Kasibugga Stampede: ఆలయాల్లో ఏర్పాట్లు అంతంత మాత్రమే..

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 03 Nov 2025 04:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

రద్దీకి తగినట్లు లేని వరుస మార్గాలు
ప్రమాదాలకు దారితీస్తున్న నిర్లక్ష్యం

ఈనాడు, విశాఖపట్నం: మొక్కకు రక్షణ కోసం ఇనుప కంచె ఏర్పాటుచేస్తాం. మొక్క మానైనప్పుడు ఆ ఇనుప కంచే దానికి అడ్డొస్తుంది. అలాగే ఆలయాల్లో క్యూలో పంపేందుకు, భక్తుల రక్షణ కోసం రెయిలింగ్‌లు, బారికేడ్లు ఏర్పాటుచేస్తున్నారు. కొన్నిచోట్ల ఇవి ప్రణాళికాబద్ధంగా లేకపోవడంతో భక్తుల రద్దీ పెరిగినప్పుడు అవే అడ్డుగా మారి ప్రాణాంతకమవుతున్నాయి. 

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో దర్శనానికి వెళ్లి, తిరిగి రావడానికి ఒకే మెట్లమార్గం ఉంది. 12 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మార్గం మధ్యలో.. క్యూ పద్ధతి కోసం స్టీల్‌ రెయిలింగ్‌ ఏర్పాటుచేశారు. తొక్కిసలాట జరగ్గానే ఆ రెయిలింగ్‌ విరిగి దానికింద కొందరు ఇరుక్కుపోగా, మరికొందరు 12 అడుగుల ఎత్తు నుంచి కిందికి పడిపోయారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ 30 తెల్లవారుజామున విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న చందనోత్సవం వేళ ఏడుగురు భక్తులు మృతిచెందారు. కొత్తగా కట్టిన మెట్లమార్గంలోని గోడ వర్షపునీరు, ఈదురు గాలులకు కూలి వరుసలో ఉన్న భక్తులపై పడింది. క్యూ మధ్యలో బారికేడ్లు, ఫెన్సింగ్‌ తీగలు ఏర్పాటుచేశారు. గోడ కూలేటప్పుడు ఫెన్సింగ్‌ల కింద చిక్కుకుని బయటకు రాలేక ప్రాణాలు విడిచారు.

నిర్మాణంలో లోపాలే.. శాపాలుగా 

ప్రధాన ఆలయాల్లో పర్వదినాల సమయంలో భక్తుల రద్దీకి తగ్గట్లు ముందస్తు ఏర్పాట్లు ఉండాలి. అలాంటప్పుడు వెడల్పైన మార్గాలు ఏర్పాటు చేయట్లేదు. ఫెన్సింగ్‌లు, గ్రిల్స్, బారికేడ్ల ఏర్పాట్లలో లోపాలుంటున్నాయి. భక్తుల క్యూమార్గంలో రెయిలింగ్‌లు, బారికేడ్ల లాంటివి అనుభవం ఉన్నవారితో ఏర్పాటుచేయించాలి. భక్తుల కోసం ఏర్పాటుచేసిన రెయిలింగ్‌ పేలవంగా ఉందని కాశీబుగ్గ ఘటనలో తెలుస్తోంది. మార్గం చిన్నదిగా ఉన్నచోట బారికేడ్లను అడ్డుగా పెట్టి ఎక్కువ క్యూలైన్లు ఏర్పాటుచేయడంతో భక్తులు తోసుకునే క్రమంలో తొక్కిసలాటకు దారితీస్తోంది. కొన్ని ఆలయాల్లో తాత్కాలిక, పాత రెయిలింగ్‌లు బలహీనంగా ఉండి భక్తుల రద్దీని తట్టుకోలేవు. అత్యవసర సమయంలో రెయిలింగ్‌లు విరిగిపోతే భక్తులు కిందపడి ప్రమాదం జరిగే అవకాశాలెక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు