నిమ్మగడ్డ, మాట్రిక్స్‌ ఆస్తులపై యథాతథస్థితి

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 29 Oct 2025 06:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

రాకియా పిటిషన్‌లో సుప్రీంకోర్టు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఆయన కుమార్తె గునుపాటి స్వాతి, అల్లుడు ప్రణవ్‌రెడ్డిలతో పాటు మాట్రిక్స్‌ ఫార్మా కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, టియానిష్‌ ల్యాబొరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల ఆస్తులపై యథాతథస్థితి కొనసాగించాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీచేసింది. వాన్‌పిక్‌ ప్రాజెక్టు వ్యవహారంలో రస్‌ అల్‌ ఖైమా కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో భాగంగా ఆస్తులను అన్యాక్రాంతం చేస్తుండటంపై రస్‌ అల్‌ ఖైమా ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (రాకియా) సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జాయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. వాన్‌పిక్‌ ప్రాజెక్టుకు సంబంధించి సుమారు రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉందంటూ నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఆదేశిస్తూ రాక్‌ కోర్టు ఇచ్చిన డిక్రీ అమలు కోసం రాకియా హైదరాబాద్‌ సివిల్‌ కోర్టును ఆశ్రయించింది.

ఇందులో భాగంగా నిమ్మగడ్డ కుటుంబానికి చెందిన కంపెనీల ఆస్తులు అన్యాక్రాంతం అవుతుండడంపై రాకియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాకియా తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మనుసింఘ్వీ, కె.వివేక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేదాకా ఆస్తులను అన్యాక్రాంతం చేయరాదంటూ స్టేటస్‌ కో ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. మాట్రిక్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ మాట్రిక్స్‌లో నిమ్మగడ్డ ప్రసాద్‌కు వాటాలేమీ లేవని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ విచారణను డిసెంబరు 15వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు నిమ్మగడ్డ ప్రసాద్, ఇతరులు, కంపెనీల ఆస్తులపై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది.

Tags :
Published : 29 Oct 2025 06:17 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని