పదిలమైన ఉద్యోగం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో కొలువుదీరాలని ఉందా? పదో తరగతి మీ అర్హతా? అయితే భారతీయ తీర గస్తీ దళం (ఇండియన్‌ కోస్ట్‌ గార్డు) ...

Updated : 15 Feb 2024 16:36 IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో కొలువుదీరాలని ఉందా? పదో తరగతి మీ అర్హతా? అయితే భారతీయ తీర గస్తీ దళం (ఇండియన్‌ కోస్ట్‌ గార్డు) నావిక్‌ (కుక్‌, స్టీవార్డ్‌) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష, శరీరదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు.

ఎంపికైనవారికి ఏప్రిల్‌ నుంచి శిక్షణ మొదలవుతుంది. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే రూ.35,000 వరకు వేతన రూపంలో పొందవచ్ఛు.

యాభై శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులైనవారు నావిక్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం మార్కులు సరిపోతాయి. వయసు కనిష్ఠంగా 18 ఏళ్లు ఉండాలి. అంటే ఏప్రిల్‌1, 1998- మార్చి31, 2002ల మధ్య అభ్యర్థులు జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. పరీక్షల్లో నెగ్గి ఎంపికైనవారికి ప్రాథమిక శిక్షణ ఐఎన్‌ఎస్‌ చిల్కలో ప్రారంభమవుతుంది. ఇక్కడ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పోస్టింగు ఇస్తారు.'

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 30.10.2019

ఆన్‌లైన్‌ దరఖాస్తుల చివరితేది: 08.11.2019

పరీక్షకేంద్రం: రాష్ట్రానికి ఒక ప్రధాన కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తారు.

www.joinindiancoastguard.gov.in

విధుల్లో చేరినవారికి రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు అదనం. వేతనంతో పాటు ఇతర ప్రయోజనాలు (క్యాంటీన్‌, వసతి, దుస్తులు, ఎల్‌టీసీ.. మొదలైనవి) ఉంటాయి. అన్ని ప్రోత్సాహకాలూ కలుపుకుని రూ.35 వేల వరకు వేతన రూపంలో పొందవచ్ఛు భవిష్యత్తులో ప్రధానాధికారి హోదా వరకూ చేరుకోవచ్చు.

రాతపరీక్ష ఇలా...

దరఖాస్తుదారులకు నవంబరు నెలాఖరులో పరీక్షలుంటాయి. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, మ్యాథ్స్‌, జనరల్‌ సైన్స్‌, జనరల్‌ ఇంగ్లీష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కరెంట్‌ అఫైర్స్‌ నుంచీ ప్రశ్నలు వస్తాయి. రాతపరీక్షలో అర్హత సాధించినవారికి శరీరదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థుల వివరాలను రాతపరీక్ష సమయంలో పరిశీలిస్తారు. పరీక్షకు వెళ్లేటప్పుడే పదోతరగతి సర్టిఫికెట్‌, ఫొటో, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు, సర్టిఫికెట్ల నకళ్లు తీసుకెళ్లాలి.

శరీరదార్ఢ్య పరీక్ష (పీఈటీ): ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చకముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలత వ్యత్యాసం కనీసం 5 సెం.మీ.ఉండాలి. ఈ విభాగంలో అర్హత సాధించడానికి 7 నిమిషాల్లో 1.6 కి.మీ దూరం పరుగెత్తాలి. 20 గుంజీలు, 10 పుష్‌అప్‌లు తీయగలగాలి. పీఈటీలో అర్హత పొందితే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. స్పష్టమైన కంటిచూపు ఉండాలి, వినికిడిలోపం ఉండకూడదు.

రాతపరీక్ష, పీఈటీ, మెడికల్‌ టెస్టుల్లో ఉత్తీర్ణులైనవారితో తుది నియామకాలు చేపడతారు. ఎంపికైనవారి వివరాలను కోస్ట్‌గార్డు వెబ్‌సైట్‌లో ఉంచుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని