Chiranjeevi: అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి

 సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.

Published : 10 May 2024 00:12 IST

హైదరాబాద్‌: తాను మొదటిసారి శాసనసభ్యుడిగా అసెంబ్లీ అడుగు పెట్టిన తర్వాత అక్కడి వాతావరణం, శాసనసభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూసి షాకయ్యానని సినీ నటుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో (Kishan Reddy) కలిసి సరదాగా మాట్లాడారు.

సభా మర్యాద మీ నుంచే నేర్చుకున్నా!

‘‘శాసనసభ్యుడిగా అసెంబ్లీలోకి తొలిసారి అడుగు పెట్టినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. నాకు ఒక్క పక్క మీరు (కిషన్‌రెడ్డి), మరోవైపు జయప్రకాశ్‌ నారాయణ ఉండేవారు. అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ, దుర్భాషలాడుకుంటూ లైవ్‌లో తిట్టుకోవడం చూసి షాకయ్యా. అసెంబ్లీ అంటే ఇలా ఉంటుందా? అనిపించింది. ఆ తర్వాత అదే నాయకులు లాబీల్లో ఒకరి భుజంపై మరొకరు చేయి వేసుకుని మాట్లాడుకోవటం చూసి ఆశ్చర్యపోయా. నాకు తెలిసినంత వరకూ మీరు (కిషన్‌రెడ్డి) అసెంబ్లీలో ఎప్పుడూ ఎవరినీ దుర్భాషలాడలేదు. కేవలం మాట్లాడాల్సిన అంశాలు, ప్రజా సమస్యలపై మాత్రమే మాట్లాడేవారు తప్ప.. ఒక్కరోజు కూడా ఇతర విషయాలు మాట్లాడలేదు. ఒకరకంగా సభా మర్యాద మీ నుంచే నేర్చుకున్నా. నేను కేంద్రమంత్రి అయిన తర్వాత రేణిగుంటలో కలనరీ ఇనిస్టిట్యూట్‌ కోసం అనుమతులు తీసుకొచ్చేందుకు ఎంతో ప్రయత్నించా. అప్పటి ప్రణాళిక సంఘం అధ్యక్షుడు అహ్లూవాలియా అందుకు ఆసక్తి చూపలేదు. కానీ, ఆయనకు అన్నీ వివరించి ఎంతో మాట్లాడి ఒప్పించా. పలు రాష్ట్రాలు, విభిన్న సంస్కృతులు ఉన్న దేశం మనది. అన్నింటినీ నేర్పించే అవకాశం కల్పించాలి. ప్రణాళిక సంఘం అధ్యక్షుడితో మాట్లాడి ఒప్పించాను. శంకుస్థాపన చేసే సమయంలో రాష్ట్ర విభజన జరిగింది. అదే సమయంలో నేను రాజీనామా చేశా. అయితే, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేయడం సంతోషంగా అనిపించింది’’

‘‘కరోనా సమయంలో సినీ పరిశ్రమకు చెందిన కార్మికులకు నావంతు సాయం చేశా. బ్లడ్‌ బ్యాంకు ద్వారా సేవ చేయడానికి కారణం నా అభిమానులే. వారి సహకారం వల్లే ఎంతో మందికి సాయం చేయగలుగుతున్నాం. కేంద్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కశ్మీర్‌లో జరిగిన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. అయితే, అనుకోని కారణాల వల్ల నేను రాలేకపోయా. నా తరపున రామ్‌చరణ్‌ను పంపాను. ఆ సమయంలోనే ‘ఆర్ఆర్‌ఆర్’కు ఆస్కార్‌ అవార్డు వచ్చి ఉండటం కూడా దేశానికి మంచి గుర్తింపునిచ్చింది. అలాగే, అయోధ్య సమస్య చాలా సునాయాసంగా పరిష్కారమైంది. అది ప్రధాని మోదీ వల్లే సాధ్యమైంది. బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠకు నన్ను ఆహ్వానించడం మా అదృష్టం. నా జీవితంలో ఆ రోజును ఎప్పుడూ మర్చిపోలేను. ఈ ఎన్నికల్లో మీకు సంపూర్ణ విజయం చేకూరి, మరిన్ని ఉన్నత పదవులుచేపట్టాలని ఆకాంక్షిస్తున్నా’’ అని చిరంజీవి అన్నారు.


మోదీతో అనుబంధం అప్పట్నుంచే..

‘‘ఆర్టికల్‌-370 రద్దు చేశాక కశ్మీర్‌లో 300లకు పైగా సినిమాలకు షూటింగ్‌లు జరిగాయి. పార్టీలో నాకంటూ ప్రత్యేకంగా గ్రూపులు లేవు. నా తర్వాత కుటుంబ సభ్యులెవరినీ ఇప్పటివరకూ రాజకీయంగా ప్రోత్సహించ లేదు. భవిష్యత్‌లో వస్తారేమో తెలియదు. కరోనా సమయంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాను. ఆ సమయంలో కరోనా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశాం. 24గంటలూ అది పనిచేసేది. దాదాపు నెల రోజుల పాటు ఆఫీస్‌లోనే పడుకుని వీలైనంత ఎక్కువ సమయం ప్రజలకు అందాల్సిన సాయం గురించి చర్చిస్తూ ఉండేవాడిని. దిల్లీ నుంచి ఆక్సిజన్‌ సిలిండర్లు తెప్పించి గ్రీన్‌ ఛానల్‌ఏర్పాటు చేసి, మరీ ఆస్పత్రులకు పంపేవాళ్లం. గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారిని ప్రత్యక్షంగా కలిసి అందుకున్న వైద్యం గురించి అడిగి తెలుసుకునేవాడిని. నా కుటుంబ సభ్యులు భయపడేవాళ్లు. డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను ఫణంగా పెట్టిన పనిచేస్తుంటే, నేను బయటకు రాకుండా ఉండలేకపోయాను. ఏదైతే అది అయిందని మొండిగా ముందుకు వెళ్లాను’’

‘‘ప్రధాని మోదీ గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. అడ్వాణీగారు పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మోదీజీతో కలిసి అమెరికా వెళ్లాను. అమెరికన్‌ కౌన్సిల్‌ ఆఫ్ యంగ్‌ పొలిటికల్‌ లీడర్స్‌ అనే యూఎస్‌ ప్రభుత్వ ఏజెన్సీ ఉంది. కొన్ని ముఖ్య దేశాలకు చెందిన యువ రాజకీయ ప్రతినిధులను తమ దేశానికి పిలిచేవారు. వారి దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చూసి, ఇక్కడ ప్రచారం చేయాలని చెప్పేవారు. ఆసమయంలో అడ్వాణీగారి సూచన మేరకు అప్పటి ఆంధ్రప్రదేశ్‌ నుంచి నేను, కర్ణాటక నుంచి అనంత్‌కుమార్‌, గుజరాత్‌ నుంచి మోదీగారికి అవకాశం కల్పించారు. ఆ సమయంలో నాకు కనీసం పాస్‌పోర్ట్‌ కూడా లేదు. విమానం మొదటిసారి ఎక్కాను.  అప్పుడు వైట్‌ హౌస్‌ ముందు నిలబెట్టి, ఏ భవనం ఏంటో చెప్పారు. అప్పటి ఫొటోల్లో కొన్నింటిని నేను భద్రంగా దాచుకున్నా. మరికొన్ని పోయాయి. మోదీ ప్రధాని అయిన తర్వాత తొలిసారి శ్వేతసౌధానికి రమ్మని ఆహ్వానించారు. అప్పుడు ఆయన నాకు ఫోన్‌ చేసి, ఫొటోల గురించి అడిగితే, నా దగ్గర ఉన్న వాటిని పంపాను. ‘అప్పుడు మనం బయట నిలబడి ఫొటోలు దిగాం. ఇప్పుడు నేను వైట్‌హౌస్‌ లోపలికి వెళ్తున్నా’ అని మోదీ గారు అన్నప్పుడు చాలా గర్వంగా అనిపించింది’’

ఆరోగ్యశ్రీకి అలా బీజం పడింది..

‘‘2004లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు మందకృష్ణ మాదిగ సామాజిక సమస్యలపై పోరాటం చేస్తూ ఉండేవారు. ఆయన వివిధ జిల్లాల్లో  తిరుగుతున్నప్పుడు గుండె జబ్బులున్న పిల్లలు కనిపించారు. చికిత్స అందక అప్పటికే  చాలా మంది చనిపోయారని తెలిసింది. అప్పుడు రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నారు. గుండె జబ్బు సమస్యలతో బాధపడుతున్న వారి తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లో ఒక మీటింగ్‌ పెట్టాం. అక్కడికి తీసుకొచ్చిన ఒక చిన్నారి చనిపోయాడు. దీంతో ఆ భౌతికకాయం పట్టుకుని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తూ, ‘ చిన్నారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆపరేషన్‌ చేయించాలి’అని డిమాండ్‌ చేశాం. రాత్రి 10గంటలకు సీఎం ఫోన్‌ చేసి ఆపరేషన్‌ చేయిస్తానని హామీ ఇవ్వడమే కాదు, అధికారికం గానూ ప్రకటించారు. దీంతో మరుసటి రోజు వైఎస్‌ఆర్‌ను కలిసి ఈ విషయంపై చర్చించాం. ఆయన ప్రభుత్వ వైద్యులను పిలిచి సమస్యకు పరిష్కారం చూపమన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామగ్రామాన సర్వే చేపట్టగా 2లక్షల మంది చిన్నారులు గుండె జబ్బులతో బాధపడుతున్నారని తెలిసింది. ఈ క్రమంలో వారికి ఇన్సూరెన్స్‌ చేయించాలని నిర్ణయించారు. ఆ ఆలోచన నుంచే ఆరోగ్యశ్రీ పథకం పుట్టుకొచ్చింది’’ అని కిషన్‌రెడ్డి తన అనుభవాలను చిరంజీవితో పంచుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని