China: ఇల్లు శుభ్రంగా లేకుంటే జరిమానా.. చైనా కౌంటీలో వింత నిబంధన

చైనాలోని ఓ కౌంటీలో అధికారులు వింత నిబంధన అమల్లోకి తీసుకొచ్చారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచని వారికి జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు.

Published : 23 Nov 2023 13:40 IST

బీజింగ్: చైనా (China)లోని ఓ కౌంటీలో అధికారులు తీసుకొచ్చిన నిబంధనపై అక్కడి సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. సిచువాన్‌ (Sichuan) ప్రావిన్స్‌లోని పుగే (Puge) కౌంటీలో ఇంటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసిన వారికి జరిమానా విధిస్తామని అధికారులు ప్రకటించినట్లు సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ (SCMP) పత్రిక పేర్కొంది. ఈ నిబంధనల ప్రకారం కౌంటీలోని ప్రజలు తమ ఇళ్లను, వంట పాత్రలను శుభ్రం చేయకుంటే 1.4 డాలర్లు, భోజన సమయంలో కింద కూర్చుంటే 2.8 డాలర్లు జరిమానా విధించనున్నారు.

కౌంటీలోని ప్రజల జీనవ ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రూపొందించిన కొత్త విధివిధానాల్లో భాగంగా ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. ఇందుకోసం జరిమానా కేటగిరీలను 14 భాగాలుగా విభజించారు. అధికారులు తనిఖీల కోసం వచ్చిన సమయంలో ఇంట్లో సాలె పురుగులు, ఇతరత్రా కీటకాలు, దుమ్ముధూళి ఉంటే మొదటి సారి మూడు నుంచి పది యువాన్లు జరిమానా విధించనున్నారు. రెండోసారి తనిఖీల్లో కూడా ఆ ఇంట శుభ్రత లేకుంటే జరిమానా మొత్తాన్ని రెట్టింపు చేస్తారని ఎస్‌సీఎమ్‌పీ కథనంలో వెల్లడించింది. ఈ నిబంధనపై కౌంటీ వైస్‌ డైరెక్టర్‌ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. అపరిశుభ్రతను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే దీని లక్ష్యమని తెలిపారు.

‘‘కౌంటీలో కొందరి ఇళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇల్లంతా బూజు పట్టిన స్థితిలో అపరిశుభ్ర వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నారు. వారు భోజనం చేస్తున్న చోటులోనే కుక్కలు, దోమలు తిరుగుతున్నాయి. ఈ సమస్యను జరిమానాలు పరిష్కరించలేవు. కానీ, ప్రజలు తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు మాత్రం ఈ నిబంధనలు దోహదపడతాయని భావిస్తున్నాం’’ అని వైస్‌ డైరెక్టర్ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని