పాపంపేట ప్రజలకు ఆ స్థలాలపై హక్కులు కల్పిస్తాం

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 05:48 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

భూ వివాదంలో మేమూ బాధితులమే
రాచూరి కుటుంబ వారసుల ఉమ్మడి ప్రకటన

మాట్లాడుతున్న రాచూరి వెంకట కిరణ్, రాచూరి వెంకట రమణ

అనంతపురం(వ్యవసాయం), న్యూస్‌టుడే: అనంతపురం నగర శివారులోని పాపంపేటలో భూ వివాదానికి తెరదించే దిశగా రాచూరి కుటుంబ వారసులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఇదివరకు ఇళ్లు నిర్మించుకుని అనుభవంలో ఉన్నవారికి భూమిపై హక్కులు విడుదల చేస్తామని ప్రకటించారు. శుక్రవారం అనంతపురంలో రాచూరి వెంకట కిరణ్, రాచూరి వెంకట రమణ ఉమ్మడిగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘పాపంపేట భూ వివాదంలో మేం కూడా బాధితులమే. మాది కాని సొమ్మును ఆశించే స్థితిలో లేం. భూమిపై మాకు హక్కు ఉన్నందునే న్యాయపరంగా పోరాటానికి సిద్ధమయ్యాం. ప్రస్తుతం సమస్య కోర్టు పరిధిలో ఉంది. మేం చట్టానికి లోబడే నడుచుకుంటాం. ఎవరినీ ఇబ్బంది పెట్టబోం. పాపంపేట గ్రామ పెద్దలు, స్థానిక నాయకుల సూచన మేరకు స్థానికులకే హక్కులు విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కూడా ఇదే మాటకు కట్టుబడి ఉంటాం. ఒకవేళ న్యాయస్థానాల్లో మాకు అనుకూలంగా తీర్పు వచ్చినా స్థానికులను ఇబ్బంది పెట్టబోం. కొంతమంది మా నుంచి రెండెకరాలు, మూడెకరాలు కొన్నారు. అయితే వారంతా కొన్నదాని కంటే ఎక్కువ భూమిని ఆక్రమించి అమ్మేసుకున్నారు. అలాంటి భూములపైనా మా హక్కులు వదులుకుంటున్నాం. మా నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోని భూములపైనే న్యాయపరంగా పోరాటం చేస్తాం. దానిపై హక్కు ఉందనే పోరాటం చేస్తున్నాం. విషయం తెలియనివారు యూట్యూబ్‌లో, మీడియాలో మాపై నిందారోపణలు చేయడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నాం. మా ఉద్దేశాలను తప్పుగా చిత్రీకరించడంతో పాపంపేట ప్రజల్లో భయాందోళన మొదలైంది’’ అని వివరించారు. పాపంపేట భూములపై 20 ఏళ్ల కిందటే కదలిక వచ్చిందన్నారు. స్థానిక ప్రజలే తమను సంప్రదించారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు