PMSBY: ₹20 ప్రీమియంతో ₹2 లక్షల ప్రమాద బీమా.. ఇలా చేరండి..!

PMSBY: సామాన్యులకు బీమా ప్రయోజనాలు అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో ఎలా చేరాలి? ప్రీమియం ఎంత? మరిన్ని వివరాలు తెలుసుకోండి.

Updated : 16 May 2023 15:55 IST

PMSBY full details | ఇంటర్నెట్‌డెస్క్‌: ఏదైనా అనుకోని ప్రమాదం కారణంగా మరణించినా లేదా వైకల్యం పొందినా కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించటం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) పథకాన్ని తీసుకొచ్చింది. అతి తక్కువ ప్రీమియం చెల్లింపుతో రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకాన్ని 2015లోనే కేంద్రం తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఈ పథకం కింద 34.2 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. అందులో 1.15 లక్షల కుటుంబాలు రూ.2,302 కోట్ల ఆర్థిక లబ్ధి పొందాయి. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ పథకం గురించి పూర్తి వివరాలు..

అర్హత

  • 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనలో (PMSBY) చేరేందుకు అర్హులు.
  • బ్యాంకు/ పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉన్న వారెవరైనా ఈ పథకంలో చేరొచ్చు.
  • ఇందుకోసం బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది. ఒక వేళ అనుసంధానం చేయకపోతే కేవైసీ చేయించడం తప్పనిసరి.
  • ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు కలిగి ఉంటే, ఏదైనా ఒక పొదుపు ఖాతా ఉన్న బ్యాంకు నుంచి మాత్రమే పథకానికి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఒక వేళ రెండింటి ద్వారా నమోదు చేసుకుని ప్రీమియం చెల్లించినప్పటికీ ఒకటి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
  • ఉమ్మడి ఖాతా తీసుకున్న వారు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఇద్దరూ విడివిడిగా ప్రీమియం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
  • భారతదేశంలో పొదుపు ఖాతా ఉన్న ఎన్నారైలు కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులు.

నమోదు కాలవ్యవధి

ఈ పథకం ఒక సంవత్సరం కాలపరిమితితో వస్తుంది. జూన్‌ 1 నుంచి మే 31 వరకు అమల్లో ఉంటుంది. ప్రతి ఏడాది జూన్‌ 1లోగా ప్రీమియం మొత్తం ఆటో డెబిట్‌ ద్వారా రెన్యువల్‌ అవుతుంది. ఒకవేళ క్యాన్సిల్‌ చేసుకోవాలనుకుంటే.. రద్దు కోసం బ్యాంకును కోరాలి. కొత్తగా ఈ పథకంలో చేరే వారికి జూన్‌ 1 నుంచి మే 31 వరకు కవరేజీ లభిస్తుంది.

నామమాత్రపు ప్రీమియమే..

సామాన్యులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నామమాత్రపు ప్రీమియంతో సురక్షా బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పథకాన్ని ప్రారంభించినప్పుడు కేవలం రూ.12 ప్రీమియంతోనే పాలసీని అందించేవారు. గతేడాది నుంచి ప్రీమియంను రూ.20కు పెంచారు. ఆటోడెబిట్‌ ద్వారా బ్యాంకు/పోస్టాఫీసు ఖాతా నుంచి ఒకే వాయిదాలో ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి. ప్రతి సంవత్సరం జూన్‌ 1లోగా పాలసీని పునరుద్ధరించుకోవలసి ఉంటుంది. ఈ పథకంలో జాయిన్ అయ్యేవారు ప్రీమియం మొత్తాన్ని ఏటా ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా తీసుకునేందుకు బ్యాంకులను అనుమతించాలి.

బీమా హామీ

పాలసీదారుడు మరణించినా లేదా శాశ్వత వైకల్యం చెందినా రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి గురైతే రూ.1 లక్ష బీమా పరిహారం లభిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఈ పథకం వర్తించదు. ఇలాంటి సమయాల్లో వారి కుటుంబానికి ఎలాంటి బీమా ప్రయోజనమూ లభించదు. అదే హత్యకు గురైతే మాత్రం బీమా కవరేజీ లభిస్తుంది.

ఎప్పుడు రద్దవుతుందంటే?

  • ప్రీమియం డబ్బును ఆటోమేటిక్‌గా బ్యాంకులు తీసుకొనేందుకు అనుమతించాలి. ఒకవేళ డెబిట్‌ అయ్యే సమయంలో తగినంత బ్యాలెన్స్ ఖాతాలో లేనప్పుడు బీమా పాలసీ రద్దవుతుంది. 
  • బ్యాంక్‌/పోస్టాఫీసులలో పొదుపు ఖాతా రద్దయినప్పుడు లేదా మూసివేసిన సందర్భాల్లో పాలసీ రద్దవుతుంది.
  • చందాదారుని వయసు 70 ఏళ్లు దాటిన తర్వాత బీమా వర్తించదు.

క్లెయిమ్‌ ఎలా?

పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే దాన్ని ధ్రువీకరించడానికి సరైన పత్రాలను సాక్ష్యంగా చూపించినట్లయితే ఈ పథకం కింద క్లెయిమ్‌ మంజూరవుతుంది. ఆత్మహత్య మినహా.. రోడ్డు ప్రమాదం, హత్యకు గురికావటం లేదా ఏ ఇతర కారణాల ద్వారా మరణాలు సంభవిస్తే ఆ మరణాన్ని పోలీసులు ధ్రువీకరించాలి. క్లెయిమ్ ఫారానికి ఒరిజినల్ ఎఫ్‌ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్ట్, డెత్ సర్టిఫికెట్‌ లేదా వైకల్యం ఉంటే సివిల్ సర్జన్ జారీ చేసే వైకల్య ద్రువపత్రం తప్పనిసరిగా జత చేయాలి. కొన్నింటికి డిశ్చార్జి సర్టిఫికెట్ కూడా జతచేయాలి. ఒకవేళ పాలసీ తీసుకున్న సమయంలో నామినీ తెలపకపోతే వారసుడు క్లెయిమ్‌ కోసం దాఖలు చేసుకోవచ్చు. పూర్తి చేసిన క్లెయిమ్ ఫారమ్‌ను ప్రమాదం జరిగిన రోజు నుంచి 30 రోజులలోపు బ్యాంకు శాఖకు సమర్పించాలి.

ఇలా చేరండి

ఈ పథకంలో చేరడానికి https://www.jansuraksha.gov.in వెబ్‌సైట్‌ నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో అడిగిన వివరాలన్నీ రాసి బ్యాంకు లేదా పోస్టాఫీసులో అందించాలి. నెట్‌ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఇందుకోసం మీ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్ అకౌంట్‌లో లాగిన్‌ అవ్వాలి. అందులో ఉన్న Insurance ఆప్షన్ పై క్లిక్‌ చేయాలి. తర్వాత ప్రీమియం చెల్లించటం కోసం మీ బ్యాంక్‌ఖాతాను ఎంచుకోవాలి. అన్ని వివరాలూ తనిఖీ చేసుకొని నిర్ధారించుకొని confirmపై క్లిక్‌ చేయాలి. అనంతరం Download ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ పాలసీ రశీదును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. భవిష్యత్‌లో రిఫరెన్స్‌ కోసం దీన్ని భద్రపరచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని