Ukraines Special Operation: టార్గెట్‌ సెవెస్తపోల్‌.. ఉక్రెయిన్‌ దాడిలో దెబ్బతిన్న సబ్‌మెరైన్‌..!

రష్యాకు చెందిన నల్ల సముద్ర దళాన్ని ఇప్పుడు ఉక్రెయిన్‌ మెల్లిగా కకావికలం చేస్తోంది. గతేడాది మాస్కోవా మునకతో భారీగా దెబ్బతిన్న ఈ దళానికి గత వారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. కిలోశ్రేణి సబ్‌మెరైన్‌పై ఉక్రెయిన్‌ క్షిపణి దాడి చేసి తీవ్రంగా దెబ్బతీసింది.

Published : 18 Sep 2023 11:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా(Russia)కు నల్లసముద్రంపై తిరుగులేని ఆధిపత్యం అందించిన సెవెస్తపోల్‌ నౌకాశ్రయం ఇప్పుడు ఉక్రెయిన్‌ (Ukrain) దాడులకు లక్ష్యంగా మారింది. ఇటీవల దాడిలో రష్యాకు చెందిన నౌకలు దెబ్బతిన్నాయి. దీంతోపాటు కిలోక్లాస్‌ సబ్‌మెరైన్‌ కూడా క్షిపణి దాడిలో దెబ్బతిన్నట్లు బ్రిటన్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు రెండ్రోజుల క్రితం ధ్రువీకరించాయి. ఇది రష్యాకు భారీ ఎదురుదెబ్బ. ఇటీవల రష్యాపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే.

సెప్టెంబర్‌ 13న ఉక్రెయిన్‌ ప్రయోగించిన క్షిపణులు సెవెస్తపోల్‌లోని సెవ్మోర్‌జవోడ్‌ షిప్‌యార్డ్‌పై విరుచుకుపడ్డాయి. అక్కడే ఉన్న ల్యాండిషిప్ మిన్స్క్‌ ఈ దాడిలో దెబ్బతింది. దీంతోపాటు నిర్వహణ పనుల నిమిత్తం అక్కడే నిలిపి ఉంచిన కిలో 636.3 శ్రేణికి చెందిన ‘రోస్తోవ్‌ ఆన్‌ డాన్‌’ సబ్‌మెరైన్‌ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఇటీవల ప్రపంచంలో శత్రు దాడుల్లో దెబ్బతిన్న జలాంతర్గామి ఇదే. రష్యాకు చెందిన బ్లాక్‌సీ దళంలోని నాలుగు క్రూయిజ్‌ మిసైల్‌ సబ్‌మెరైన్లలో ఇది కూడా ఒకటి. ఒక్కో జలాంతర్గామి 3 లేదా 4 కిలిబ్ర్‌ క్షిపణులను ప్రయోగించగలదు.

ఈ దాడి గురించి బయటకు వెల్లడిస్తే పరువు పోతుందని రష్యా భావించింది. దీంతో కేవలం రెండు నౌకలు దెబ్బతిన్నాయని ముక్తసరి ప్రకటనతో సరిపుచ్చింది. ఈ దాడిలో దెబ్బతిన్న జలాంతర్గామి తిరిగి సర్వీసులోకి రావాలంటే కొన్నేళ్లపాటు మరమ్మతులు చేయాలి. అదే సమయంలో రష్యాకు మిలియన్ల మేర డాలర్లు వదులుతాయి.

ఒకరి జీవితాన్ని మరొకరు వెల కట్టలేరు

అంతేకాదు.. ఈ డ్రై డాక్‌లో చిక్కుకుపోయిన నౌక, సబ్‌మెరైన్‌ శకలాలను తొలగించాలన్నా రష్యాకు భారీగా ఖర్చు కానుంది. ఫలితంగా ఈ డ్రై డాక్‌లు కొన్ని నెలలపాటు యుద్ధ సమయంలో మూతపడనున్నాయి. యుద్ధం ఆరంభం నుంచి ఈ నౌకాదళ స్థావరంపై ఉక్రెయిన్‌ కన్నేసింది. ఈ స్థావరంపై దాడికి తన స్టార్‌ లింక్‌ సహకరించదని మస్క్‌ గతేడాది ఉక్రెయిన్‌కు వెల్లడించారు. ఇది అణుదాడికి దారి తీస్తుందని ఆయన భయపడిన విషయం తెలిసిందే. కానీ, ఉక్రెయిన్‌ మాత్రం పట్టువీడలేదు. ఇక్కడ మాస్కోవాను ముంచి వేయడంతోపాటు.. పలు మార్లు సముద్ర డ్రోన్లను ప్రయోగించి రష్యా నౌకలను దెబ్బతీసింది. ఆగస్టు 20న ఇక్కడ నేవీ హెడ్‌క్వార్టర్స్‌పై ఏకంగా డ్రోన్‌తో దాడి చేసింది. 

సోవియట్‌-రష్యా చరిత్రలో కిలో శ్రేణి సబ్‌మెరైన్లకు ప్రత్యేక స్థానం..

కోల్డ్‌వార్‌ సమయంలో సోవియట్‌ యూనియన్‌ అభివృద్ధి చేసిన చివరి డీజిల్‌ ఎలక్ట్రిక్‌ సబ్‌మెరైన ఇదే. సోవియట్‌ పతనం తర్వాత రష్యా చేతికి దక్కింది. మాస్కో అత్యధికంగా ఎగుమతి చేసింది కిలోశ్రేణి సబ్‌మెరైన్లే. వీటిల్లో భారత్‌ కూడా దాదాపు 10 కిలో 877 శ్రేణి జలాంతర్గాములను కొన్నది. వీటిల్లో 8 ఇప్పటికీ సర్వీసులో ఉన్నాయి. రష్యా, అల్జీరియా, చైనా, భారత్‌, మయన్మార్‌, పోలాండ్‌, ఇరాన్‌, రొమేనియా, వియత్నాం దేశాలు వీటిని ఇప్పటికీ వాడుతున్నాయి. వీటిల్లో అత్యాధునిక వెర్షన్‌ కిలో 636.3. కోల్డ్‌వార్‌ సమయంలో ఈ కిలో శ్రేణి సబ్‌మెరైన్ల స్టెల్త్‌ సామర్థ్యాల కారణంగా దీనిని ప్రత్యర్థులు ‘బ్లాక్‌ హోల్‌’ అని పిలిచేవారు. దీనిలో చాలా తక్కువ శబ్దం రావడంతో ఈ పేరు వచ్చింది.

ఆదివారం కూడా సెవెస్తపోల్‌పై దాడి..

కీవ్‌ ప్రత్యేక దళాలు తాజాగా ఆదివారం నిర్వహించిన ఆపరేషన్‌తో సెవెస్తపోల్‌ దద్దరిల్లిపోయింది. ఇది తమ దళాల పనే అని ఉక్రెయిన్‌ చెబుతోంది. కానీ, రష్యా నియమించిన క్రిమియా గవర్నర్‌ మాత్రం.. తమ నౌకాదళం వినియోగించిన మందుగుండు కారణంగా జరిగిన పేలుళ్లని చెబుతున్నారు. సెవెస్తపోల్‌ దక్షిణ తీరంలో భారీగా పేలుళ్లు జరిగాయి. దీంతోపాటు దట్టమైన పొగ వ్యాపించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని