AP High Court: పరకామణిలో చోరీ కేసు రాజీపై.. సమగ్ర దర్యాప్తు చేయండి

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 28 Oct 2025 03:37 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
7 min read

హైకోర్టు మూడు కీలక ఉత్తర్వులు
తితిదే బోర్డు అప్పటి ఛైర్మన్, అధికారులు, ఐవో, ఫిర్యాదుదారుల పాత్ర తేల్చాలని సీఐడీ డీజీకి ఆదేశం
నిందితుడు రవికుమార్, కుటుంబ సభ్యుల ఆస్తులపై దర్యాప్తునకు ఏసీబీ డీజీకి ఉత్తర్వులు
లోక్‌ అదాలత్‌లో రాజీ చేసిన మెజిస్ట్రేట్‌పై కీలక వ్యాఖ్యలు
ప్రొటోకాల్‌ విధుల్లోంచి తప్పించాలని అభిప్రాయ వ్యక్తీకరణ
విచారణ డిసెంబరు 2కు వాయిదా 

ఈనాడు, అమరావతి: తితిదే పరకామణిలో వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన చోరీ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. తీర్పులో తాము ప్రస్తావించిన అంశాలతోపాటు తితిదే బోర్డు, అధికారులు, చోరీ కేసు దర్యాప్తు అధికారి(ఐవో), ఫిర్యాదుదారు/ అసిస్టెంట్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ వై.సతీష్‌కుమార్‌ పాత్రపై దర్యాప్తు చేయాలని సీఐడీ డీజీని ఆదేశించింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫారసు చేయాలని పేర్కొంది. ఆ నివేదికను సీల్డ్‌ కవర్లో రిజిస్ట్రార్‌ జ్యుడిషియల్‌కు అందజేయాలని సూచించింది. సీఐడీ డీజీ ర్యాంక్‌ అధికారి దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని స్పష్టంచేసింది. 

మరోవైపు, నిందితుడు రవికుమార్, అతని కుటుంబ సభ్యులు కూడబెట్టిన, ఇతరులకు అమ్మిన, కేటాయించిన స్థిర, చరాస్తులతో పాటు వారి బ్యాంక్‌ ఖాతాలపై ఏసీబీ డీజీ ర్యాంక్‌ పోలీసు అధికారితో దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. ఆ ఆస్తులు వారి ఆదాయానికి తగ్గట్టే ఉన్నాయా, లేదా అన్నది తేల్చాలని పేర్కొంది. వారిపై చర్యలకు సిఫారసు చేస్తూ నివేదికను సీల్డ్‌కవర్లో రిజిస్ట్రార్‌ జ్యుడిషియల్‌కు సమర్పించాలని ఏసీబీ డీజీని ఆదేశించింది. 

చోరీ కేసు రాజీకి అనుమతిస్తూ 2023 సెప్టెంబర్‌ 9న లోక్‌ అదాలత్‌ జారీచేసిన అవార్డు చట్టబద్ధతను తేల్చేందుకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నివేదించే నిమిత్తం.. తాము జారీచేసిన ఈ తీర్పు ప్రతిని హైకోర్టు సీజే వద్ద ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఇప్పటికే సీజ్‌ చేసి తమ ముందు ఉంచిన 16 బండిళ్లు (రికార్డులు) సీఐడీ డీజీకి అందజేయాలని రిజిస్ట్రార్‌ జ్యుడిషియల్‌కు స్పష్టంచేసింది. 2023 ఏప్రిల్‌ 29 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు పనిచేస్తూ, చోరీ కేసును రాజీ చేసిన తిరుపతి మొదటి తరగతి రెండో అదనపు జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ వార్షిక రహస్య నివేదికలో(ఏసీఆర్‌) ఈ తీర్పు కాపీని పొందుపరచాలని రిజిస్ట్రార్‌ విజిలెన్స్‌ను ఆదేశించింది.

న్యాయవ్యవస్థలో పాలనాపరమైన పారదర్శకత, సమగ్రతను కాపాడేందుకు ఆ న్యాయాధికారిని తక్షణమే ప్రొటోకాల్‌ విధుల నుంచి పక్కనపెట్టాలని అభిప్రాయపడింది. దీనిపై చర్యలు తీసుకునేందుకు తీర్పు ప్రతిని సంబంధిత పరిపాలన కమిటీ ముందు ఉంచాలని రిజిస్ట్రార్‌ జ్యుడిషియల్‌కు సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 2కు వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చుకోవాలన్న ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి వేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్‌ వేయాలని నిందితుడు, ఫిర్యాదుదారును ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ సోమవారం ఈ కీలక ఉత్తర్వులిచ్చారు.

కేసు నేపథ్యమిదీ..

పరకామణిలో 2023లో జరిగిన కుంభకోణంపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ జర్నలిస్ట్‌ ఎం.శ్రీనివాసులు గతేడాది సెప్టెంబర్‌ 10న తితిదే ఈవోకు వినతిపత్రమిచ్చారు. దానిపై చర్యలు లేకపోవడంతో హైకోర్టులో వ్యాజ్యం చేశారు. అందులో ‘పరకామణి ఉద్యోగి సీవీ రవికుమార్‌ డాలర్ల రూపంలో భారీగా నగదు, బంగారం అపహరించారు. దీనిపై ఏవీఎస్‌వో వై.సతీష్‌కుమార్‌ 2023 ఏప్రిల్‌ 29 తిరుమల వన్‌టౌన్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు పూర్తిచేసిన పోలీసులు ఛార్జ్‌షీట్‌ వేశారు. అనూహ్యంగా సతీష్‌కుమార్‌ నిందితుడు రవికుమార్‌తో స్వచ్ఛందంగా లోక్‌ అదాలత్‌లో 2023 సెప్టెంబర్‌ 9న రాజీ చేసుకున్నారు’ అని ప్రస్తావించారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు.. రికార్డులన్నింటినీ సీఐడీ ద్వారా సీజ్‌ చేయించిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం నాటి విచారణలో న్యాయమూర్తి కీలక ఉత్తర్వులిచ్చారు. వాటిలో ఏముందంటే..

409 సెక్షన్‌ ఎందుకు పెట్టలేదు?

‘‘రికార్డులు పరిశీలిస్తే విచారణాధికారి, తితిదే అధికారులు, బోర్డు.. చోరీ కేసు నమోదు, రాజీ విషయంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించినట్లు స్పష్టమవుతోంది. కేసును విచారణకు తీసుకునేటప్పుడు (కాగ్నిజెన్స్‌), రాజీ ప్రక్రియను నమోదు చేసేటప్పుడు సంబంధిత కోర్టు ప్రిసైడింగ్‌ అధికారి (పీవో) బుర్ర ఉపయోగించినట్లు కనిపించడం లేదు. పెదజీయంగార్‌ మఠం తరఫున రవికుమార్‌ 1985 అక్టోబర్‌లో పరకామణి పర్యవేక్షణ అధికారిగా నియమితులయ్యారు. 2023 ఏప్రిల్‌ 29న చోరీ కేసు నమోదయ్యే నాటికి 38 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి (పబ్లిక్‌ సర్వెంట్‌) నిర్వచనం పరిధిలోకి వస్తారు.

అతనిపై ఐపీసీ సెక్షన్‌ 409 (ప్రభుత్వ ఉద్యోగి నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడటం) కింద కేసు పెట్టి, దాని ఆధారంగానే విచారణ చేపట్టి ఉండాల్సింది. ఛార్జ్‌షీట్‌లోనూ 409 కింద అభియోగాలు మోపాల్సింది. కానీ, రాజీకి వీలున్న 379, 381 సెక్షన్లు మాత్రమే నమోదు చేశారు. ఈ సెక్షన్లను పరిశీలించకుండా, మైండ్‌ అప్లె చేయకుండా తిరుపతి మెజిస్ట్రేట్‌ అభియోగపత్రాన్ని 2023 మే 31న విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుని నిందితుడికి సమన్లు జారీచేశారు. 409 సెక్షన్‌ పెట్టకపోవడమంటే.. ఐవో, న్యాయాధికారి తీవ్ర లోపానికి పాల్పడ్డారని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నాం.

అరెస్ట్‌ చేయకుండా 41ఏ నోటీసు.. 

నిందితుడిని ఐవో అరెస్ట్‌ చేయకుండా సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసు మాత్రమే ఇచ్చారు. కేసు డైరీలోనూ నిందితుడి ఆస్తులపై క్రైం బ్రాంచి, ఏసీబీ దర్యాప్తు చేసినట్లు లేదు. మొత్తంగా చూస్తే 2023 జూన్‌ 1 నాటికే రవికుమార్‌పై క్రిమినల్‌ చర్యలు ముగించినట్లు స్పష్టమవుతోంది. లాంఛనప్రాయంగా 2023 సెప్టెంబర్‌ 9న లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకున్నట్లు తేటతెల్లమవుతోంది.

కానుకలకు దేవుడే యజమాని 

తిరుమలలో భక్తులు ఇచ్చే కానుకలకు యజమాని.. దేవుడే అవుతారు. ఆ కానుకలపై స్వామివారి తరఫున తితిదే బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. అంటే, తితిదే ఆమోదం లేకుండా రాజీకి వీల్లేదు. ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన సతీష్‌కుమార్‌ స్వామివారి ఆస్తికి ఏవిధంగానూ యజమాని కాలేరు. చోరీ కేసుపై రాజీకీ అంగీకరించే అధికారం అతనికి లేదు. ఆ రాజీ చట్ట విరుద్ధం.

పత్రికలో ప్రకటన ఇవ్వకుండానే..

రవికుమార్, అతని కుటుంబ సభ్యులు తమ ఆస్తులను 2023 మేలో రెండు దఫాలుగా తితిదేకు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆస్తులను బహుమతిగా అంగీకరించాలంటే తితిదే నిబంధనల ప్రకారం కనీసం 30 రోజుల ముందు పత్రికల్లో ఆ విషయాన్ని ప్రచురించాలి. తితిదే అప్పటి ఈవో, జేఈవోలు పత్రికా ప్రకటన ఇవ్వకుండానే రవికుమార్‌ ప్రతిపాదించిన గిఫ్ట్‌ డీడ్‌లను స్వీకరించేందుకు సిఫారసు చేశారు. దీనికి అప్పటి ఛైర్మన్‌ సాధారణంగా సమ్మతించారు. సంబంధిత ప్రొసీడింగ్స్‌లో రవికుమార్‌పై పరకామణిలో చోరీ కేసు ఉన్నట్లు ప్రస్తావించలేదు. పత్రికా ప్రకటన మినహాయింపు ప్రొసీడింగ్స్‌ తప్ప.. రవికుమార్, అతని కుటుంబ సభ్యుల ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన ఉత్తర్వులేవీ తమ వద్ద లేవని రికార్డులు సీజ్‌ చేసిన సమయంలో తితిదే అధికారులు సీఐడీకి వెల్లడించారు’’ అని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


నిర్లక్ష్యమా? మోసపూరిత వైఖరా?

‘తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ కేసు నిందితుడు సీవీ రవికుమార్‌పై నమోదైన క్రిమినల్‌ కేసును హడావుడిగా మూసివేసేందుకు చట్ట నిబంధనలు, పరిపాలనా పరమైన పద్ధతులను పూర్తిగా విస్మరించారు. ఇలా ఎందుకు చేశారో దీని వెనుకున్న వ్యక్తులు, అధికారులకే తెలుసు. ఇదంతా తీవ్ర నిర్లక్ష్యం వల్ల జరిగిందా?  అధికారులు బుర్ర పెట్టకపోవడం వల్లా? లేక వారి సహకారం, మోసపూరిత వ్యవహార శైలితోనా? అన్నది తేలాలి.’


లోతైన దర్యాప్తు అవసరం

‘ఉద్యోగి అయిన రవికుమార్‌పై ఐపీసీ 409 సెక్షన్‌ కింద అభియోగాలు మోపకపోవడం సరికాదు. రవికుమార్, అతని కుటుంబ సభ్యులు శ్రీవారికి ఇస్తానన్న ఆస్తుల స్వీకరణకు 30 రోజుల ముందు నోటీసు ఇచ్చి పత్రికా ప్రకటన జారీ చేయాలన్న నిబంధనను ఎందుకు పక్కనపెట్టారు? ఆ ఆస్తుల స్వాధీనానికి తితిదే బోర్డు అప్పటి ఛైర్మన్‌ అంగీకరించడం, సంబంధిత ఉత్తర్వుల్లో చోరీ కేసును ప్రస్తావించకపోవడంపై లోతైన దర్యాప్తు అవసరం.’

ఏపీ హైకోర్టు


కేసు రాజీ వెనుక పెద్ద తలకాయలున్నాయి

సిట్‌తో దర్యాప్తు జరిపించండి
ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేసినందుకు బెదిరింపులు వచ్చాయి
సాధు పరిషత్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు

హైకోర్టులో సోమవారం జరిగిన విచారణలో ఏపీ సాధు పరిషత్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదిస్తూ, ‘ఈ చోరీ కేసును మూసివేయడానికి హడావుడిగా పావులు కదిపారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా లోక్‌ అదాలత్‌లో కేసును రాజీ చేసుకున్నారు. తితిదే బోర్డు ఆమోదించకుండా ఇలా చేసే అధికారం ఏవీఎస్‌వోకు లేదు. స్వామివారి ఆస్తులకు ఆయన యజమాని కాదు’ అని పేర్కొన్నారు. ‘తితిదేలో అప్పట్లో జరిగిన అక్రమాలకు ఈ చోరీ కేసు చిన్న ఉదాహరణ మాత్రమే. దీని రాజీ వెనుక పెద్ద తలకాయలున్నాయి. ఏయే కేసుల్లో రాజీ చేసుకోవాలి? ఎవరు రాజీ చేసుకోవచ్చు? తదితర విషయాలన్నీ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అందుకు భిన్నంగా లోక్‌ అదాలత్‌లో ఈ కేసును రాజీ చేసుకున్నార’ని వాదించారు.

ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేసినందుకు ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతికి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని చెప్పారు. ‘తిరుపతి, తిరుమల వ్యవహారాలతో మీకేం పని అంటూ ఆయన్ను బెదిరిస్తున్నారు. రాజీ వెనుక కుట్ర లేకపోతే ఆయన్ను బెదిరించాల్సిన అవసరమేంటి? ఈ మొత్తం వ్యవహారాన్ని తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)తో దర్యాప్తు చేయాలి. సాధు పరిషత్‌ను ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చండి’ అని కోరారు. 

Tags :
Published : 28 Oct 2025 03:10 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు