నవ ఆరోగ్యమస్తు! 2023

కొత్త సంవత్సరం.. కొత్త ఆశలూ. ఆశయాలూ. లక్ష్యాలేవైనా గానీ వాటిని సాకారం చేసుకోవటానికి ఆరోగ్యమే కీలకం. ఇందుకు ఆహార, విహారాలతో పాటు ఆరోగ్య పరీక్షలూ ముఖ్యమే.

Updated : 03 Jan 2023 09:23 IST

కొత్త సంవత్సరం.. కొత్త ఆశలూ. ఆశయాలూ. లక్ష్యాలేవైనా గానీ వాటిని సాకారం చేసుకోవటానికి ఆరోగ్యమే కీలకం. ఇందుకు ఆహార, విహారాలతో పాటు ఆరోగ్య పరీక్షలూ ముఖ్యమే. మహిళలైతే మరింత అప్రమత్తంగానూ ఉండాలి. ఆరోగ్యమస్తని ఎవరికి వారే ఆశీర్వదించుకోవాలి. నవ ఆరోగ్య సాధన కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించాలి.


అప్పుడప్పుడు వనవాసం

రోగ్య సంరక్షణకు తేలికైన, ఆచరించదగ్గ, ఉచిత మార్గం ప్రకృతితో మమేకం కావటం. రోజూ కనీసం 15 నిమిషాలైనా పచ్చని చెట్ల మధ్య గడపాలి. అప్పుడప్పుడు అటవీ ప్రాంతాలకు వెళ్తే ఇంకా మంచిది. ఇప్పుడు పట్టణ పరిసరాల్లో అర్బన్‌ ఫారెస్ట్‌ కేంద్రాలు చాలానే ఉన్నాయి. వానాకాలం తర్వాతో, చలికాలం ముగిశాకో వీటిని సందర్శించొచ్చు. మన పేగుల్లో బోలెడంత బ్యాక్టీరియా ఉంటుంది. అటవీ ప్రాంతాల్లో ఉల్లాసంగా గడిపినప్పుడు, పచ్చటి ప్రకృతితో మమేకమైనప్పుడు అక్కడి మట్టి, ఆకుల వాసన.. తాజా గాలికి బ్యాక్టీరియా పునరుత్తేజితమవుతుంది. ఒత్తిడికి కారణమయ్యే కార్టిజోల్‌ మోతాదులు తగ్గుతాయి. సంతోషం, ఆనందం కలిగించే ఎండార్ఫిన్లు, డోపమైన్‌ ఉత్పత్తి పెరుగుతుంది.

* సహజ వాతావరణంలోని గడపటం వల్ల రోగ నిరోధక శక్తీ ఇనుమడిస్తుంది. తెల్ల రక్తకణాల సంఖ్య పెరిగి ఇన్‌ఫెక్షన్లు, జబ్బులను ఎదుర్కొనే సామర్థ్యం పుంజుకుంటుంది. ఒంటికి ఎండ తగిలినప్పుడు తయారయ్యే విటమిన్‌ డి సైతం రోగనిరోధకశక్తిని పెంచేదే.

* రోజూ అలవడిన దాని కన్నా భిన్నమైన వాతావరణంలో, ప్రకృతికి దగ్గరగా గడిపినప్పుడు సహనం, ఓర్పు పెరుగుతాయి. సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం కలుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి, ఉల్లాసం కలుగుతుంది.

* తాజా గాలిని పీల్చుకోవటం వల్ల మెదడూ కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.

* ప్రకృతి మధ్యలో గడిపితే కంటి ఆరోగ్యమూ మెరుగవుతుంది. దూరంగా ఉండే దృశ్యాలను చూడటం వల్ల కంటి మీద ఒత్తిడి తగ్గుతుంది. రోజూ ఫోన్లు, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ తెరలను చూడటమే పనిగా మారిన ప్రస్తుత తరుణంలో ఇది అత్యంత ఆవశ్యకమని తెలుసుకోవాలి.

* పచ్చటి ప్రకృతిలోకి వెళ్లినప్పుడు వీలైనంత తక్కువ దుస్తులు, పాదరక్షలు ధరించేలా చూసుకోవాలి. పచ్చటి గడ్డిలో, మట్టిలో కాసేపు చెప్పులు లేకుండా నడిచినా మేలే.

* పెద్ద చెట్లను కౌగిలించుకోవటం, వాటితో మాట్లాడటమూ ఆరోగ్యాన్ని ఇనుమడింప జేస్తుంది. ముఖ్యంగా అశోక చెట్లతో మాట్లాడితే కుంగుబాటు తగ్గొచ్చు.


మహిళా మేలుకో!

హిళల భద్రత, ఆరోగ్య సంరక్షణ బిడ్డ పుట్టకముందు నుంచే మొదలవ్వాలి. ఇందుకు మహిళలే సారథ్యం వహించాలి. పుట్టినప్పటి నుంచి వృద్ధాప్యం వరకూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలుసుకోవాలి.  

* గర్భస్థ శిశువు ఆడో మగో తెలుసుకోవటం నేరం. అయినా కొందరు ఆడపిల్ల పుడుతుందని తెలుసుకొని గర్భస్రావం చేయించుకుంటున్నారు. ఇది తప్పు. ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేసినా తిరస్కరించాలి. ఆడవాళ్లను ఆడవాళ్లే చిదిమేయటమేంటని ఎవరికివారే ప్రశ్నించుకోవాలి.

* ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా, ధైర్యంగా పెంచాలి. సమానంగా చదివించాలి. ఆడపిల్లల మాదిరిగానే మగపిల్లలకూ ఇంటి పని అప్పగించాలి. ఆడపిల్లలను గౌరవించటమెలాగో మగపిల్లలకు బాల్యం నుంచే నేర్పించాలి. పెద్దవాళ్లను గౌరవించటం ఇద్దరికీ నేర్పించాలి. సమాజంలో లైంగిక నేరాలు తగ్గటానికిది బాగా తోడ్పడుతుంది.

* అమ్మాయిలు యుక్త వయసుకు వచ్చేసరికి అవసరమైన అన్ని టీకాలు.. ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించే హెచ్‌పీవీ టీకా, హెపటైటిస్‌ బి టీకా తప్పనిసరి. సార్వత్రిక టీకా కార్యక్రమంలో ఇప్పుడు పుట్టగానే పిల్లలకు హెపటైటిస్‌ బి టీకా ఇస్తున్నారు. ఒకవేళ దీన్ని తీసుకోకపోతే విధిగా వేయించాలి. హెచ్‌పీవీ టీకా 9-15 ఏళ్ల వయసువారికి రెండు మోతాదులు చాలు. ఆర్నెల్ల వ్యవధిలో వీటిని ఇప్పించాలి.

* కౌమారదశ ఆడపిల్లలకు నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విడమరచి చెప్పాలి. తల్లిదండ్రులు చెప్పలేకపోతే మహిళా వైద్యుల దగ్గరికి తీసుకెళ్లయినా అవగతం చేయించాలి.

* ఆడపిల్లలకు 21 ఏళ్లు దాటాకే పెళ్లి చేయాలి. అప్పటికి పునరుత్పత్తి అవయవాలు గర్భం దాల్చటానికి సిద్ధంగా ఉంటాయి. కాన్పు సమస్యలు తగ్గుతాయి. వీలైనంత వరకు మేనరిక వివాహాలు మానేస్తే మంచిది.

పెళ్లయిన వెంటనే పిల్లలను కనొద్దు. కనీసం ఒక ఏడాదయినా వేచి చూడాలి. గర్భధారణకు ముందే డాక్టర్‌ను సంప్రదించాలి. బ్లడ్‌ గ్రూప్‌, థలసీమియా ముప్పును తెలిపే పరీక్షలతో జన్యు సమస్యలను నివారించుకోవచ్చు.

* బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం ఉండేలా చూసుకోవాలి. కాన్పు తర్వాత అవయవాలు తిరిగి మామూలు స్థితికి రావటానికి 18 నెలలు పడుతుంది. కనీసం ఇంతవరకైనా గర్భం రాకుండా చూసుకోవాలి. మూడేళ్ల ఎడం ఉంటే ఇంకా మంచిది.

ఇద్దరు పిల్లల తర్వాత వెంటనే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవటం తగదు. పిల్లలకు టీకాలన్నీ ఇప్పించి, వారికి ఒక వయసు వచ్చాక చేయించుకుంటే మేలు. మగవారు వాసెక్టమీ చేయించుకుంటే ఇంకా మంచిది.

* పిల్లలు పుట్టారు కదా. ఇంకేముందని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఊబకాయం రాకుండా చూసుకోవాలి. సమతులాహారం తినాలి. చురుకుగా ఉండాలి. ఏటా ఒకసారైనా డాక్టర్‌ను సంప్రదించాలి.

* 35 ఏళ్ల తర్వాత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను గుర్తించే పాప్‌స్మియర్‌ పరీక్ష చేయించుకోవాలి. ఎలాంటి ఇబ్బంది లేకపోతే దీన్ని ప్రతి మూడేళ్లకోసారి చేయించుకుంటే సరిపోతుంది. ఏదైనా సమస్య ఉంటే మాత్రం ఇంకాస్త ముందే అవసరమవుతుంది. హెచ్‌పీవీ టీకా తీసుకున్నా కూడా పాప్‌ స్మియర్‌ చేయించుకోవాలి.

40-55 ఏళ్లలో ఏటా.. ఆ తర్వాత ప్రతి రెండేళ్లకోసారి రొమ్ముక్యాన్సర్‌ ఆనవాళ్లను తెలిపే మామోగ్రామ్‌ పరీక్ష చేయించుకోవాలి. అయితే మనదగ్గర ఖర్చుకు భయపడి చాలామంది దీనికి వెనకాడుతున్నారు. అంతగా వీలు కాకపోతే నలబై ఏళ్లు దాటాక కనీసం ఒక్కసారైనా మామోగ్రామ్‌ చేయించుకుంటే మంచిది. అవసరాన్ని బట్టి తిరిగి ఎప్పుడు చేయాలో డాక్టర్లు చెబుతారు. దగ్గరి రక్త సంబంధీకులకు రొమ్ము క్యాన్సర్‌ ఉన్నట్టయితే రొమ్ము పరీక్ష తప్పనిసరి.

* 45-55 ఏళ్ల మధ్యలో ముట్లు నిలిచి పోవటం (మెనోపాజ్‌) మొదలవుతుంది. మనదగ్గరైతే ఇది ఐదేళ్ల ముందే ఆరంభమవుతోంది. ఈ సమయంలో రుతుస్రావం మరీ ఎక్కువవుతున్నా, నెలసరి ముందూ వెనకలవుతున్నా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

* మెనోపాజ్‌ దశలో గుండె ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే అప్పటివరకూ ఉన్న ఈస్ట్రోజెన్‌ రక్షణ పోతుంది. మెనోపాజ్‌లో గుండెపోటు వస్తే ఆడవారికి మరణించే ముప్పు ఎక్కువ కూడా. అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం వంటివి తలెత్తే అవకాశమూ ఉంది. నెలసరి నిలిచాక శృంగారం మీద ఆసక్తి తగ్గుతుందని భావిస్తుంటారు గానీ ఇది నిజం కాదు. కాబట్టి ఏడాదికోసారైనా డాక్టర్‌ను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలి. భార్యాభర్తలిద్దరూ డాక్టర్‌ దగ్గరికి వెళ్లటం మంచిది.

* ముట్లుడిగిన తర్వాతా నెలకోసారైనా రొమ్ములను చేత్తో తాకి చూసుకోవాలి. ఏదైనా గడ్డలాంటిది కనిపిస్తే వెంటనే డాక్టర్‌ దగ్గరికి వెళ్లాలి. స్వీయ పరిశీలన కన్నా డాక్టర్‌తో పరీక్ష చేయించు కోవటం ఉత్తమం.

* రక్త సంబంధీకులకు పెద్ద పేగు క్యాన్సర్‌ వచ్చి ఉన్నట్టయితే 45 ఏళ్లు దాటాక ఏటా కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే పెద్దపేగు క్యాన్సర్‌ చరిత్ర గల కుటుంబాల్లో మహిళలకు అండాశయ క్యాన్సర్‌ వచ్చే అవకాశముంది. దీనికి ముందస్తు పరీక్షలేవీ లేవు కాబట్టి ఏడాదికి ఒకసారి అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయించుకోవాలి.

* మెనోపాజ్‌ వచ్చాకా ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి. ఆధ్యాత్మికంగానో, వృత్తిపరంగానో.. ఎలాగైనా సరే చురుకుగా గడపాలి. దీంతో మెదడు పుంజుకుంటుంది. మతిమరుపు రాకుండా కాపాడుకోవచ్చు.


కంటి నిండా నిద్రా లక్ష్యమే!

కొత్త సంవత్సరం అనగానే పెద్ద పెద్ద లక్ష్యాలు చాలానే పెట్టుకుంటారు. వీటన్నింటికన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే కీలకమని కొవిడ్‌ గట్టిగా నేర్పించింది. మంచి ఆరోగ్యానికి సమతులాహారం, వ్యాయామం, మానసిక ఆరోగ్యంతో పాటు నిద్ర కూడా ముఖ్యమే. లక్ష్యాలను సాధించటానికి నిద్రను నిర్లక్ష్యం చేయటం తగదు. లక్ష్య సాధనకు నిద్ర తోడ్పడుతుందనే విషయాన్ని మరవరాదు. మనకు రోజుకు 7-8 గంటల నిద్ర అవసరం. చిన్న పిల్లలు, యుక్తవయసువారికైతే ఇంకా ఎక్కువ నిద్ర కావాలి. నిద్ర తగ్గినా, కంటి నిండా నిద్ర పట్టక పోయినా పనిలో ఉత్పాదకత తగ్గిపోతుంది. ఏకాగ్రత కుదరదు. కొత్త జ్ఞాపకాలు తగ్గుముఖం పడతాయి. సృజనాత్మక, కొత్త ఆలోచనలు కొరవడతాయి. వినూత్న ఐడియాలతో ముడిపడిన ఉద్యోగాలు చేసేవారికిది ఇబ్బంది కలిగిస్తుంది. ‘పడుకొని లేస్తే అంతా సర్దుకుంటుంది. ఏం చేయాలో నీకే అర్థమవుతుంది’ అని పెద్దలు చెబుతుంటారు. ఇది నూటికి నూరు పాళ్లు నిజం. నిద్ర పోతున్నప్పుడే మెదడులో జ్ఞాపకాలు ఏర్పడతాయి, స్థిరపడతాయి. అవసరం లేని జ్ఞాపకాలు తొలగిపోతాయి. భావోద్వేగాల మీద పట్టు లభిస్తుంది. అందువల్ల జీవితంలో ఇతర లక్ష్యాలతో పాటు కంటి నిండా నిద్రపోవటాన్నీ ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి.

* రోజూ ఒకే సమయానికి పడుకోవాలి. తెల్లారి ఒకే సమయానికి లేవాలి. నిద్ర బాగా పట్టటానికి తొలి మెట్టు ఇదే.

* ఒకప్పుడు పడుకునే వేళకు ముందు ఇంట్లో వస్తువులన్నీ సర్దుకోవటం, మర్నాటికి అవసరమైనవి సిద్ధం చేసుకోవటం, పక్కలు పరచుకోవటం, ఇంటిల్లిపాదీ కలిసి ముచ్చట్లు పెట్టుకోవటం చేస్తుండేవారు. దీంతో శరీరం తెలియకుండానే నిద్రకు సిద్ధమయ్యేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం గగనమైపోయింది. ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేసి, హడావుడిగా పడుకుంటున్నారు. ఆ వెంటనే నిద్ర పట్టేయాలనీ కోరుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నిద్రకు ఉపక్రమించటానికి గంట ముందు నుంచే ఇంట్లో వెలుతురు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. పెద్ద శబ్దాలు లేకుండా చూసుకోవాలి. పుస్తకం చదవటమో, కబుర్లు చెప్పుకోవటమో చేస్తే రోజువారీ వ్యవహారాల నుంచి మనసు మళ్లుతుంది. ఫలితంగా ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

* పగటిపూట కూడా చురుకుగా, ఆనందంగా ఉండటం మంచిది.

* మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కాఫీ వంటివి తగ్గించాలి.

* పడుకోవటానికి రెండు, మూడు గంటల ముందే రాత్రి భోజనం ముగించాలి.

* పడుకోవటానికి ముందు పాలు గానీ అరటి పండు గానీ తీసుకుంటే మంచిది. వీటిల్లోని ట్రిప్టోఫాన్‌ నిద్ర బాగా పట్టటానికి తోడ్పడుతుంది.

* రాత్రిపూట మిఠాయిలు తినొద్దు. వీటితో మెదడు చురుకుదనం పెరిగి, నిద్ర సరిగా పట్టదు.

* మద్యంతో ముందు నిద్ర పట్టినా మధ్యలో మెలకువ వస్తుంది. గాఢ నిద్ర పట్టకుండా అడ్డు తగులుతుంది. పొగ తాగితే మెదడు ఉత్తేజితమై నిద్ర పట్టకుండా చేస్తుంది. కాబట్టి వీటి జోలికి వెళ్లొద్దు. ఒకవేళ వీటి అలవాటుంటే పడుకోవటానికి మూడు గంటల ముందే ఆపెయ్యాలి.


పరీక్షలు ప్రధానం

ముందుగానే జబ్బులను పట్టుకోవటానికి, అవి అదుపులో ఉన్నాయో లేవో తెలుసుకోవటానికి పరీక్షలు చాలా కీలకం.

మూత్రపరీక్ష: సాధారణంగా ఆరోగ్యానికి సంబంధించి చాలా విషయాలు మూత్ర పరీక్షతోనే బయటపడుతుంటాయి. ప్రొటీన్‌ పోవటం, ఇన్‌ఫెక్షన్లు, కొందరిలో మధుమేహమూ దీంతోనే తెలుస్తాయి. దీన్ని ఏటా ఒకసారి చేయించుకోవాలి.

సంపూర్ణ రక్త విశ్లేషణ: ఇది చిన్నదే గానీ అతి ముఖ్యమైంది. మనదేశంలో 65% మంది స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అయితే చాలామందికి ఇది ఉందన్న సంగతే తెలియదు. తేలికైన రక్తపరీక్షతో దీన్ని తెలుసుకోవచ్చు. తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్లు, న్యూట్రోఫిల్స్‌, లింఫోసైట్లు, ఈస్నోఫిల్స్‌, బేసోఫిల్స్‌, మోనోఫిల్స్‌ సంఖ్య కూడా తెలుస్తుంది. ఇన్‌ఫెక్షన్లు, క్షయ, క్యాన్సర్లు, అలర్జీలు, నులి పురుగులు, కాలేయ జబ్బులు, విటమిన్‌ బి12 లోపం, ఐరన్‌ లోపం వంటి జబ్బులను ముందే పట్టుకోవటానికివి తోడ్పడతాయి.

గ్లూకోజు: మనదగ్గర మధుమేహం బయట పడేసరికే చాలామందిలో దీని దుష్ప్రభావాలూ కనిపిస్తుంటాయి. కాబట్టి 20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏటా ఒకసారి పరగడుపున రక్తంలో గ్లూకోజు పరీక్ష చేయించుకోవాలి. మూడు నెలల గ్లూకోజు సగటును తెలిపే హెచ్‌బీఏ1సీ పరీక్షా అవసరమే. అప్పటికే మధుమేహం గలవారైతే వారానికోసారైనా గ్లూకోమీటరుతో పరీక్షించుకోవాలి. మూడు నెలలకోసారి హెచ్‌బీఏ1సీ పరీక్ష చేయించుకోవాలి. ప్రస్తుతం నిరంతరం గ్లూకోజు మోతాదులను నమోదు చేసే పరికరాలూ ఉన్నాయి. వీటిని చర్మానికి అతికించుకుంటే 2 వారాల వరకు పనిచేస్తాయి. వీలుంటే వీటిని వాడుకోవచ్చు.

క్రియాటినైన్‌: తొలిదశలో లక్షణాలేవీ కనిపించకపోవటం వల్ల కిడ్నీజబ్బు చాలామందిలో ముదిరిన తర్వాతే బయటపడుతోంది. కాబట్టి ఏటా ఒకసారైనా క్రియాటినైన్‌ పరీక్ష చేయించుకోవాలి.

కొలెస్ట్రాల్‌ పరీక్ష: కొలెస్ట్రాల్‌కూ బరువుకూ సంబంధం లేదు. సన్నగా ఉన్నా కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండొచ్చు. లావుగా ఉన్నవారిలో తక్కువగానూ ఉండొచ్చు. అందరూ కొలెస్ట్రాల్‌ పరీక్ష చేయించుకోవాలి.

కాలేయ సామర్థ్యం: మనదేశంలో సుమారు 4% మందిలో హెపటైటిస్‌ బి వైరస్‌ కనిపిస్తుంది. కొందరికి హెపటైటిస్‌ సి కూడా ఉండొచ్చు. కాబట్టి ఏటా ఒకసారి కాలేయ సామర్థ్యాన్ని తెలిపే ఎల్‌ఎఫ్‌టీ పరీక్ష చేయించుకోవాలి.

ఈసీజీ: ఇరవై ఏళ్లు దాటినవారు ఏటా గుండెకు సంబంధించిన ఈసీజీ చేయించుకోవాలి.

పీఎస్‌ఏ: యాబై ఏళ్లు దాటిన మగవాళ్లందరికీ ఏటా పీఎస్‌ఏ (ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటీజెన్‌) పరీక్ష అవసరం. దీంతో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను పట్టుకోవచ్చు. దీన్ని తొలిదశలో గుర్తిస్తే చికిత్స తేలిక.

మలంలో రక్తం: ఏటా ఒకసారి మలంలో రక్త పరీక్ష చేయించుకోవాలి. రక్తం ఆనవాళ్లుంటే ఎండోస్కోపీ, కొలనోస్కోపీ పరీక్షలు అవసరమవుతాయి. వీటితో లోపల అల్సర్లు, కణితులు, క్యాన్సర్లుంటే బయటపడతాయి.

కొలనోస్కోపీ: చాలాదేశాల్లో 55 ఏళ్లు దాటగానే ప్రతి పదేళ్లకోసారి కొలనోస్కోపీ చేయించుకుంటారు. మనదేశంలోనూ పెద్ద పేగు క్యాన్సర్‌ ఎక్కువవుతున్న నేపథ్యంలో డాక్టర్‌ సలహా మేరకు దీన్ని చేయించుకోవాలి. రక్తహీనత గలవారికీ ఇది అవసరమే.

రక్తపోటు: అధిక రక్తపోటులో కోపం, ఉద్రిక్తత స్వభావం ఉంటాయని భావిస్తుంటారు. ఇది నిజం కాదు. ప్రతి ఆర్నెల్లకోసారి అయినా రక్తపోటు ఎంతుందో చూపించుకోవాలి.

బరువు: అధిక బరువు, ఊబకాయంతో అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, గురక, మధుమేహం, క్యాన్సర్లు, హార్మోన్ల సమస్యలు తలెత్తుతాయి. ఆర్నెల్లకోసారైనా బరువును కొలుచుకొని.. ఎత్తు, బరువుల నిష్పత్తిని (బీఎంఐ) చూసుకోవాలి.

చూపు: పెద్దవాళ్లకే కాదు.. పిల్లలకూ ఏటా కంటి పరీక్ష అవసరం. దృష్టి దోషాలు, గ్లకోమా, రెటీనా దెబ్బతినటం వంటి సమస్యలను ముందే తెలుసుకోవటానికిది తోడ్పడుతుంది.

వినికిడి పరీక్ష: వినికిడి తగ్గితే తికమక పడతారు. రోడ్డు ప్రమాదాలకూ గురికావొచ్చు. 40 ఏళ్లు దాటినవారు ఒకసారి వినికిడి పరీక్ష చేయించుకోవాలి.

థైరాయిడ్‌: ఏటా ఒకసారి థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవటం మంచిది. థైరాయిడ్‌ మందులు వాడేవారైతే ఆర్నెల్లకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని