భారత్‌కు ఎప్పుడో ఆధారాలిచ్చాం

భారత్‌ను రెచ్చగొట్టడం తమ ఉద్దేశం కాదంటూనే కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు.

Published : 24 Sep 2023 06:01 IST

నిజాల నిరూపణలో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం
నిజ్జర్‌ హత్యపై కెనడా ప్రధాని ట్రూడో

టొరంటో, వాషింగ్టన్‌, దిల్లీ: భారత్‌ను రెచ్చగొట్టడం తమ ఉద్దేశం కాదంటూనే కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. కెనడాలో ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చన్న విశ్వసనీయమైన ఆరోపణలపై ఆధారాలను చాలా వారాల క్రితమే భారత్‌కు ఇచ్చామని, నిజాల నిరూపణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కెనడా పర్యటనకు వచ్చిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. నిజ్జర్‌ హత్యోదంతంతో చెలరేగిన వివాదంపై ఈ మేరకు తాజాగా స్పందించారు. ‘సీరియస్‌ అంశంలో వాస్తవాలను గుర్తించేందుకు భారత్‌ మాతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నాం. రెండు దేశాలూ ఈ కేసులో నిజాన్ని తేల్చడం ముఖ్యం. దానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని అన్నారు. నిజ్జర్‌ విషయంలో కెనడా ఇప్పటివరకు ఎలాంటి నిర్దిష్ట సమాచారాన్ని చెప్పలేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి దిల్లీలో స్పష్టంచేశారు.

కెనడాలోని హిందువులపై విద్వేషాన్ని రగిల్చేలా ఆన్‌లైన్‌లో జరుగుతున్న ప్రచారాన్ని కెనడా మంత్రులు, రాజకీయనాయకులు ఖండించారు. హిందువుల్ని తాము స్వాగతిస్తున్నామని, వారు కెనడాలో సురక్షితంగానే ఉన్నారని తెలిపారు. నిజ్జర్‌ మత నాయకుడు కాదని, ఉగ్రవాదేనని దిల్లీలో ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 1980-90 మధ్య పంజాబ్‌లో సుమారు 200 మందిని హతమార్చిన దీపా హెరన్‌వాలాతో నిజ్జర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపాయి. 1996లో కెనడాకు పారిపోవడం నుంచి ఎక్కడెక్కడ ఏయే కార్యకలాపాలు నిర్వహించిందీ వివరించాయి. హరియాణాలోని సిర్సాలో డేరా సచ్ఛాసౌధా ప్రధాన కార్యాలయంపై ఉగ్రదాడికి పన్నాగం పన్నినా, భారత వీసా మంజూరుకాకపోవడం వల్ల రాలేదని తెలిపాయి.

జవాబుదారీ ముఖ్యం: బ్లింకెన్‌

ప్రస్తుత వివాదం విషయంలో కెనడాకు భారత్‌ సహకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ పిలుపునిచ్చారు. ‘మేం జవాబుదారీని చూడాలనుకుంటున్నాం. దర్యాప్తు కొనసాగడం, వాస్తవాలు వెలుగులోకి రావడం ముఖ్యం’ అని వ్యాఖ్యానించారు. ట్రూడో ఆరోపణలు తీవ్ర కలవరం కలిగించాయన్నారు. భారత్‌పై ట్రూడో ఆరోపణలు చేయడానికి ముందు ‘ఫైవ్‌ ఐస్‌’ కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు నిఘా వర్గాల సమాచారం అందిందని కెనడాలో అమెరికా రాయబారి డేవిడ్‌ కోహెన్‌ ధ్రువీకరించారు.

అమెరికా మొగ్గు భారత్‌వైపే: పెంటగాన్‌ మాజీ అధికారి

ఖలిస్థాన్‌ నేత హత్యోదంతంలో భారత్‌కు బాసటగానే అమెరికా నిలిచే అవకాశం ఉందని పెంటగాన్‌ మాజీ అధికారి మైఖేల్‌ రూబిన్‌ అభిప్రాయపడ్డారు. ‘రెండు మిత్రదేశాల విషయంలో ఒకరికి అమెరికా మద్దతుగా నిలుస్తుందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అలా ఎంచుకోవాల్సి వస్తే అమెరికా మొగ్గు భారత్‌ వైపే ఉంటుంది. ఎందుకంటే నిజ్జర్‌ ఒక ఉగ్రవాది. అమెరికాకు భారత్‌ చాలా ముఖ్యమైంది. కెనడా ప్రధాని హోదాలో జస్టిన్‌ ట్రూడో ఎక్కువకాలం కొనసాగకపోవచ్చు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కెనడాతో మా బంధాన్ని పునర్నిర్మించుకుంటాం’ అని చెప్పారు. ‘ఈ ఘర్షణ భారత్‌ కంటే కెనడాకే ఎక్కువ ప్రమాదం. ఘర్షణే కావాలనుకుంటే అది ఏనుగుతో చీమ పోరాటంలాగే ఉంటుంది. ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమనేది వాస్తవం. చైనాను ఎదుర్కొనే విషయంలో వ్యూహాత్మకంగా భారత్‌తో మా బంధం చాలా ముఖ్యమైంది’ అని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని