Android ChromeOS Merger: పీసీ మార్కెట్‌పై గూగుల్‌ గురి.. మైక్రోసాఫ్ట్, యాపిల్‌తో పోటీకి మరోసారి రెడీ

Eenadu icon
By Business News Team Published : 25 Sep 2025 15:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Android ChromeOS Merger | ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్‌ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌. అంతగా ప్రజాదరణ పొందిన ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కేవలం చిన్న డివైజులకే పరిమితం అయ్యింది. పర్సనల్‌ కంప్యూటర్ల విషయానికొచ్చేసరికి ఇప్పటికీ మైక్రోసాఫ్ట్‌ విండోస్‌, యాపిల్‌ మ్యాక్‌ఓఎస్‌దే హవా. వాటికి పోటీగా గూగుల్‌ సంస్థ క్రోమ్‌ ఓఎస్‌ తీసుకొచ్చి ఓ ప్రయత్నం చేసినప్పటికీ.. పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు పీసీ మార్కెట్‌పై గూగుల్‌ మరోసారి దృష్టి సారించింది. పీసీల కోసం ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఆండ్రాయిడ్‌, క్రోమ్‌ఓఎస్‌ను విలీనం చేయనుంది. హవాయిలో జరిగిన స్నాప్‌డ్రాగన్‌ సమ్మిట్‌లో గూగుల్‌ ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఆండ్రాయిడ్‌, క్రోమ్‌ఓఎస్‌ను మెర్జ్‌ చేస్తారంటూ ఎప్పటి నుంచో రూమర్స్‌ వినిపిస్తున్నాయి. స్నాప్‌డ్రాగన్‌ ఈవెంట్‌కు హాజరైన గూగుల్‌ ప్రతినిధి రిక్‌ ఓస్టెర్లో దీన్ని ధ్రువీకరించారు. పీసీల కోసం స్మార్ట్‌ఫోన్‌ల కోసం రెండు వేర్వేరు ఆపరేటింగ్‌ సిస్టమ్‌లను ప్రస్తుతం అందిస్తున్నామని, ఈ రెండింటినీ విలీనం చేయబోతున్నట్లు వెల్లడించారు. పీసీలకూ జెమినీ, ఆండ్రాయడ్‌ ఏఐ ఫీచర్లను జోడించబోతున్నట్లు తెలిపారు. కంప్యూటింగ్‌ కేటగిరీలో ప్రతి ఒక్కరికీ ఆండ్రాయిడ్‌ సేవలందించేందుకు ఇదో మార్గంగా పేర్కొన్నారు. దీనిపై క్వాల్‌కామ్‌ సీఈఓ క్రిస్టియానో అమన్‌ స్పందిస్తూ.. ఈ సాఫ్ట్‌వేర్‌ వెర్షన్‌ను తాను చూశానని, అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. దీనికోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 

పర్సనల్‌ కంప్యూటర్‌ మార్కెట్‌లోనూ సత్తా చాటేందుకు క్రోమ్‌ఓఎస్‌ను గూగుల్ తీసుకొచ్చింది. ఎంట్రీలెవల్‌ కంప్యూటర్ల కోసం సులువుగా, వేగంగా సేవలందించడంతోపాటు సెక్యూరిటీ పరంగానూ మెరుగైన సేవలందించేందుకు దీనిద్వారా ఓ ప్రయత్నం చేసింది. ఈ ఓఎస్‌తో పనిచేసే క్రోమ్‌బుక్స్‌లో ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను వినియోగించే సదుపాయాన్నీ తీసుకొచ్చింది. ఇన్ని చేసినా పీసీ మార్కెట్‌లో క్రోమ్‌ ఓఎస్‌ వాటా కేవలం 7.3 శాతం దగ్గరే ఆగిపోయింది. విండోస్‌ మాత్రం 79.8 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి పీసీ మార్కెట్‌పై గూగుల్‌ గురిపెట్టింది. మరోవైపు పర్సనల్‌ కంప్యూటర్లకు తన చిప్‌సెట్‌లను విక్రయించడం ద్వారా తన మార్కెట్‌ విస్తరించాలని క్వాల్‌కామ్‌ భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు