Financial planning: పిల్లల చదువులకు ధీమాగా...

ఉన్నత చదువుల ఖర్చు రోజురోజుకూ పెరిగిపోతోంది. అన్నీ సవ్యంగా సాగిపోతున్నప్పుడు పెట్టుబడులు, విద్యా రుణాలతో వీటిని తట్టుకునేందుకు వీలవుతుంది. కానీ, కుటుంబంలో ఆర్జించే వ్యక్తికి ఏదైనా అనుకోనిది జరిగితే.. ఒక్కసారిగా అనుకున్న ప్రణాళిక దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఎప్పుడూ ముందు జాగ్రత్తతో ఉండాలి.

Updated : 28 Apr 2023 06:39 IST

ఉన్నత చదువుల ఖర్చు రోజురోజుకూ పెరిగిపోతోంది. అన్నీ సవ్యంగా సాగిపోతున్నప్పుడు పెట్టుబడులు, విద్యా రుణాలతో వీటిని తట్టుకునేందుకు వీలవుతుంది. కానీ, కుటుంబంలో ఆర్జించే వ్యక్తికి ఏదైనా అనుకోనిది జరిగితే.. ఒక్కసారిగా అనుకున్న ప్రణాళిక దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఎప్పుడూ ముందు జాగ్రత్తతో ఉండాలి. పిల్లల భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా బీమా రక్షణ కల్పించాలి.

పెట్టుబడులు నిరంతరం కొనసాగే ఒక ప్రక్రియ. దీర్ఘకాలంలో సాధించాల్సిన లక్ష్యాలను చేరుకోవాలంటే ఇవి తప్పనిసరి. 15-20 ఏళ్ల తర్వాత పిల్లల ఉన్నత చదువులకు ఉపయోగపడేలా పీపీఎఫ్‌, మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లు, స్థిరాస్తి, బంగారంలాంటి వాటిలో మదుపు చేయాలి. వీటితోపాటు చేయాల్సిన మరో ముఖ్యమైన పని జీవిత బీమా పాలసీని ఎంచుకోవడం. ఇందులోనూ పిల్లల అవసరాలకు ప్రత్యేకంగా పాలసీలూ అందుబాటులో ఉన్నాయి. వీటిని తీసుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో పిల్లల చదువులకు నిధులను సమకూర్చే లక్ష్యంతో బీమా సంస్థలు ఈ పాలసీలను అందిస్తుంటాయి. ఆర్థికంగా కుటుంబ పెద్ద బాధ్యతను ఇవి తీసుకుంటాయి. సాధారణ బీమా పాలసీలతో పోలిస్తే ఇవి కాస్త భిన్నం అని చెప్పొచ్చు. బీమా చేసిన వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు వెంటనే పాలసీ మొత్తం చెల్లిస్తుంది. ఆ తర్వాత వ్యవధి తీరిన తర్వాత మరోసారి బీమా విలువ చెల్లిస్తారు.

ఆదుకునేలా...

పిల్లల బీమా (చైల్డ్‌ ఇన్సూరెన్స్‌) పాలసీల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. రెండుసార్లు పరిహారం లభించడం. బీమా తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు వెంటనే నామినీకి పరిహారం అందిస్తుంది. ఆ తర్వాత పాలసీ వ్యవధి తీరే వరకూ బీమా సంస్థ పాలసీదారుడికి బదులు ప్రీమియాలను చెల్లిస్తుంది. దీనివల్ల పాలసీ కొనసాగుతుందన్నమాట. ఆ తర్వాత వ్యవధి ముగిసిన వెంటనే మరోసారి నామినీకి పాలసీ విలువను చెల్లిస్తుంది. ఇలా రెండుసార్లు పిల్లల వివిధ దశల్లో అవసరమయ్యే నిధులను అందుబాటులో ఉండేలా చూస్తుంది. ఇలాంటి పాలసీల్లో చాలావరకూ పిల్లల వివిధ దశలు అంటే.. ఉన్నత చదువులు, వారి వివాహం తదితర ఖర్చులకు అనుగుణంగా వ్యవధులను నిర్ణయిస్తారు.

రకాలుంటాయి...

పిల్లల పాలసీల్లో ఎండోమెంట్‌ ప్లాన్‌, యూనిట్‌ ఆధారిత పాలసీలూ (యులిప్‌) అందుబాటులో ఉన్నాయి. తక్కువ నష్టభయం ఉండాలని భావించే వారు ఎండోమెంట్‌ పాలసీలను పరిశీలించవచ్చు. ఇందులో బీమా సంస్థ బోనస్‌, లాయల్టీ అడిషన్‌లాంటివి అందిస్తుంటుంది. రాబడి 5-6 శాతం వరకూ ఉండొచ్చు. యులిప్‌ పెట్టుబడులు ఈక్విటీల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరో పదేళ్ల తర్వాతే పిల్లలకు డబ్బు అవసరం ఉంటుందని భావించినప్పుడు యులిప్‌లలో ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు. లక్ష్యానికి సమీపిస్తున్నప్పుడు కనీసం మూడేళ్ల ముందునుంచీ ఈ పెట్టుబడులను డెట్‌లోకి మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మార్కెట్‌ హెచ్చుతగ్గుల నుంచి పెట్టుబడులను కాపాడుకోవచ్చు. వ్యవధి తీరిన తర్వాత ఎండోమెంట్‌ పాలసీ విలువను చెల్లిస్తుంది. యులిప్‌ తీసుకుంటే.. వ్యవధి తీరిన తర్వాత ఫండ్‌ విలువను చెల్లిస్తాయి. మధ్యలోనే పాలసీదారుడు కుటుంబానికి దూరమైతే.. నిర్ధరించిన విధంగా పరిహారాన్ని అందిస్తాయి. ముందే చెప్పినట్లు.. పాలసీని ఎంచుకునేటప్పుడు కచ్చితంగా వైవర్‌ ఆఫ్‌ ప్రీమియం ఉండేలా చూసుకోవాలి. నష్టభయం భరించే సామర్థ్యం, పిల్లల అవసరాలు దృష్టిలో పెట్టుకొని, ఏ రకం పాలసీలను ఎంచుకోవాలన్నది నిర్ణయించుకోవాలి.

ముందునుంచే...

సంపాదన ప్రారంభమైనప్పటి నుంచే భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పొదుపు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలి. వివాహం తర్వాత తనపై ఆధారపడిన వారికి ఆర్థిక భరోసా కల్పించేలా ప్రణాళికలు వేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు పుట్టిన వెంటనే వారి 21 ఏళ్ల ఆర్థిక అవసరాలకు ఒక రక్షణ కల్పించాలి. ఉన్నత చదువుల ఖర్చు పెరుగుతోంది. దీనికి అనుగుణంగా పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి.  అప్పుడే సరైన మొత్తాన్ని మదుపు చేసేందుకు వీలవుతుంది. కేవలం పెట్టుబడులతోనే అన్నీ సాధ్యం కాకపోవచ్చు. అనుకోని పరిస్థితులనూ ఊహించి, అందుకు అనుగుణంగా ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలి. ప్రతి వ్యక్తీ తన వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఉండేలా చూసుకోవాలి. ఆదాయంలో 15-20 శాతం వరకూ పిల్లల భవిష్యత్‌ అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలి. అప్పుడే ఆర్థిక భరోసాతోపాటు, దీర్ఘకాలంలో సంపద సృష్టికీ అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని