పొలాల్లో నీరు తొలగించండి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 05:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దండి
కేంద్ర బృందాలను ఆహ్వానించండి
సహాయ చర్యలపై సీఎం చంద్రబాబు

ఈనాడు-అమరావతి: తుపాను ప్రభావంతో పంటపొలాల్లో నిలిచిన నీటిని వెంటనే బయటకు పంపేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. నీట మునిగిన చోట ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దాలని స్పష్టం చేశారు. తుపాను అనంతర సహాయ చర్యలపై శుక్రవారం ఆయన ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ‘ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఎక్కడెక్కడ పొలాలు నీట మునిగాయో గుర్తించి.. శనివారం నాటికి మొత్తం నీటిని మళ్లించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఉత్తమ ఫలితాలు చూపించాలి. నీట మునగడం వల్ల పంట దిగుబడి తగ్గకుండా చర్యలు చేపట్టేలా శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవాలి’ అని నిర్దేశించారు. 

కేంద్ర బృందాల్ని ఆహ్వానించండి..

మొంథా తుపానుతో రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్రానికి వెంటనే ప్రాథమిక నివేదిక అందించాలని, క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర బృందాన్ని ఆహ్వానించాలని చంద్రబాబు సూచించారు. ‘తుది నివేదిక సమర్పించేలోగా తక్షణ సాయం అందించేలా కేంద్రాన్ని కోరాలి. నేను ప్రధాని మోదీతో మాట్లాడతా’ అని సీఎం పేర్కొన్నారు. కృష్ణా నదికి వరద పరిస్థితి పైనా ఆయన ఆరా తీశారు. బాపట్ల జిల్లాలో ఎక్కువగా నీరు నిలిచిందని. ఆదివారం నాటికి నీరు లేకుండా చూస్తామని అధికారులు సీఎంకు చెప్పారు. 

అత్యుత్తమంగా పనిచేసిన వారికి శనివారం సన్మానం

తుపాను సహాయ చర్యల్లో అత్యుత్తమంగా పనిచేసిన వారిని సన్మానించాలని చంద్రబాబు ఆదేశించారు. శనివారం ఉదయం 11 గంటలకు సుమారు 100 మందికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని