే ఆర్థిక నమూనా తయారు చేశారన్నారు. సీఎం కేసీఆర్‌కు ఆ రెండూ లేవని.. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే జాతీయ పార్టీ పేరుతో ఆయన నాటకాలాడుతున్నారని విమర్శించారు. కుటుంబ ఆర్థిక అవసరాల కోసం అధికారాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు.

కేసీఆర్ జాతీయ పార్టీ విఫల ప్రయోగమని.. తెలంగాణ అస్తిత్వాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని కోదండరామ్‌ ఆక్షేపించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, వాదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దిల్లీ స్థాయిలో తెలంగాణ మోడల్ డొల్లతనాన్ని బయటపెడతామన్నారు. హైదరాబాద్, దిల్లీలో సదస్సులు పెట్టి భారాస, తెలంగాణ మోడల్ కుట్రలను బహిర్గతం చేస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నప్పుడు ఆస్తుల పెంచుకునేందుకు సమయం ఎలా దొరికిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ప్రత్యేకమైన అజెండాతో ముందుకు రావాలని కోదండరామ్‌ సూచించారు.

మునుగోడులో పోటీ చేస్తాం..

మునుగోడు ఉపఎన్నికలో తెజస పోటీ చేస్తుందని కోదండరామ్‌ స్పష్టం చేశారు. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ ఉమ్మడి అభ్యర్థిగా నిలబడితే తెలంగాణ సమాజం ఆయన వెంట ఉంటుందన్నారు. తెజస తరఫున తాము కూడా మద్దతిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని