logo

నవ శాస్త్రవేత్తలకు ఆహ్వానం

విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అవకాశం కల్పిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు 12 రోజుల పాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తుంది.

Updated : 01 Apr 2023 06:27 IST

న్యూస్‌టుడే, వెంకట్‌నగర్‌(కాకినాడ)

విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అవకాశం కల్పిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు 12 రోజుల పాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తుంది. యువికా (యువ విజ్ఞాని కార్యక్రమం) పేరుతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు  ఆహ్వానిస్తోంది. శిక్షణకు హాజరయ్యే వారికి రవాణా ఛార్జీలు, బస, భోజన వసతితో పాటు అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాస వినీల్‌ తెలిపారు.

దరఖాస్తు విధానం...

విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. మొదట ఇ-మెయిల్‌ ఐడీతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. తర్వాత 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ క్విజ్‌లో పాల్గొనాలి. క్విజ్‌ పూర్తిచేసిన 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తులో పూర్తి వివరాలు నమోదు చేయాలి. దరఖాస్తుతో పాటు విద్యార్థి సంతకం చేసిన పత్రం, విద్యార్థి గత మూడేళ్లలో వివిధ అంశాల్లో సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. మార్చి 20 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఎంపిక జాబితాలను ఏప్రిల్‌ 20న ప్రకటించి అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు.

ఎంపిక ఇలా...

ప్రస్తుతం తొమ్మిదో (2022-23) తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఎనిమిదో తరగతిలో పొందిన మార్కులు, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏదైన వైజ్ఞానిక ప్రదర్శనలో భాగస్వామ్యం, సైన్స్‌ ప్రతిభ పరీక్షలు, ఒలింపియాడ్‌లో పాల్గొని మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. రిజిష్టర్డ్‌ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిన వారు, స్కౌట్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లో సభ్యులు, ఆన్‌లైన్‌ క్విజ్‌లో ప్రతిభ చూపిన వారి ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు.

మే 15 నుంచి 26 వరకు శిక్షణ...

శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు వేసవి సెలవుల్లో మే 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తిగా రెసిడెన్షియల్‌ పద్ధతిలో ఉంటుంది. విద్యార్థితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్‌ ఉపాధ్యాయుడికి ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. శిక్షణ తర్వాత శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌కు తీసుకువెళ్లి అక్కడి విశేషాలను ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పిస్తారు.

శిక్షణ కేంద్రాలు

ఎంపికైన విద్యార్థులకు ఏడు కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. ఐఐఆర్‌ఎస్‌ (డెహ్రాడూన్‌), విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (తిరువనంతపురం), సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (శ్రీహరికోట), యు.ఆర్‌.రావు శాటిలైట్‌ సెంటర్‌ (బెంగళూరు), స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (అహ్మదాబాద్‌), నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (హైదరాబాద్‌), నార్త్‌-ఈస్ట్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (షిల్లాంగ్‌) కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు.

విద్యార్థులను ప్రోత్సహించాలి

వైజ్ఞానిక పోటీల్లో పాల్గొనేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన, అంతరిక్ష పరిశోధన రంగాలపై ఆసక్తి పెంచడానికి యువికా తోడ్పడుతుంది. ఎంపికైన విద్యార్థులకు స్పేస్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే పాఠశాలలకు పంపించాం. http:///www.isro.gov.in./YUVIKA వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

కేఎన్‌వీఎస్‌ అన్నపూర్ణ, డీఈవో, కాకినాడ జిల్లా యువికా వెబ్‌పోర్టల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని