logo

వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ నిధుల విడుదల నేడు

ఆరుగాలం కష్టపడి సేద్యం చేస్తున్న రైతులకు చేయూత నిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్‌, వైఎస్సార్‌ రైతు భరోసా పథకాల ద్వారా రైతులకు పంట సీజన్‌లో విడతల వారీగా సాయం అందిస్తున్నాయి.

Published : 01 Jun 2023 05:33 IST

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: ఆరుగాలం కష్టపడి సేద్యం చేస్తున్న రైతులకు చేయూత నిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్‌, వైఎస్సార్‌ రైతు భరోసా పథకాల ద్వారా రైతులకు పంట సీజన్‌లో విడతల వారీగా సాయం అందిస్తున్నాయి. ఈ సీజన్‌లో ·మొదటి విడత వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ నిధులు గురువారం విడుదల కానున్నాయి. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 1.87 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉండగా.. త్వరలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మొదటి విడతగా 1,61,386 మంది రైతులకు రూ.121.29 కోట్లు అందనున్నాయి. ఏటా ప్రతి రైతుకు రూ.13,500 ప్రభుత్వం రైతు భరోసా పథకంలో అందిస్తోంది. మొదటి విడతలో వైఎస్సార్‌ రైతు భరోసా రూ.5500, పీఎం కిసాన్‌ రూ.2000 వెరసి ఒక్కో రైతుకు రూ.7500 రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

కౌలు రైతులకు అంతంతమాత్రమే..

2023-24 వ్యవసాయ సీజన్‌లో మొదటి పంట ఖరీఫ్‌ సాగు మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు అందజేసి వారికి ప్రయోజనం కల్పించాల్సిన అవసరం ఉంది. గత ఏడాది జిల్లాలో 70 వేల మందికి పైగా కౌలు రైతులు సీసీఆర్‌సీ (క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌ కార్డు) అందించగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 4199 మంది రైతులకు రైతు భరోసా అందించారు. ఈ ఏడాది 4859 మంది రైతులకు రూ.7500 వంతున తొలి విడతగా రైతు భరోసా అందించనున్నారు. ఖరీఫ్‌ సాగు ప్రారంభమయ్యే నాటికి కౌలు ఒప్పందాలు పూర్తయ్యే అవకాశం ఉందని.. ఈ క్రమంలో సీసీఆర్‌సీ కార్డులు పొందిన వారికి మరోసారి అవకాశం కల్పించాలని కౌలు రైతులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని