నిందితుడిగా భాజపా నేత సంతోష్‌

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ సహా నలుగురిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కొత్తగా నిందితులుగా చేర్చింది.

Published : 25 Nov 2022 05:29 IST

ఎమ్మెల్యేలకు ఎర కేసులో తుషార్‌, జగ్గుస్వామి, శ్రీనివాస్‌లు కూడా..
నందకుమార్‌ వద్ద రూ. 55 లక్షలు తీసుకున్న న్యాయవాది శ్రీనివాస్‌
రుణంగానే తీసుకున్నట్లు విచారణలో వెల్లడి
ఒక పార్టీ కీలక నేతతోనూ లావాదేవీలు!
ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్‌ నోటీసు
ఈనాడు - హైదరాబాద్‌

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ సహా నలుగురిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కొత్తగా నిందితులుగా చేర్చింది. ఇప్పటికే రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లు నిందితులుగా ఉన్నారు. సంతోష్‌తోపాటు కేరళ వైద్యుడు డా.జగ్గుస్వామి, బీడీజేఎస్‌ నేత తుషార్‌, కరీంనగర్‌ న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌లను నిందితుల జాబితాలో చేర్చుతున్నట్లు ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో సిట్‌ తాజాగా మెమో దాఖలు చేసింది. విచారణకు రావాలంటూ వీరందరికీ ఇప్పటికే నోటీసులు జారీ చేసినా.. శ్రీనివాస్‌ మినహా మిగిలిన ముగ్గురూ రాలేదు. ఈ నెల 21, 22 తేదీల్లో విచారణకు వచ్చిన శ్రీనివాస్‌.. మూడో రోజు గైర్హాజరయ్యారు. హైకోర్టు స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఆయన నేడో రేపో మళ్లీ విచారణకు వస్తారని భావిస్తున్నారు. నిందితులతో శ్రీనివాస్‌కు గల సంబంధాలపై కొంత సమాచారాన్ని సిట్‌ సేకరించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నలుగురిని నిందితులుగా చేర్చింది. నిందితుడు నందకుమార్‌కు, న్యాయవాది శ్రీనివాస్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలను సిట్‌ గుర్తించింది. రాష్ట్రంలోని ఓ జాతీయ పార్టీ కీలకనేతతోనూ శ్రీనివాస్‌ భారీఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిపారన్న అనుమానంతో సిట్‌ కూపీ లాగుతోంది. నందకుమార్‌ నుంచి శ్రీనివాస్‌ రూ.55 లక్షలు తీసుకున్నట్లు ఆధారాలు సేకరించింది. ఆ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నానని, వడ్డీగా నెలకు రూ. 1.1 లక్షలు చెల్లిస్తున్నానని శ్రీనివాస్‌ సిట్‌ అధికారులకు చెప్పగా.. ఫోన్‌పే, గూగుల్‌పే ఖాతాల వివరాలు సమర్పించాలని సిట్‌ సూచించింది. నందకుమార్‌ పలు విడతలుగా ఓ ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా విమాన టికెట్లు బుక్‌ చేసినట్లు గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు. నిందితులు సింహయాజి, నందకుమార్‌తో కలిసి పలు ప్రాంతాలకు సంచరించినట్లు గుర్తించి వాటిపైనా సిట్‌ దృష్టి సారించింది. విచారణకు హాజరైనప్పుడు శ్రీనివాస్‌ కొత్త ఫోన్‌ను మాత్రమే తీసుకొచ్చినట్లు సమాచారం. పాత ఫోన్‌ పాడైపోవడంతో జూన్‌ నుంచి కొత్త ఫోన్‌ను వినియోగిస్తున్నట్లు ఆయన సిట్‌కు తెలిపారు. కానీ పాత ఫోన్‌లో కీలక ఆధారాలుంటాయని సిట్‌ అనుమానిస్తోంది. ఈసారి వచ్చినప్పుడు ఆయన సరైన వివరాలు సమర్పించకుంటే కఠినచర్యలకు దిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

29న రావాలని రఘురామకు పిలుపు

ఈ కేసులో కొత్తగా ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (వైకాపా) పేరు వెలుగు చూసింది. ఈ నెల 29న విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు సిట్‌ 41ఏ సీఆర్పీసీ నోటీసు జారీ చేసింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌నం.76లోని చిరునామాతో వాట్సప్‌ ద్వారా ఈ నోటీసు పంపినట్లు సమాచారం. నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌లు రఘురామతో దిగిన చిత్రాలు గతంలో వైరల్‌ అయిన నేపథ్యంలో నోటీసు ప్రాధాన్యం సంతరించుకొంది. కేసులో కీలకంగా భావిస్తున్న కేరళ వైద్యుడు డా.జగ్గుస్వామి ఆచూకీ లభించకపోవడంతో అతడి సంబంధీకులకు సిట్‌ 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేసింది. అతడి సోదరుడు మనీలాల్‌, వ్యక్తిగత సహాయకులు శరత్‌, ప్రశాంత్‌, విమల్‌, అమృత ఇన్‌స్టిట్యూట్‌ సీఎస్‌వో ప్రతాపన్‌లకు తాఖీదులు పంపింది.

నేడు సిట్‌ ముందుకు న్యాయవాది

న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌ శుక్రవారం సిట్‌ విచారణకు హాజరు కానున్నారు. ఈయనకు ఇప్పటికే సిట్‌ 41ఏ నోటీసులిచ్చి విచారణకు రావాలని కోరింది. దాన్ని సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించినా.. శుక్రవారం సిట్‌ విచారణకు హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆయనను అరెస్టు చేయొద్దని సిట్‌కు స్పష్టం చేసింది. నందకుమార్‌ భార్య చిత్రలేఖ కూడా శుక్రవారం సిట్‌ ఎదుట హాజరు కానున్నట్లు సమాచారం.

నోటీసులు రాలేదు: ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: తెలంగాణ పోలీసుల నుంచి తనకు ఎటువంటి నోటీసులు రాలేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. దిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నోటీసులు పంపారన్న ప్రచారం చూసి.. తమ న్యాయవాదిని ఏసీబీ కోర్టుకు పంపినట్లు తెలిపారు. కానీ న్యాయవాది తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఆయన చెప్పారు. నోటీసు వస్తే తగిన విధంగా స్పందిస్తానన్నారు. కలలో కూడా అటువంటి చెత్త పనుల్లో తాను భాగస్వామిని కానని ఆయన తెలిపారు. దిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ ప్రశ్నిస్తుందనే భయంతోనే.. ఎంపీ విజయసాయిరెడ్డి తన ఫోన్‌ను ధ్వంసం చేసి అది పోయిందంటూ నాటకాలాడుతున్నారని రఘురామ ఆరోపించారు.

దిల్లీలో రోజూ ఎంతోమంది తనతో ఫొటోలు దిగుతారని.. తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందకుమార్‌ అలా ఎప్పుడు ఫొటో దిగారో తెలియదని, అతడితో తనకు పరిచయమే లేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని