బార్క్‌లో కొలువులు!

ముంబయి ట్రాంబేలోని భారత అణుశక్తి విభాగానికి చెందిన భాభా అణుశక్తి పరిశోధనా కేంద్రం ఉద్యోగ నియామకాలు జరపనుంది. వివిధ విభాగాల్లో 4,374 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

Updated : 26 Apr 2023 01:12 IST

టెక్నికల్‌ ఆఫీసర్‌, స్టైపెండరీ పోస్టుల భర్తీకి ప్రకటన

ముంబయి ట్రాంబేలోని భారత అణుశక్తి విభాగానికి చెందిన భాభా అణుశక్తి పరిశోధనా కేంద్రం ఉద్యోగ నియామకాలు జరపనుంది. వివిధ విభాగాల్లో 4,374 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, ట్రైనింగ్‌ స్కీమ్‌.. రెండు విధాలుగా ఎంపిక చేస్తారు.

యోసైన్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, ఆర్కిటెక్చర్‌, కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, డ్రిల్లింగ్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెకానికల్‌, మెటలర్జీ, మైనింగ్‌ మొదలైన విభాగాల్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

* డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మొత్తం 212 పోస్టులను భర్తీచేస్తారు.

వీటిల్లో టెక్నికల్‌ ఆఫీసర్‌-సి: 181 పోస్టులు, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-బి: 7, టెక్నీషియన్‌-బి: 24 ఉన్నాయి.

టెక్నికల్‌ ఆఫీసర్‌-సి పోస్టుకు ఎంఎస్సీ., ఎం.లిబ్‌., బీఈ/బీటెక్‌ 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-బి పోస్టుకు బీఎస్సీ (ఫుడ్‌ టెక్నాలజీ/హోమ్‌ సైన్స్‌/న్యూట్రిషన్‌) 60 శాతం మార్కులతో పాసవ్వాలి. టెక్నీషియన్‌-బి పోస్టుకు పదోతరగతి పాసై.. సెకండ్‌క్లాస్‌ బాయిలర్‌ అటెండెంట్స్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

* ట్రైనింగ్‌ స్కీమ్‌ (స్టైపెండరీ ట్రైనీ) ద్వారా మొత్తం 4,162 పోస్టులను భర్తీ చేయనున్నారు.

వీటిల్లో కేటగిరీ-1లో 1216 పోస్టులు, కేటగిరీ-2లో 2946 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ-1 పోస్టులకు నెలకు రూ.24,000 నుంచి రూ.26,000 స్టైపెండ్‌ చెల్లిస్తారు. కేటగిరీ-2 పోస్టులకు స్టైపెండ్‌ నెలకు రూ.20,000 నుంచి రూ.22,000 వరకూ ఉంటుంది.

* కేటగిరీ-1 స్టైపెండరీ ట్రెయినీలో.. బయోకెమిస్ట్రీ/బయోసైన్స్‌/లైఫ్‌ సైన్స్‌/బయాలజీ విభాగాల్లో 21, కెమిస్ట్రీ-169, ఫిజిక్స్‌-117, కంప్యూటర్‌ సైన్స్‌-25, అగ్రికల్చర్‌-2, హార్టీకల్చర్‌-6, కెమికల్‌-171, ఎలక్ట్రికల్‌-144, ఎలక్ట్రానిక్స్‌-98, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌-59, మెకానికల్‌-328, మెటలర్జి-5, ఆర్కిటెక్చర్‌-2, సివిల్‌-62, ఆటోమొబైల్‌-4, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ-3 పోస్టులు ఉన్నాయి.

కేటగిరీ-2 స్టైపెండరీ ట్రెయినీలో.. ఫిట్టర్‌-698, టర్నర్‌/మెషినిస్ట్‌-213, వెల్డర్‌-99, మెకానిక్‌ మెషీన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌-18, ఎలక్ట్రీషియన్‌-399, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌-226, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌-152, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ మెకానిక్‌-95, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (మెకానికల్‌)-52, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (సివిల్‌)-15, మేషన్‌-30, ప్లంబర్‌-42, కార్పెంటర్‌-27, మెకానిక్‌ మోటార్‌ వెహికల్‌-24, డీజిల్‌ మెకానిక్‌-19, ప్లాంట్‌ ఆపరేటర్‌-532, ల్యాబొరేటరీ- 303, డెంటల్‌ టెక్నీషియన్‌ -హైజీనిస్ట్‌-1, డెంటల్‌ టెక్నీషియన్‌-మెకానిక్‌-1 ఉన్నాయి. ల్యాబొరేటరీ, డెంటల్‌ టెక్నీషియన్‌-హైజీనిస్ట్‌, డెంటల్‌ టెక్నీషియన్‌-మెకానిక్‌ పోస్టులు తప్ప... మిగతా అన్నింటికీ సైన్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో పదోతరగతి 60 శాతం మార్కులతో పాసవ్వాలి. సంబంధిత విభాగాల్లో ఐటీఐ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

ల్యాబొరేటరీ-303. ఈ పోస్టులకు ఇంటర్మీడియట్‌ ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో 60 శాతం మార్కులతో పాసవ్వాలి. డెంటల్‌ టెక్నీషియన్‌- హైజీనిస్ట్‌-1 పోస్టుకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయోలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. డెంటల్‌ టెక్నీషియన్‌-మెకానిక్‌-1 పోస్టుకు ఇంటర్మీడియట్‌ సైన్స్‌ సబ్జెక్టుతో 60 శాతం మార్కులతో పాసవడంతోపాటు డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రెండేళ్ల డిప్లొమా ఉండాలి.

పోస్టులను అనుసరించి వయః పరిమితిలో తేడాలు ఉన్నాయి. 22.05.2023 నాటికి టెక్నికల్‌ ఆఫీసర్‌కు 18-35, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌కు 18-30, టెక్నీషియన్‌కు 18-25,   స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-1కు 19-24,    కేటగిరీ-2కు 18-22 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఓబీసీలకు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ఎలా?

పోస్టును బట్టి ప్రిలిమినరీ టెస్ట్‌, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

టెక్నికల్‌ ఆఫీసర్‌-సి పోస్టుకు: ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎక్కువమంది దరఖాస్తు చేసినట్లయితే .. ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైనవారికి ఇంటర్వ్యూలు ఉంటాయి.  

సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-బి, కేటగిరీ-1 స్టైపెండరీ ట్రెయినీ పోస్టులకు: గంట వ్యవధిలో కంప్యూటర్‌ బేస్డ్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. 40 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికీ 3 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికీ 1 మార్కు తగ్గిస్తారు. ప్రశ్నపత్రాన్ని డిప్లొమా/బీఎస్సీ సిలబస్‌ ఆధారంగా రూపొందిస్తారు. స్క్రీనింగ్‌ టెస్ట్‌లో అర్హత సాధించినవాళ్లను ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూను ఎక్కడ నిర్వహించేది తర్వాత తెలియజేస్తారు. అభ్యర్థుల తుది ఎంపిక ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగానే ఉంటుంది. స్క్రీనింగ్‌టెస్ట్‌లో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.

టెక్నీషియన్‌-బి, కేటగిరీ-2 స్టైపెండరీ ట్రెయినీ పోస్టులకు: మూడు దశల్లో జరిగే పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. స్టేజ్‌-1లో ప్రిలిమినరీ టెస్ట్‌, స్టేజ్‌-2లో అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌, స్టేజ్‌-3లో స్కిల్‌ టెస్ట్‌ ఉంటాయి.

స్టేజ్‌-1 ప్రిలిమినరీ టెస్ట్‌: దీంట్లో భాగంగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. దీంట్లో 50 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటే.. మేథమెటిక్స్‌ - 20 ప్రశ్నలు, సైన్స్‌ - 20 ప్రశ్నలు, జనరల్‌ అవేర్‌నెస్‌-10 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి కరెక్టు సమాధానానికీ 3 మార్కులు, ప్రతి తప్పు సమాధానానికీ 1 మార్కు తగ్గిస్తారు. 40 శాతం కంటే తక్కువ మార్కులు సాధించిన జనరల్‌ అభ్యర్థులూ, 30 శాతం కంటే తక్కువ మార్కులు సాధించిన రిజర్వుడ్‌ అభ్యర్థులను అనర్హులుగా పరిగణిస్తారు. దీంట్లో ప్రతిభ చూపినవాళ్లను స్టేజ్‌-2లోని అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌కు ఎంపికచేస్తారు. పరీక్ష వ్యవధి గంట.

స్టేజ్‌-2 అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌: ఈ పరీక్షలో 50 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి 2 గంటలు. కరెక్టు సమాధానానికి 3 మార్కులు, ప్రతి తప్పు సమాధానానికీ 1 మార్కు తగ్గిస్తారు. దీంట్లో సాధించిన మార్కుల ఆధారంగానే మెరిట్‌ లిస్టును తయారుచేస్తారు. 30 శాతం కంటే తక్కువ మార్కులు సాధించిన జనరల్‌ అభ్యర్థులనూ, 20 శాతం కంటే తక్కువ మార్కులు సంపాదించిన రిజర్వుడ్‌ అభ్యర్థులను అనర్హులుగా పరిగణిస్తారు.

స్టేజ్‌-3 - స్కిల్‌ టెస్ట్‌: స్టేజ్‌-2లో ప్రతిభ చూసిన అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ను తయారుచేసి స్కిల్‌ టెస్ట్‌కు ఎంపిచేస్తారు. స్టేజ్‌-1, స్టేజ్‌-2లో తక్కువ నెగెటివ్‌ మార్కులు పొందినవాళ్లూ, స్టేజ్‌-1లో మేథమెటిక్‌, సైన్స్‌లో ఎక్కువ మార్కులు పొందినవాళ్లు మెరిట్‌ లిస్టులో అగ్రస్థానంలో ఉంటారు.

దరఖాస్తు రుసుము: టీవోకు రూ.500, ఎస్‌ఏకు రూ.150, టెక్నీషియన్‌కు రూ.100, కేటగిరీ-1కు రూ.150, కేటగిరీ-2కు రూ.100. ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది.

* ఒకటికంటే ఎక్కువ విభాగాలకు పోటీ పడాలంటే వేర్వేరుగా దరఖాస్తులు పంపాలి.

* ఎంపికైన అభ్యర్థులు మూడేళ్లకు బాండ్‌ రాయాలి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్‌లో.. అమరావతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం.

తెలంగాణలో.. హైదరాబాద్‌, కరీంనగర్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22.05.2023

వెబ్‌సైట్‌: https://barconlineexam.com

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని