పంచాయతీరాజ్‌లో పదోన్నతుల పండగ

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 02 Nov 2025 05:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

1,500 మందికి పైగా కార్యదర్శులకు ఉద్యోగోన్నతి
రెండేళ్ల కాలపరిమితిని ఏడాదికి సవరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఈనాడు, అమరావతి: పంచాయతీరాజ్‌శాఖలో పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పదోన్నతులకు కనీస అర్హత రెండేళ్ల నుంచి ఏడాదికి సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఒకేసారి 1,500 మందికిపైగా పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతి లభించనుంది. వీరిలో గ్రేడ్‌-1 కార్యదర్శులు, సీనియర్‌ అసిస్టెంట్లు 660 మంది డిప్యూటీ ఎంపీడీవోలుగా, మిగతా కార్యదర్శులు ఇప్పుడున్న గ్రేడ్‌ నుంచి అంతకంటే పైగ్రేడ్‌కు వెళ్లనున్నారు. పంచాయతీ కార్యదర్శులకు భారీగా పదోన్నతులు కల్పించడం ఇదే మొదటిసారి. 

  • గ్రామ సచివాలయాలపై పర్యవేక్షణకు మండల స్థాయిలో ప్రత్యేక అధికారులుగా డిప్యూటీ ఎంపీడీవోలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలాల్లో ప్రస్తుతం ఉన్న వారిని కేటాయించడం ద్వారా ఖాళీలు ఏర్పడే అవకాశం ఉందని గమనించిన ప్రభుత్వం.. అర్హత కలిగిన గ్రేడ్‌-1 పంచాయతీ కార్యదర్శులకు, జిల్లా, మండల పరిషత్, జిల్లా పంచాయతీ కార్యాలయాల్లో సీనియర్‌ అసిస్టెంట్లకు కలిపి 660 మందికి డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది.
  • ఒక క్యాడర్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలంటే నిబంధనల ప్రకారం ఇప్పుడున్న స్థానంలో రెండేళ్లపాటు విధిగా పని చేయాలి. కూటమి ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి పోస్టులను కొన్నింటిని ఏడాది క్రితం పదోన్నతుల ద్వారా భర్తీ చేసింది. రెండేళ్లు పూర్తవ్వని కారణంగా 474 మంది కార్యదర్శులకు పదోన్నతులు కల్పించే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
  • పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులతో చర్చించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌.. సమస్యకు పరిష్కారంగా రెండేళ్ల కాలపరిమితిని ఏడాదికి తగ్గించేలా నిబంధనల్లో సవరణల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించడంతో పదోన్నతులకు మార్గం సుగమం అయింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు