పసి కామెర్లా.. పారాహుషార్!
పసుపంటే కొన్నిసార్లు భయం భయం. నిజమే.. మనం శుభ సూచకంగా, మంగళప్రదమైందిగా భావించే పసుపురంగు కంట్లోనో, చర్మం మీదో కనబడితే ఉన్నట్టుండి ఉలిక్కిపడతాం. కామెర్లేమోనని భయపడిపోతాం. ఇది అవసరం కూడా. పసి పిల్లల విషయంలో ఇది మరింత అత్యవసరం. పుట్టిన తొలిరోజుల్లో శిశువుల్లో కామెర్లు సర్వ సాధారణమే కావొచ్చు. కొద్దిరోజుల్లో వాటంతటవే తగ్గిపోనూవచ్చు. కానీ అన్నిసార్లూ ఇలాగే జరగాలనేమీ లేదు. కాలేయ నిర్మాణ లోపాలు, ఇన్ఫెక్షన్లు, జీవక్రియ సమస్యల వంటి సమస్యలతో తలెత్తే కామెర్లు ప్రమాదకరంగానూ పరిణమించొచ్చు. కాబట్టే రెండు వారాలు దాటినా కామెర్లు తగ్గకపోతే తక్షణం అప్రమత్తం కావాలని.. దీన్ని ‘ఎల్లో అలర్ట్’గా పరిగణించాలని వైద్యరంగం స్పష్టంగా చెబుతోంది. లేకపోతే కాలేయం, మెదడు వంటి కీలక అవయవాలు దెబ్బతినొచ్చని గట్టిగా హెచ్చరిస్తోంది. అందుకే శిశు కామెర్లపై సమగ్ర కథనం అందిస్తోంది ఈ వారం సుఖీభవ.....
పసి కామెర్లా.. పారాహుషార్!
పసుపంటే కొన్నిసార్లు భయం భయం. నిజమే.. మనం శుభ సూచకంగా, మంగళప్రదమైందిగా భావించే పసుపురంగు కంట్లోనో, చర్మం మీదో కనబడితే ఉన్నట్టుండి ఉలిక్కిపడతాం. కామెర్లేమోనని భయపడిపోతాం. ఇది అవసరం కూడా. పసి పిల్లల విషయంలో ఇది మరింత అత్యవసరం. పుట్టిన తొలిరోజుల్లో శిశువుల్లో కామెర్లు సర్వ సాధారణమే కావొచ్చు. కొద్దిరోజుల్లో వాటంతటవే తగ్గిపోనూవచ్చు. కానీ అన్నిసార్లూ ఇలాగే జరగాలనేమీ లేదు. కాలేయ నిర్మాణ లోపాలు, ఇన్ఫెక్షన్లు, జీవక్రియ సమస్యల వంటి సమస్యలతో తలెత్తే కామెర్లు ప్రమాదకరంగానూ పరిణమించొచ్చు. కాబట్టే రెండు వారాలు దాటినా కామెర్లు తగ్గకపోతే తక్షణం అప్రమత్తం కావాలని.. దీన్ని ‘ఎల్లో అలర్ట్’గా పరిగణించాలని వైద్యరంగం స్పష్టంగా చెబుతోంది. లేకపోతే కాలేయం, మెదడు వంటి కీలక అవయవాలు దెబ్బతినొచ్చని గట్టిగా హెచ్చరిస్తోంది. అందుకే శిశు కామెర్లపై సమగ్ర కథనం అందిస్తోంది ఈ వారం సుఖీభవ.
‘‘బామ్మా.. పాప కళ్లు పచ్చగా కనబడుతున్నాయే’’ ఒక తల్లి ఆందోళన.
‘‘అవే తగ్గిపోతాయిలేమ్మా.. ఉదయం పూట పాపను కాసేపు ఎండకు తీసుకెళ్తే చాలు’’ ఒక బామ్మ భరోసా.
పండంటి పాపాయి పుట్టిన తొలిరోజుల్లో ఇలాంటి సంభాషణ కొత్తేమీ కాదు. శిశువుల్లో కామెర్లు తరచుగా చూస్తున్నదే. సాధారణంగా పిల్లలు పుట్టిన రెండో రోజున గానీ మూడో రోజున గానీ కామెర్లు మొదలవుతుంటాయి. దీంతో బిడ్డ కళ్లు, చర్మం పచ్చబడుతుంటాయి. దీనికి మూలం రక్తంలో బిల్రుబిన్ మోతాదులు పెద్దఎత్తున పెరిగిపోవటం. ఎర్ర రక్తకణాలు విడిపోయినప్పుడు బిల్రుబిన్ ఉత్పత్తి అవుతుంటుంది. దీన్నే ఇన్డైరెక్ట్ బిల్రుబిన్ అంటారు. ఇది కాలేయంలోకి వెళ్లి ఎంజైమ్ల సాయంతో గ్లూకోరోనిక్ ఆమ్లంతో సమ్మిళితమై నీటిలో కరిగే విధంగా (డైరెక్ట్ బిల్రుబిన్) మారుతుంది. అక్కడ్నుంచి పైత్యరసంలో కలిసి పేగుల్లోకి చేరుకుంటుంది. ఇది కొంత మలం ద్వారా, మరికొంత మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అయితే పుట్టిన తొలినాళ్లలో శిశువుల్లో కాలేయం పూర్తిగా అభివృద్ధి చెందదు. అందువల్ల పెద్దమొత్తంలో విడుదలయ్యే బిల్రుబిన్ను అది అంతగా స్వీకరించలేదు. ఫలితంగా రక్తంలో బిల్రుబిన్ మోతాదులు పెరిగిపోతాయి. ఇది చర్మంలో, తెల్లగుడ్డులో, జిగురుపొరల్లో స్థిరపడిపోతుంది. దీంతో కళ్లు, చర్మం, నాలుక కిందిభాగం పసుపురంగులోకి మారిపోతుంటాయి. నిజానిది అంత సమస్యాత్మకమేమీ కాదు. వారం, పది రోజుల్లో దానంతటదే తగ్గిపోతుంది. శిశువుల ఒంటికి రోజూ కాసేపు ఎండ తగిలేలా చూసుకోవటం, దీంతో కుదురుకోకపోతే ఫొటోథెరపీ ఇస్తే సరిపోతుంది. దీంతోనే చాలామందికి కామెర్లు నయమైపోతాయి. అయితే కొందరిలో కామెర్లు 2 వారాలైనా తగ్గకుండా వేధిస్తుంటాయి. ఇది చాలా ప్రమాదకరం. ఇతరత్రా సమస్యల మూలంగా తలెత్తే దీనికి వీలైనంత త్వరగా చికిత్స చేయించటం తప్పనిసరి. ఆలస్యం చేసిన కొద్దీ కాలేయం దెబ్బతింటుంది. దీని గురించి తెలియకపోవటం వల్ల మనదేశంలో ఎంతోమంది పిల్లలను 3 నెలల తర్వాతే ఆసుపత్రులకు తీసుకొస్తున్నారు. ఇది పిల్లల ఆరోగ్యంపై విపరీత ప్రభావం చూపుతుంది. పోషణ లోపం, రక్తస్రావం, కండరాలు క్షీణించటం వంటి దుష్ప్రభావాలకు దారితీస్తుంది. కాబట్టి దీనిపై అవగాహన పెంచుకోవటం అవసరం. ‘కామెర్లే కదా.. అవే తగ్గిపోతాయిలే’ అని అనుకోకుండా.. అవి మామూలు కామెర్లా? ఇతరత్రా సమస్యలతో వచ్చాయా? అనేది చూసుకోవటం మంచిది.
మామూలు కామెర్లు శిశువుల్లో చాలామందిలో కనబడేవి ఇలాంటి కామెర్లే. ఇవి పుట్టిన రెండో రోజున లేదా మూడో రోజున మొదలవుతాయి. క్రమంగా తగ్గుతూ.. 10-14 రోజుల్లో నయమైపోతాయి. దీనికి రకరకాల కారణాలు దోహదం చేస్తాయి. నిర్ధరణ చికిత్స- రెండు రకాలు |
తీవ్ర కామెర్లు కామెర్లు 2 వారాలైనా తగ్గకపోవటం.. కళ్లు, చర్మం బాగా పచ్చబడటం.. మూత్రం ముదురు రంగులో, మలం తెలుపురంగులో వస్తుండటం.. నొక్కినపుడు చేతికి కాలేయం ఉబ్బినట్టుగా తగలటం.. బిడ్డ నలత పడుతున్నట్టు కనబడితే కామెర్లను తేలికగా తీసుకోవటానికి లేదు. కాలేయంలోంచి పైత్యరసాన్ని బయటకు తీసుకొచ్చే నాళాల్లో లోపాల వంటి సమస్యలు దీనికి కారణం కావొచ్చు. వీటిని వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స చేయటం తప్పనిసరి. 1 పైత్యనాళ లోపాలు: కొందరిలో పుట్టుకతోనే కాలేయంలోంచి పైత్యరసాన్ని బయటకు తీసుకొచ్చే నాళాలు మూసుకుపోవచ్చు. ఉండాల్సిన దానికన్నా సన్నగా ఉండొచ్చు, పొడవూ తగ్గొచ్చు. కొందరికి నాళాలు అసలే లేకపోవచ్చు. దీన్నే బిలియరీ అట్రీషియా అంటారు. దీంతో పైత్యరసం లోపలే ఉండిపోతుంది. క్రమంగా కాలేయం దెబ్బతింటూ గట్టిపడే స్థాయికి చేరుకుంటుంది. రక్తంలో బిల్రుబిన్ మోతాదులు పెరిగి కళ్లు, చర్మం పచ్చబడతాయి. పైత్యరసం పేగుల్లోకి చేరుకోకపోవటం వల్ల మలం పాలిపోయినట్టూ కనబడుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. పైత్యనాళ లోపాలను హెపటో బిలియరీ న్యూక్లియర్ స్కాన్ పరీక్షతో నిర్ధరిస్తారు. కాలేయం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్షించటమూ (బయాప్సీ) ఉపయోగపడుతుంది. అలాగే సూది ద్వారా పిత్తాశయంలోకి రంగును ఎక్కించి, ఎక్స్రే తీసినా (ఆపరేటివ్ కొలాంజియోగ్రామ్) సమస్య బయటపడుతుంది. 2 పైత్యనాళ తిత్తి: కొందరికి పుట్టుకతోనే కాలేయంలోంచి బయటకు వచ్చే నాళాల గోడలు బలహీనంగా ఉంటాయి. దీంతో నాళం తిత్తిలాగా ఉబ్బిపోతుంది. దీన్నే కోలిడోకల్ సిస్ట్ అంటారు. క్లోమం నుంచి వచ్చే నాళం, పైత్యనాళం కలిసేచోట ఏదైనా లోపమున్నా సమస్యకు దారితీయొచ్చు. క్లోమరసం కొంత పైత్యనాళంలోకి చేరుకొని గోడను దెబ్బతీస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా నాళాన్ని దెబ్బతీయొచ్చు. దీంతో నాళం బలహీనపడిన చోట తిత్తిలాగా ఉబ్బిపోవచ్చు. ఫలితంగా పైత్యరసం కిందికి వెళ్లకుండా అక్కడే నిల్వ ఉండిపోతుంటుంది. కోలిడోకల్ సిస్ట్ను అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తిస్తారు. అవసరమైతే ఎంఆర్ఐ, ఎంఆర్సీపీ కూడా చేస్తారు. 3 చిక్కబడే పైత్యరసం: కొందరికి జన్యుపరంగానో, ఇన్ఫెక్షన్ల మూలంగానో నాళంలో కొన్నిచోట్ల పైత్యరసం చిక్కబడి.. అడ్డంకిగా మారుతుంది (ఇన్స్పిటేటెడ్ బైల్ సిండ్రోమ్). పైత్యరసం ఉత్పత్తి అవుతున్నా అడ్డంకి మూలంగా కిందికి రాకుండా అక్కడే ఉండిపోతుంటుంది. ఇది కామెర్లకు దారితీస్తుంది. 4 శిశు కాలేయవాపు (నియోనేటల్ హెపటైటిస్): కాలేయవాపు సైతం తీవ్ర కామెర్లకు దారితీస్తుంది. దీనికి ప్రధాన కారణం జెయింట్ సెల్ హెపటైటిస్ ఇన్ఫెక్షన్. రెండు వారాలు దాటినా తగ్గని కామెర్లలో 63% కేసులు దీంతో ముడిపడినవే. అలాగే గర్భధారణ సమయంలో తల్లికి వచ్చే ‘టార్చ్’ ఇన్ఫెక్షన్లూ కాలేయవాపునకు దోహదం చేయొచ్చు. వీరికి రక్తపరీక్ష చేస్తే ఆయా వైరస్లకు సంబంధించిన యాంటీబోడీలుంటే బయటపడతాయి. కాలేయంలో బిల్రుబిన్ మార్చే ఎంజైమ్లు లోపించటం వల్ల కూడా కాలేయ కణాలు దెబ్బతిని శిశు కాలేయవాపు రావొచ్చు. దీనికి కాలేయం నుంచి ముక్కను తీసి పరీక్షించి సమస్యను నిర్ధరిస్తారు. 5 నిల్వ సమస్యలు: కాలేయంలో కొన్ని ఎంజైమ్ల లోపాల వల్ల లైకోజెన్, కొవ్వుల వంటివి బయటకు వెళ్లిపోకుండా అక్కడే ఉండిపోవటమూ సమస్యాత్మకంగా పరిణమించొచ్చు. దీనికి ఆయా ఎంజైమ్లను ఇస్తే సమస్య కుదురుకుంటుంది. 6 రక్తకణాల లోపాలు (హిమోలైటిక్ డిజార్డర్స్: ఎర్ర రక్తకణాల పైపొర లోపాలు (సికిల్సెల్), హిమోగ్లోబిన్ లోపాలు (థలసీమియా), రక్తకణాల్లోని ఎంజైమ్ల లోపాలు (జీ6పీడీ లోపం) గలవారిలోనూ రక్తకణాల జీవనకాలం తగ్గిపోయి బిల్రుబిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇదీ కామెర్లకు దారితీస్తుంది. ఆయా సమస్యలకు చికిత్స చేస్తే కామెర్లు కూడా తగ్గుతాయి. |
ఎప్పుడు ప్రమాదకరం? కామెర్లతోనే పుట్టటం: రెండో రోజున లేదా మూడో రోజున శిశు కామెర్లు మొదలవుతుంటాయి. ఎవరికైనా పుట్టుకతోనే కామెర్లు ఉంటే ప్రమాదకరంగా భావించాలి. |
చికిత్స చేయకపోతే? తీవ్ర కామెర్లకు త్వరగా చికిత్స చేయకపోతే విపరీత పరిణామాలకు దారితీయొచ్చు. రక్తంలో ఇన్డైరెక్ట్ బిల్రుబిన్ మోతాదులు మరీ పెరిగిపోతే అవి మెదడులోకి చేరుకొని మెదడును దెబ్బతీయొచ్చు (కెర్నిక్టెరస్). కాలేయానికి రక్తాన్ని చేరవేసే నాళాల్లో రక్తపోటు పెరగొచ్చు (పోర్టల్ హైపర్టెన్షన్). ఇవన్నీ క్రమంగా కాలేయ వైఫల్యానికీ దారితీస్తాయి. కామెర్ల మూలంగా పోషణ లోపమూ తలెత్తుతుంది. సమస్య తీవ్రమవుతున్నకొద్దీ చర్మం మీద దురద ఎక్కువవుతుంది. పొట్టలో నీరు చేరటం, రోగ నిరోధకశక్తి తగ్గటం వల్ల తరచుగా ఇన్ఫెక్షన్లు తలెత్తొచ్చు. కాలేయంలో దీర్ఘకాలంగా పైత్యరసం పోగుపడిపోతుంటే ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది (కొలాంజైటిస్). దీంతో కాలేయం నెమ్మదిగా దెబ్బతింటూ గట్టిపడిపోవచ్చు. మున్ముందు క్యాన్సర్ కూడా తలెత్తొచ్చు. ఇక బిలియరీ అట్రీషియాకు శస్త్రచికిత్స చేసిన తర్వాత ఐదారేళ్లకు కొందరిలో కాలేయ మార్పిడి చేయాల్సిన పరిస్థితి కూడా తలెత్తొచ్చు. ఎందుకంటే నాళానికి చిన్నపేగును కలిపిన చోటుకు దూరంగా ఉన్న భాగం సరిగా పనిచేయకపోవటం వల్ల అది వృద్ధి చెందదు. ఇలాంటివారికి కాలేయ మార్పిడి చేయాల్సి ఉంటుంది. కొందరికి శస్త్రచికిత్స విఫలం కావొచ్చు. అప్పుడు కాలేయ మార్పిడి తప్ప మరో గత్యంతరం ఉండదు. కాబట్టి పరిస్థితిని ఇంతవరకు తెచ్చుకోకుండా సమస్యను ముందే గుర్తించి, త్వరగా చికిత్స చేయించటం ఉత్తమం. |
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రన్వేపై పేలిన బోయింగ్ విమానం టైరు..!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM