జ్ఞాన సముపార్జనతో కూడిన విద్యా విధానమే ముఖ్యం!

Eenadu icon
By Features Desk Published : 30 Oct 2025 01:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

పోటీ పరీక్షల ప్రత్యేకం

ఏ దేశమైనా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే విద్య, నైపుణ్యం కలిగిన జనాభా అవసరం. వీరికి దేశ వర్తమానాన్ని, భవిష్యత్తును ప్రభావితం చేసే సత్తాఉంటుంది. అయితే నాణ్యత లేని, లోపభుయీష్టమైన విద్యావిధానం కారణంగా ప్రజలకు సరైన ఉపాధి లభించదు. నిరుద్యోగ సమస్య తలెత్తుతుంది. అపార మానవ వనరులు నిరుపయోగంగా ఉండటం వల్ల దేశ ప్రగతి, ఆర్థికాభివృద్ధి కుంటుపడతాయి. ఇది ఒక సాంఘిక, ఆర్థిక సమస్యగా మారుతుంది. భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతోన్న
దేశాలకు ఇది ప్రధాన అవరోధంగా మారుతోంది. దీన్ని అధిగమించాలంటే సరైన శిక్షణతో కూడిన విద్యాభ్యాసం అవసరం. ప్రథమ్‌ ఫౌండేషన్‌ అనే ఎన్‌జీఓ భారతదేశంలోని విద్యా విధానానికి సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. అందులోని అంశాలపై పోటీపరీక్షార్థులకు అవగాహన అవసరం.

భారతదేశంలో ఆర్థిక సమస్యలు - విద్యారంగం

భారతదేశంలో వార్షిక విద్యా స్థితి నివేదిక 2024
(Annual Status of Education Report - ASER)
దీన్ని 2025, జనవరి 28న ప్రకటించారు. ఈ నివేదిక ప్రకారం దేశంలోని 605 జిల్లాల్లోని (గ్రామీణ) 17,997 గ్రామాలు; 6,49,491 మంది విద్యార్థులను శాంపిల్‌గా తీసుకుని సర్వే నిర్వహించారు. 15,728 ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. వాటిలో 8,504 ప్రాథమిక పాఠశాలలు, 7,224 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.

  • ప్రథమ్‌ సంస్థ 2005 నుంచి ఏటా ఈ నివేదికను విడుదల చేస్తోంది. 2024 నివేదికను పరిశీలిస్తే..
  • ప్రీ - ప్రైమరీ స్కూళ్లల్లో నమోదు (3 - 5 ఏళ్ల వయసు పిల్లలు) 
  • 2018 నుంచి 2024 మధ్య కాలంలో అంగన్‌వాడీ కేంద్రాలు, గవర్నమెంట్‌ ప్రీ-ప్రైమరీ తరగతి లేదా ప్రైవేట్‌ ఎల్‌కేజీ/ యూకేజీ పాఠశాల్లో 3 నుంచి అయిదేళ్ల వయసున్న పిల్లల నమోదు క్రమంగా మెరుగుపడింది. 
  • ప్రీ - ప్రైమరీ స్కూల్స్‌లో 3 ఏళ్ల వయసు పిల్లల నమోదు 2018లో 68.1% ఉండగా 2024 నాటికి 77.4శాతానికి పెరిగింది. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు ఈ విభాగంలో దాదాపు సంపూర్ణ స్థాయి సాధించాయి. 
  • 4 సంవత్సరాల వయసు పిల్లల్లో దేశవ్యాప్తంగా ప్రీ - ప్రైమరీ స్కూల్స్‌లో నమోదు 2018లో 76% నుంచి 2022లో 82%, 2024లో 83.4శాతానికి పెరిగింది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు పూర్తి నమోదు రేటు సాధించాయి.
  • అయిదేళ్ల వయసున్న పిల్లలను పరిశీలిస్తే, 2018లో 58.5% నుంచి 2022లో 71.4శాతానికి పెరిగింది. 90% కంటే ఎక్కువ నమోదు ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, నాగాలాండ్‌ ఉన్నాయి.
  • దేశంలో ప్రీ - ప్రైమరీ పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాలు విస్తృతమైన సేవలను అందిస్తున్నాయి.
  • 2024లో అయిదేళ్ల పిల్లల్లో దాదాపు మూడింట ఒక వంతు ప్రైవేట్‌ స్కూల్స్‌ లేదా ప్రీ - స్కూల్స్‌కు హాజరవుతున్నారు. ఈ సంఖ్య 2018లో 37.3% ఉండగా 2022లో 30.8శాతానికి తగ్గింది. 2024లో 37.5శాతంగా ఉంది.

చదవడం

  • మూడో తరగతి: 2018లో మూడో తరగతి పిల్లలు రెండో తరగతి స్థాయి పాఠ్యాంశాలను చదవగలిగే శాతం 20.9% కాగా 2024లో ఇది 23.4 శాతానికి పెరిగింది. ఈ విషయంలో ప్రైవేట్‌ స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలలు ముందంజలో ఉన్నాయి.
  • 2022లో చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మూడో తరగతి పఠన స్థాయులు తగ్గగా, 2024లో అన్ని స్కూళ్లు మెరుగుదల నమోదు చేశాయి. 
  • 2022, 2024 మధ్య ప్రభుత్వ పాఠశాల్లో ఈ నిష్పత్తిలో 10% కంటే ఎక్కువ పాయింట్ల పెరుగుదల నమోదైంది. ఈ విషయంలో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, ఉత్తర్‌ ప్రదేశ్, హరియాణా, ఒడిశా, మహారాష్ట్ర ముందంజలో ఉన్నాయి.
  • 5వ తరగతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న అయిదో తరగతి పిల్లల్లో పఠన స్థాయులు గణనీయంగా మెరుగుపడినట్లు నివేదిక వెల్లడించింది.
  • గవర్నమెంట్‌ స్కూళ్లలో రెండో తరగతి పాఠ్యాంశాలు చదవగలిగే అయిదో తరగతి పిల్లల శాతం 2018లో 44.2 శాతం ఉండగా, 2022లో 38.5శాతానికి తగ్గింది. తర్వాత ఈ సంఖ్య 2024లో 44.8శాతానికి కోలుకుంది. 
  • 2024లో ఈ విభాగంలో మిజోరం (64.9%), హిమాచల్‌ప్రదేశ్‌ (64.8%) రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి.
  • 8వ తరగతి: ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతిలో చేరిన పిల్లల్లో పఠన స్థాయులు పెరిగాయి. ఇది 2018లో 69% నుంచి 2022లో 66.2శాతానికి తగ్గింది. అయితే 2024లో 67.5శాతానికి చేరింది. 
  • గుజరాత్, ఉత్తర్‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలు గణనీయమైన వృద్ధిని కలిగిఉన్నాయి.

ఫస్ట్‌ స్టాండర్డ్‌లో (ఒకటో తరగతి) చేరే పిల్లల వయసు జాతీయంగా ఒకటో తరగతిలో చేరే అయిదేళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న పిల్లల నిష్పత్తి క్రమంగా తగ్గుతోంది. ఇలాంటివారి సంఖ్య 2018లో 25.6% ఉండగా, 2024 నాటికి 16.7శాతానికి పరిమితమైంది.

డిజిటల్‌ అక్షరాస్యత

14 - 16 ఏళ్ల వయసు కలిగిన దాదాపు 90% మంది బాలబాలికల ఇళ్లలో స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నట్లు నివేదిక తెలిపింది. 82.2% మందికి వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసని వెల్లడించింది. వీరిలో 57% మంది విద్యా కార్యకలాపాల కోసం, 76% మంది సోషల్‌ మీడియా కోసం ఫోన్లను వినియోగిస్తున్నారు.

  • స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే వారిలో 14 ఏళ్ల పిల్లల్లో 27%, 16 ఏళ్ల వారిలో 37.8% సొంత మొబైళ్లను కలిగి ఉన్నారు.
  • విద్యా కార్యకలాపాల కోసం స్మార్ట్‌ఫోన్‌లను వాడే బాలికలు, బాలురు సమానంగా ఉన్నారు. అయితే సోషల్‌ మీడియా వినియోగంలో మాత్రం అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందంజలో ఉన్నారు.

నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు

ప్రభుత్వ స్కూళ్లలో 6-14 ఏళ్ల పిల్లల నమోదు 2018లో 65.5% ఉండగా, కొవిడ్‌ మహమ్మారి కారణంగా 2022 నాటికి అది 72.9%కి పెరిగింది. 2024లో మాత్రం 66.8%కి 
పడిపోయింది. 
‘ పాఠశాలకు దూరంగా ఉంటున్న 15-16 ఏళ్లలోపు వారిసంఖ్య 2022లో 7.5% ఉండగా, 2024లో 7.9%కి చేరింది. పాఠశాలల్లో చేరని బాలికల సంఖ్య 
మధ్యప్రదేశ్‌ (16.1%), ఉత్తర్‌ప్రదేశ్‌ (15%), 
రాజస్థాన్‌ (12.7%), మిజోరం (12.3%), గుజరాత్‌ (10.5%), ఛత్తీస్‌గఢ్‌ (10%)లలో ఎక్కువగా ఉంది.
‘ ఆట స్థలాలున్న పాఠశాలల సంఖ్య 2022లో 68.9% మేర ఉండగా, 2024నాటికి అది 66.2%కి తగ్గిపోయింది.

6 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లల నమోదు

మొత్తం పాఠశాల నమోదు రేటు 6 - 14 సంవత్సరాల పిల్లల్లో గత 20 సంవత్సరాల్లో 95% అధిగమించింది. 

  • ఈ వయసు మధ్య ఉన్న పిల్లల నమోదు 2022లో 98.4% ఉండగా, 2024లో 98.1శాతంగా ఉంది. అన్ని రాష్ట్రాల్లో 6 నుంచి 14 ఏళ్ల వయసున్న వారి పాఠశాల నమోదు రేటు 2024లో 95%పైగా ఉంది.
  • దేశంలో 2018లో 6 - 14 ఏళ్ల వయసు పిల్లలు 65.6% మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 2024లో ఇది 66.8శాతంగా ఉంది.

రచయితబండారి ధనుంజయ
విషయ నిపుణులు 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని