Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన

పంజాబ్‌ (Punjab)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు దుండగులు ఒక యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అతడి ఇంటి ముందు పడేశారు.

Updated : 23 Sep 2023 11:53 IST

చండీగఢ్‌: పాతకక్ష ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కొందరు దుండగులు ఒక యువకుడిని దారుణంగా హతమార్చి అతడి ఇంటి ముందు పడేశారు. ఈ ఘటన పంజాబ్‌ (Punjab)లో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

కపుర్తలాకు చెందిన హర్‌దీప్‌ సింగ్‌ అనే 22 ఏళ్ల యువకుడికి.. చాలా కాలంగా హర్‌ప్రీత్‌ సింగ్‌ అనే స్థానిక వ్యక్తితో వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే హర్‌దీప్‌పై కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో తల్లిదండ్రులకు దూరంగా వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. బ్యాంకు పని ఉండడంతో ఇంటికి వచ్చాడు.

మట్టిపాలైన బతుకులు!

పనిపై బయటకు వెళ్లిన కుమారుడి కోసం అతడి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. రాత్రి వేళ ఆరుగురు వ్యక్తులు ఇంటి ముందుకు వచ్చి ‘‘మీ కుమారుడిని చంపేశాం’’ అంటూ కేకలు వేశారు. దీంతో కంగారుగా బయటకు వచ్చిన తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉన్న కుమారుడిని చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అంతటితో ఆ నిందితులు ఊరుకోలేదు. ‘‘ఇదిగో మీ సింహం. ఇప్పుడు తీసుకువెళ్లండి’’ అని తల్లిదండ్రులను హేళన చేశారు.

వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుడి తండ్రి గురునామ్‌ సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో నలుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చేపట్టారు. పాతకక్షల కారణంగానే అతడిని హత్య చేశారని ఎస్పీ రాజ్‌పాల్‌ సింగ్‌ సంధు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని