Lunch: మధ్యాహ్న భోజనం తిన్నాక నిద్రమత్తా?

మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రమత్తుగా అనిపించటం తెలిసిందే. కొందరికి కాసేపు పడుకుంటే గానీ హుషారు కలగదు. ఇంతకీ అన్నం తిన్న తర్వాత ఎందుకు మత్తుగా అనిపిస్తుంది? దీనికి కారణం అన్నంలోని గ్లూకోజు రక్తంలో వేగంగా కలవటమే.

Updated : 16 Jan 2023 10:37 IST

ధ్యాహ్నం భోజనం చేశాక నిద్రమత్తుగా అనిపించటం తెలిసిందే. కొందరికి కాసేపు పడుకుంటే గానీ హుషారు కలగదు. ఇంతకీ అన్నం తిన్న తర్వాత ఎందుకు మత్తుగా అనిపిస్తుంది? దీనికి కారణం అన్నంలోని గ్లూకోజు రక్తంలో వేగంగా కలవటమే. అంతేకాదు, అన్నంతో ప్రశాంతతను కలగజేసే మెలటోనిన్‌, సెరటోనిన్‌ వంటి హార్మోన్లూ విడుదలవుతాయి. ఇవి ఒకింత విశ్రాంతి, మత్తు భావనను కలిగిస్తాయి. ఒక్క అన్నమే కాదు.. చాలారకాల పిండి పదార్థాలతోనూ ఇలాగే అనిపిస్తుంది. మరి దీన్ని అధిగమించటమెలా?

* సహజంగానే మధ్యాహ్నం వేళకు మానసిక శక్తి సన్నగిల్లుతుంది. దీనికి అన్నం కూడా తోడైతే మరింత నిద్ర ముంచుకొస్తుంది. కాబట్టి కాస్త ప్రొటీన్‌ ఎక్కువగా గల ఆహారం తినటం మంచిది. ఇది డోపమైన్‌, ఎపినెఫ్రిన్‌ వంటి చురుకైన రసాయనాలను మెదడు సంశ్లేషించుకోవటానికి తోడ్పడుతుంది. శరీరానికి ఎక్కువ శక్తి లభిస్తుంది. పనుల్లోనూ వేగం పుంజుకుంటుంది.

* అన్నం తినకుండా ఉండలేకపోతే మామూలు బియ్యం కన్నా పొడవైన బాస్మతి బియ్యం వాడుకోవటం మంచిది. వీటిలోని గ్లూకోజు అంత త్వరగా రక్తంలో కలవదు. అలాగని సుష్టుగా తింటారేమో. కొద్దిగానే తినేలా చూసుకోవాలి.

* అన్నానికి బదులు జొన్న, సజ్జ, గోధుమ రొట్టెల్లో ఏదైనా తినొచ్చు. రొట్టెలతో పాటు పన్నీరు లేదా సోయా నగెట్స్‌ తీసుకోవచ్చు. మాంసాహారులైతే కూరగాయలు, సలాడ్‌తో కలిపి చికెన్‌ తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు