Vundavalli: ఆ మూడు పార్టీల మద్దతు భాజపాకే.. అందుకే ఏమీ అనరు: ఉండవల్లి

దేశంలోని పరిణామాలను చూస్తే ఆందోళన కలుగుతోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. రాజకీయాల్లోకి మతాన్ని

Updated : 24 May 2022 15:42 IST

విజయవాడ: దేశంలోని పరిణామాలను చూస్తే ఆందోళన కలుగుతోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. రాజకీయాల్లోకి మతాన్ని తీసుకొచ్చి వివాదం చేయొద్దని ఆయన హితవు పలికారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

భాజపా సిద్ధాంతంతో నష్టమే ఎక్కువ

‘‘అసలు మనం ఎటుపోతున్నామో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. చదువుకుంటున్నవాళ్లు కూడా సంకుచితంగా ఆలోచిస్తున్నారు. ప్రపంచం మొత్తం మనల్ని గౌరవిస్తోంది. ఇతర దేశాల వారు కూడా మన సంప్రదాయాలను అమలు చేస్తున్నారు. కాంగ్రెస్‌, ఇతర పార్టీల్లో ఉన్న వారు భాజపాలోకి వెళ్లడం ఆశ్చర్యం కలుగుతోంది. కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా చేసిన వాళ్లు కూడా చేరుతున్నారు. భాజపా ఐడియాలజీ తెలియకుండా పదవుల కోసం వెళుతున్నారు. కాంగ్రెస్‌ది సెక్యులరిజం.. కమ్యూనిస్టులు సోషలిజం.. భాజపాది హిందూయిజం.

అన్ని రంగాల్లో ఫెయిల్యూర్‌ అయిన భాజపా.. మతం విషయంలో సక్సెస్‌ అయింది. ఆ పార్టీ సిద్ధాంతం వల్ల మనకు నష్టమే ఎక్కువ. ప్రధాని మోదీ అన్ని విషయాల్లో దెబ్బతిన్నారు. రాష్ట్రంలోని వైకాపా, తెదేపా, జనసేన.. ఈ మూడు పార్టీలూ  భాజపాకే మద్దతిస్తున్నాయి. ఆ పార్టీల నేతలు వాళ్లలో వాళ్లు తిట్టుకుంటారు కానీ.. భాజపాను ఒక్క మాట కూడా అనరు. 

రెండు ప్రభుత్వాలకు పెద్ద తేడా లేదు..

జగన్‌, చంద్రబాబు ప్రభుత్వాలకు పెద్ద తేడా కనిపించడం లేదు. ప్రత్యేకహోదా, పోలవరం, 9, 10 షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌ నుంచి వచ్చే ఆస్తుల విషయంపై అదే పరిస్థితి ఉంది. న్యాయబద్ధంగా రావాల్సినవి అడిగేందుకు ఎందుకు భయపడతారో అర్థం కావట్లేదు. పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రానికి అప్పగించడంపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే దాన్ని మళ్లీ కేంద్రానికి అప్పజెబుతామన్నారు. అధికారంలోకి వచ్చినా జగన్‌ ఎందుకివ్వలేదు?’’ అని ఉండవల్లి ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని