గీతా జయంతి

ప్రపంచ మానవాళికి భగవాన్‌ శ్రీకృష్ణ మహా ప్రభువు స్వయంగా అందించిన మహాకావ్యం భగవద్గీత. కురుక్షేత్ర సమరం ప్రారంభానికి ముందు అర్జునుడు దాయాదులతో యుద్ధం చేయలేనని నిరాశ ....

Published : 06 Dec 2016 19:37 IST

గీతాజయంతి


  ప్రపంచ మానవాళికి భగవాన్‌ శ్రీకృష్ణ మహా ప్రభువు స్వయంగా అందించిన మహాకావ్యం భగవద్గీత. కురుక్షేత్ర సమరం ప్రారంభానికి ముందు అర్జునుడు దాయాదులతో యుద్ధం చేయలేనని నిరాశ వ్యక్తంచేయగా కృష్ణుడు విశ్వరూపంతో దర్శనమిస్తాడు. జీవిత పరమార్థాన్ని బోధిస్తాడు. ఆయన వ్యాఖ్యానాన్ని భగవద్గీతగా పరిగణిస్తాం.పరంధాముడే ఆచార్యుడిగా మారి బోధించడంతో కృష్ణం వందే జగద్గురు అని పిలుస్తాం. నిజానికి భగవంతుని కంటే నిజమైన గురువు ఎవరుంటారు? ఆ సర్వమంగళమూర్తిని నిరంతరం ధ్యానించి ధర్మమార్గంలో మనం నడవాలి. అదే జీవితానికి పరమార్ధమవుతుంది. మార్గశిర మాసంలో శుక్లపక్షం ఏకాదశిన భగవద్గీత బోధన జరిగింది. అందుకనే ఏటా అదే రోజున గీతాజయంతిని జరుపుకొంటాం. ఆ మహాగ్రంథాన్ని పఠించడం ద్వారా జీవిత విలువలను తెలుసుకుంటాం. ఆదర్శ జీవితాన్ని గడిపేందుకు గీతా పఠనం ఎంతో దోహదం చేస్తుంది. అత్యంత విలువలతో కూడిన జీవితాన్ని భగవద్గీత బోధిస్తుంది. గీతా జయంతి రోజున హరియాణాలోని కురుక్షేత్రలో పూజలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. గీతా పఠన కార్యక్రమం ఉంటుంది. భజనలు, ఆరాధనలతో కృష్ణ భగవానుడిని ఆరాధిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ మందిరాల్లో భగవద్దీతపై పెద్దవాళ్లు వ్యాఖ్యానం చేస్తారు. గీతలో 18 విభాగాలున్నాయి. వీటిని యోగము అంటారు. తత్వము, ఆత్మతత్వము, జీవనయాగం, జీవన గమ్యం... తదితర అంశాలను గీత సవివరంగా వెల్లడిస్తుంది. గీతా పఠనం ఆధ్యాత్మిక విలువలను పెంచుతుంది. ప్రపంచజ్ఞానాన్ని అందిస్తుంది. పవిత్ర గ్రంథమైన గీతకు గీతోపనిషత్‌ అనే పేరు కూడా వుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు