Google: విశాఖ గతిని మార్చే ప్రాజెక్టుపై విష ప్రచారం!

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 16 Oct 2025 05:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
7 min read

గూగుల్‌ డేటా సెంటర్‌పై అపోహలు పెంచేందుకు కొందరి యత్నం
వాస్తవాలు ఇలా..

ఈనాడు, అమరావతి: గూగుల్‌ వంటి ప్రపంచ ఐటీ దిగ్గజం సుమారు రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడితో అత్యాధునిక మెగా ఏఐ హబ్, డేటా సెంటర్‌ ఏర్పాటుకు ముందుకొస్తే..మన దేశంలోని ఏ రాష్ట్రమైనా రెడ్‌ కార్పెట్‌తో స్వాగతిస్తుంది. రాజకీయాలకు అతీతంగా అక్కడి పార్టీలన్నీ ఆహ్వానం పలుకుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కుత్సిత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో అశాంతిని రేకెత్తించేందుకు ప్రయత్నించే కొన్ని పార్టీలు, వ్యక్తులు.. విశాఖపట్నంలో గూగుల్‌ ఏర్పాటు చేయనున్న మెగా ఏఐ హబ్‌పై విష ప్రచారం చేస్తున్నాయి. ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. గూగుల్‌ డేటా సెంటర్‌తో ఉద్యోగాలు రావని,  డేటాసెంటర్‌ విపరీతంగా విద్యుత్తు, నీటినీ వినియోగిస్తుందని, విపరీతమైన వేడి వెలువడుతుందని, పర్యావరణానికి హానికరమని దుష్ప్రచారం చేస్తున్నాయి. ఉన్నవీ లేనివీ భూతద్దంలో చూపించి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో వాస్తవాలేమిటో చూద్దాం.

అది కేవలం డేటా సెంటర్‌ కాదు.. మెగా ఏఐ హబ్‌ 

దుష్ప్రచారం 1

విశాఖలో ఏర్పాటు చేసేది డేటా సెంటర్‌ మాత్రమే. అక్కడ డేటా నిల్వకు  అవసరమైన కంప్యూటర్లు, సర్వర్లు మాత్రమే ఉంటాయి. 

వాస్తవం: గూగుల్‌ ఏర్పాటు చేసేది కేవలం డేటా సెంటర్‌ కాదు. అది ఏఐ మెగా హబ్‌. అక్కడ డేటా సెంటర్లతో పాటు, వివిధ సంస్థలకు ఏఐ ఆధారిత కంప్యూటింగ్‌ సేవలందించే మౌలిక వసతులు, భారీ ఎత్తున డేటా స్టోరేజీ, అత్యంత వేగవంతమైన కమ్యూనికేషన్‌ సదుపాయాల వంటివి ఏర్పాటవుతాయి. ఇది ఒక ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్ట్‌. దానిపై గూగుల్‌ 2026-2030 సంవత్సరాల మధ్య 15 బిలియన్‌ డాలర్లు వెచ్చించనుంది. సముద్రంలో వేసే కేబుళ్లతో అభివృద్ధి చేసే ఇంటర్నేషనల్‌ సబ్‌ సీ గేట్‌వేతో వివిధ దేశాలతో అనుసంధానం ఏర్పడుతుంది. గూగుల్‌ క్లౌడ్‌ ఏఐకి సంబంధించి మొత్తం ఆసియాకే విశాఖ గేట్‌వేగా మారుతుంది. ప్రపంచ చిత్రపటంలో విశాఖకు ప్రత్యేక స్థానం దక్కుతుంది. విశాఖను రాబోయే రోజుల్లో ఏఐ నగరంగా పిలుస్తారని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. 


ఉద్యోగావకాశాలకు కల్పతరువు

దుష్ప్రచారం 2

గూగుల్‌ డేటా సెంటర్‌లో నామమాత్రంగానే ఉద్యోగావకాశాలుంటాయి.

వాస్తవం: కేవలం డేటా సెంటర్‌తో వేలల్లో ఉద్యోగాలు రావు. విశాఖలో గూగుల్‌ ఏఐ సేవలందించే మెగా హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఐ) నిపుణులతో పాటు, విద్యుత్‌ సరఫరా, కూలింగ్, నెట్‌వర్కింగ్‌ వ్యవస్థల నిర్వహణకు అవసరమైన హార్డ్‌వేర్‌ నిపుణులూ పెద్ద సంఖ్యలో అవసరమవుతారు. 

  • ఏఐ ఆధారిత కంపెనీలన్నీ డేటా సెంటర్‌కు సమీపంలో ఉండటం వల్ల వచ్చే ప్రయోజనాల్ని పొందేందుకు విశాఖకు తరలి వస్తాయి. దానికి అవసరమైన ఎకోసిస్టమ్‌ ఏర్పాటవుతుంది. 
  • ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి అత్యాధునిక టెక్నాలజీలపై పనిచేస్తూ, ఆర్థిక సేవలు  అందించే సంస్థలకు ప్రతి మిల్లీసెకను కూడా విలువైనదే. గూగుల్‌ ఏఐ హబ్, డేటా సెంటర్‌కు సమీపంలో కార్యకలాపాలు ప్రారంభిస్తే.. మరింత వేగంగా, అంతరాయాల్లేని సేవలు పొందుతాయి కాబట్టి, ఆ సంస్థలన్నీ రాబోయే రోజుల్లో విశాఖకు తరలి వచ్చే అవకాశముంది. 
  • గూగుల్‌ హబ్‌తో పాటు, దాని ఆధారంగా ఏర్పాటయ్యే కంపెనీల్లో కలిపి 1.88 లక్షల వరకు ఉద్యోగావకాశాలు వస్తాయని అంచనా. 
  • మెగా ఏఐ హబ్, డేటా సెంటర్‌ ఏర్పాటు దశలో స్థానిక నిర్మాణ కార్మికులు, సివిల్‌ ఇంజినీర్ల వంటివారికీ పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 
  • ట్రాన్స్‌ఫార్మర్లు, స్విచ్‌గేర్లు, కూలింగ్‌ సిస్టమ్‌లు, బిల్డింగ్‌ మెటీరియల్, యూపీఎస్‌లు, జనరేటర్లు వంటి బ్యాకప్‌ పవర్‌ సరఫరాదారులు, వర్కర్లకు ఉపాధి లభిస్తుంది. వీటికి అవసరమైన పరికరాలను సరఫరా చేసే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటవుతాయి. 

స్టార్టప్‌లూ క్యూ కడతాయి

  • ఏఐ మోడల్‌ డెవలప్‌మెంట్‌కు అవసరమైన కంప్యూటింగ్‌ అవసరాల కోసం అనేక స్టార్టప్‌లు, ఏఐ ల్యాబ్‌లు, రీసెర్చ్‌సెంటర్లు, ఇంక్యుబేటర్లు, టెస్టింగ్‌ సెంటర్లు, ఆర్‌అండ్‌డీ ల్యాబ్‌లు విశాఖకు క్యూ కడతాయి. 
  • స్థిరాస్తి, నిర్మాణ, రవాణా, ఆతిథ్య రంగాలకూ ఊతం లభిస్తుంది. ఎయిర్‌ కనెక్టివిటీ పెరుగుతుంది. 

విద్యా సంస్థలకు ఊతం

మెగా ఏఐ హబ్‌ ఆధారంగా ఏఐ, ఎంఎల్‌పై పనిచేసే కంపెనీలు పెద్ద సంఖ్యలో విశాఖలో ఏర్పాటైతే.. వారికి కావలసిన నిపుణుల్ని తయారు చేసేందుకు విశాఖ చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో విద్యా సంస్థలూ వస్తాయి. ఇప్పటికే ఉన్న యూనివర్సిటీలు, విద్యా సంస్థలు... ఏఐ, ఎంఎల్, డేటా ఇంజినీరింగ్‌ల్లో ప్రత్యేక కోర్సులు ప్రారంభిస్తాయి. ప్రముఖ విద్యా కేంద్రంగా కూడా విశాఖ మారేందుకు అవకాశం ఏర్పడుతుంది.


75 గిగావాట్ల ప్రాజెక్టులు వస్తుంటే విద్యుత్‌ కొరతే రాదు

దుష్ప్రచారం 3

గూగుల్‌ ఏఐ డేటా హబ్‌కు విపరీతంగా విద్యుత్‌ కావాలి. ప్రజలకు విద్యుత్‌ కొరత ఏర్పడుతుంది. ఛార్జీలు పెంచేస్తారు. 

 

వాస్తవం: డేటా సెంటర్లకు ఎక్కువ విద్యుత్‌ కావాలన్నది వాస్తవమే. అక్కడ సర్వర్‌ల నిర్వహణతో పాటు, కంప్యూటింగ్, కూలింగ్, నెట్‌వర్కింగ్, లైటింగ్‌ అవసరాలకు పెద్ద మొత్తంలో విద్యుత్‌ కావాలి. కానీ దాని వల్ల విద్యుత్‌ కొరత ఏర్పడదు. గూగుల్‌ విశాఖలో ఒక గిగావాట్‌ (1000 మెగావాట్లు) సామర్థ్యంగల డేటా సెంటర్‌ను వివిధ దశల్లో ఏర్పాటు చేస్తుంది. దానికి ఇప్పటికిప్పుడు వెయ్యి మెగావాట్లు అవసరం లేదు. సామర్థ్యం పెంచుకుంటూ వెళ్లేకొద్దీ... విద్యుత్‌ అవసరాలు పెరుగుతాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ద్వారా 8000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. 75 గిగావాట్ల సౌర, పవన, పీఎస్పీ విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. కాబట్టి విద్యుత్‌ కొరత అన్న సమస్యే ఉత్పన్నం కాదు. ఆ ప్రాజెక్టులన్నీ ఉత్పత్తి ప్రారంభిస్తే విద్యుత్‌ ఛార్జీలు ఇంకా తగ్గే అవకాశమూ ఉంది.  


ఆధారపడేది పునరుత్పాదక ప్రాజెక్టుల విద్యుత్‌పైనే

దుష్ప్రచారం 4

డేటా సెంటర్లు పర్యావరణానికి హానికరం. వాటి అవసరాలకు పెద్ద ఎత్తున విద్యుత్‌ ఉత్పత్తి చేయడం వల్ల కర్బన ఉద్గారాలు పెరిగిపోతాయి. 

వాస్తవం: గూగుల్, మైక్రోసాఫ్ట్, ఏడబ్ల్యూఎస్‌ వంటి దిగ్గజ సంస్థలు దాదాపుగా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తయిన విద్యుత్‌పైనే ఆధారపడుతున్నాయి. విద్యుత్‌ వినియోగాన్ని రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తూ...పొదుపుగా ఖర్చు చేస్తున్నాయి. విద్యుత్‌ వినియోగ సామర్థ్యం (పీయూఈ)... 1.0 ఉంటే విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తున్నాయని అర్థం. ప్రస్తుతం చాలా ఆధునిక డేటా సెంటర్లు 1.1 నుంచి 1.3 పీయూఈ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. డేటా సెంటర్లు బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తిపై ఆధారపడితేనే కర్బన ఉద్గారాల సమస్య తలెత్తుతుంది. 


ఆధునిక కూలింగ్‌ వ్యవస్థలతో నీటి వినియోగం తగ్గింది

దుష్ప్రచారం 5

డేటా సెంటర్లలోని ఎవాపరేటివ్‌ కూలింగ్‌ వ్యవస్థ కోసం లక్షల లీటర్ల నీరు కావాలి. స్థానికులకు నీటి కొరత ఏర్పడుతుంది. 

వాస్తవం: డేటా సెంటర్లలో కూలింగ్‌ అవసరాల కోసం నీటిని వినియోగిస్తారు. ఒకప్పుడు భారీగా నీటి అవసరం ఉండేది. కానీ ప్రస్తుతం ఆధునిక డేటా సెంటర్లలో లిక్విడ్‌ కూలింగ్, ఇమ్మర్షన్‌ కూలింగ్, ఏఐ ఆప్టిమైజ్డ్‌ ఎయిర్‌ఫ్లో వంటి విధానాల్ని అనుసరిస్తుండటం వల్ల నీరు, విద్యుత్‌ వినియోగం గతంతో పోలిస్తే తగ్గింది. ఒకప్పుడు డేటా సెంటర్లలోని సర్వర్లను అత్యంత శీతల పరిస్థితుల్లో ఉంచేవారు. ఇప్పుడు 27 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో పని చేసే సర్వర్లను ఏర్పాటు చేస్తున్నారు. 


వేడిని తగ్గించే వ్యవస్థలూ ఉన్నాయి

దుష్ప్రచారం 6

డేటా సెంటర్ల నుంచి విపరీతంగా ఉష్ణం వెలువడుతుంది. అర్బన్‌ హీట్‌ ఐలాండ్‌లు ఏర్పడతాయి. 

వాస్తవం: డేటా సెంటర్లలో వాడే కూలింగ్‌ వ్యవస్థల వల్ల గాలిలోకి కొంత ఉష్ణం వెలువడుతుందన్నది వాస్తవమే. మనం వాడే సెల్‌ఫోన్లే కాస్త ఎక్కువ సమయం మాట్లాడితే వేడెక్కుతాయి. అలాంటిది అంత భారీ కంప్యూటింగ్‌ యంత్రాలు పనిచేస్తున్నప్పుడు ఉష్ణం వెలువడటం సహజం. వాటిని కూలింగ్‌ వ్యవస్థలతో నిరంతరం చల్లబరుస్తుంటారు. ఆ కూలింగ్‌ వ్యవస్థల వల్లే గాల్లోకి కొంత వేడి వెలువడుతుంది. అది మరీ ప్రమాదకర స్థాయిలో ఉండదు. మెగా డేటా సెంటర్లు ఆధునిక కూలింగ్‌ టెక్నాలజీతో ఆ సమస్యనూ చాలా వరకు అధిగమిస్తున్నాయి. పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యమిచ్చే అమెరికాలో ఒక్క గూగుల్‌ సంస్థకే తొమ్మిది ప్రాంతాల్లో డేటా సెంటర్లు ఉన్నాయి. నిజంగా వాటి వల్ల అంత ప్రమాదం ఉంటే అమెరికా ప్రభుత్వం వాటిని అనుమతించేదే కాదు. ఒకప్పుడు కంప్యూటర్లు ఒక గది అంత ఉండేవి. సాంకేతికత పెరిగే కొద్దీ వాటి పరిమాణం తగ్గింది. సూపర్‌ కంప్యూటర్ల దశను కూడా దాటేసి ఇప్పుడు క్వాంటమ్‌ కంప్యూటర్ల యుగంలో ఉన్నాం. రాబోయే రోజుల్లో డేటా సెంటర్ల పరిమాణం మరింత తగ్గి, సామర్థ్యం ఇంకా అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది.

Tags :
Published : 16 Oct 2025 04:10 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు