Andhra News: నేతలను మేపలేక ‘జాకీ’ పరార్‌!

పరిశ్రమ స్థాపిస్తామని ఎవరైనా ముందుకొస్తే.. ఎర్ర తివాచీ పరిచి ఘనంగా స్వాగతం పలకాల్సి ఉండగా.. ఏపీ ప్రభుత్వ వ్యవహారం అందుకు విరుద్ధంగా ఉంది.

Updated : 21 Nov 2022 12:32 IST

ఓ ప్రజాప్రతినిధి వేధింపులతో ఆంధ్రాను వదిలేసిన కంపెనీ  
గతంలో కేటాయించిన భూమినీ వదిలేసి వెనక్కు
ఏపీలో దందాలతో బెదురు.. తెలంగాణలో రెండు యూనిట్ల ఏర్పాటుకు సిద్ధం  
ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

పరిశ్రమ స్థాపిస్తామని ఎవరైనా ముందుకొస్తే.. ఎర్ర తివాచీ పరిచి ఘనంగా స్వాగతం పలకాల్సి ఉండగా.. ఏపీ ప్రభుత్వ వ్యవహారం అందుకు విరుద్ధంగా ఉంది. వసూళ్లు.. మామూళ్లు అంటూ నేతలు మేత కోసం వెంటపడుతుండటంతో కాలుపెట్టిన కంపెనీలు కూడా పరారైపోతున్నాయి. ‘కాలు తొక్కిననాడే తెలుస్తుంది కాపురం చేసే కళ’ అన్నట్లు రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే ఈ జాడ్యం మొదలైంది. ఓ ప్రజాప్రతినిధి దెబ్బకు ఒక పెద్ద పరిశ్రమ ఒకటి ‘కాపురం’ పెట్టకముందే బెదిరిపోయి పక్క రాష్ట్రానికి పారిపోయింది.

వేల మందికి ఉపాధి కల్పించగల ఒక పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌లో పెట్టేందుకు అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఒక సంస్థ సిద్ధపడింది. అందుకు స్థల కేటాయింపులు, సన్నాహాలూ పూర్తయ్యాయి. కానీ ముందు తన సంగతి తేల్చాలంటూ ఆ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు ముడుపుల కోసం బెదిరింపులకు దిగారు. దీంతో ఆ సంస్థ ఆంధ్ర నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించడంతో అక్కడ ఒకచోట కాదు.. రెండు చోట్ల పరిశ్రమలు పెట్టేందుకు సిద్ధమైంది. ఆ కంపెనీ పేరు ‘పేజ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌’. ఎంతో పేరు ప్రతిష్ఠలున్న జాకీ దుస్తులను అది తయారు చేస్తుంది. యువతరంలో ఈ ఉత్పత్తులకు విశేషమైన ఆదరణ ఉంది. మార్కెట్‌లో ఈ సంస్థ షేరు విలువ ప్రస్తుతం రూ.45,000 పైగా ఉంది. తాజాగా ఆ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీ రామారావును కలిశారు. ఆ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నం, ములుగుల్లో యూనిట్లను స్థాపిస్తామని, అక్కడి ప్రభుత్వం ఇస్తున్న సహకారం, ప్రోత్సాహంవల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు ప్రకటించారు.

అప్పట్లోనే భూ కేటాయింపులు

నిజానికి పేజ్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమ స్థాపన కోసం 2017లోనే ముందుకు వచ్చింది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవసరమైన అనుమతులు, భూకేటాయింపుల ప్రక్రియ పూర్తయింది. అనంతపురం సమీపంలోని రాప్తాడువద్ద 27 ఎకరాలను కేటాయించింది. రూ.129 కోట్లు పెట్టుబడి పెట్టి ఏటా 32.4 మిలియన్ల దుస్తులను తయారు చేసే కర్మాగారాన్ని, గిడ్డంగిని అక్కడ ఏర్పాటు చేయాలనేది కంపెనీ ప్రణాళిక. ఆ యూనిట్‌ ద్వారా 6,420 మందికి నేరుగా ఉపాధి లభిస్తుందని నాడు అంచనా వేశారు. జపాన్‌ నుంచి అధునాతన యంత్రాలను రప్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 3 దశల్లో కర్మాగారం నిర్మించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. సివిల్‌ పనుల కోసం పేరుగాంచిన నిర్మాణ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. నిర్మాణ స్థలంలో పనులు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లను సదరు నిర్మాణ సంస్థ ప్రారంభించింది.

గ్రామీణుల ఉపాధికి గండి..

సాధారణంగా దుస్తుల పరిశ్రమలు సంఖ్యాపరంగా ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తాయి. పెద్దగా చదువుకోని గ్రామీణులకు.. అదీ మహిళలకు ఎక్కువ అవకాశాలుంటాయి. అందువల్ల ఇలాంటి పరిశ్రమ ఒకటి వస్తే పరిసర ప్రాంతాల్లోని ప్రజల జీవితాల్లో ఎన్నో సానుకూల మార్పులు వస్తాయి. అభివృద్ధి జరుగుతుంది. ప్రస్తుతం పరిశ్రమ వెనక్కి వెళ్లిపోవడంతో ఈ ప్రాంత గ్రామీణ మహిళల ఉపాధికి గండిపడినట్లైంది.


ఎన్నికల ఖర్చు ఇవ్వాలంటూ బేరం

రాష్ట్రంలో ఎన్నికలు జరిగి వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అనంతపురం సమీపంలోని రాప్తాడు వద్ద పెట్టబోతున్న జాకీ కర్మాగారం ఆ పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధికి ‘అవకాశం’గా, ‘వనరు’గా కనిపించింది. ‘నాకు ఎన్నికల్లో రూ.20 కోట్లు ఖర్చయింది. అందులో సగం మీరు ఇవ్వాల్సిందే’ అని ఆ ప్రజాప్రతినిధి నుంచి కంపెనీ ప్రతినిధులకు బెదిరింపులు వెళ్లినట్లు తెలిసింది. అంతేకాదు.. కంపెనీకి సంబంధించిన సబ్‌ కాంట్రాక్టులన్నీ తాను ఎవరికి చెబితే వారికే ఇవ్వాలని.. ఉద్యోగాలు తాను చెప్పిన ప్రకారమే ఇవ్వాల్సి ఉంటుందని.. అందుకు భిన్నంగా జరిగితే ఊరుకోనని, పనులు జరగనివ్వనని హెచ్చరించినట్లు సమాచారం. రాష్ట్రంలో ముఖ్య నేతలకు సమాచారం ఇస్తే సదరు ప్రజాప్రతినిధిని నియంత్రిస్తారేమోనని కంపెనీ తరఫువారు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.

అవి ఫలించకపోవడంతో గత్యంతరం లేని స్థితిలో ‘మీ భూమిని మీరు వెనక్కి తీసుకుని మేం కట్టిన డబ్బులు మాకిచ్చేయండి.. మా దారి మేం చూసుకుంటాం’ అని చెప్పేసి వెళ్లిపోయారు. ఈ మేరకు కంపెనీ సెక్రటరీ సి.మురుగేశ్‌ రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు.


03-12-2019

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమను పెట్టే ఆలోచనను విరమించుకుంటున్నామని, తమకు కేటాయించిన భూమిని వెనక్కు ఇచ్చేస్తున్నామని ఏపీ ప్రభుత్వానికి జాకీ బ్రాండ్‌ దుస్తుల తయారీ సంస్థ ‘పేజ్‌ ఇండస్ట్రీస్‌’ రాసిన లేఖ.  


02-11-2017

‘జాకీ’ దుస్తులను ఉత్పత్తి చేసే ‘పేజ్‌ ఇండస్ట్రీస్‌’ పరిశ్రమ స్థాపన కోసం రాప్తాడులో రాయితీలు కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.


24-11-2017

రాప్తాడులో కంపెనీకి 30 ఎకరాలను ఏపీఐఐసీ ద్వారా తాత్కాలికంగా కేటాయిస్తూ ఉత్తర్వులు.


26-02-2018

28.08 ఎకరాలను ఆ కంపెనీకి కేటాయిస్తూ ఏపీఐఐసీ ద్వారా తుది ఉత్తర్వులు.


22-06-2018

కంపెనీకి కేటాయించిన 26.87 ఎకరాల భూ విక్రయానికి కుదిరిన ఒప్పందానికి అనంతపురం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో రిజిస్ట్రేషన్‌.


03-12-2019

ఏపీలో పరిశ్రమను పెట్టే ఆలోచనను విరమించుకుంటున్నామని, భూమిని వెనక్కు ఇచ్చేస్తున్నామని ప్రభుత్వానికి ‘పేజ్‌ ఇండస్ట్రీస్‌’ లేఖ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు