logo

బదిలీలకు పైరవీలు

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కాగానే పైరవీలు ఊపందుకున్నారు.

Published : 29 Jan 2023 03:10 IST

అర్హులైన ఉపాధ్యాయుల అభ్యంతరం
న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కాగానే పైరవీలు ఊపందుకున్నారు. కొందరు పలుకుబడి కలిగిన ఉపాధ్యాయులు హైదరాబాద్‌ నుంచి నేరుగా పోస్టింగులకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌కు సమీపంలో ఉండడం, పటాన్‌చెరు నియోజకర్గంలోని రెండు పట్టణాలు, కొన్ని గ్రామాలు 24శాతం హెచ్‌ఆర్‌ఏ పరిధిలోకి రావడంతో.. ఆయా ప్రాంతాల్లోని బడులకు పోస్టింగ్‌లు తెచ్చుకునేందుకు యత్నిస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, అర్హులైన ఉపాధ్యాయులు అభ్యంతరం తెలుపుతున్నారు. విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి పోస్టింగుల పేరిట పైరవీ పత్రాలు వస్తుండడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు అభ్యంతరం తెలపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కథనం.

ఇప్పటికే కొందరు..

ప్రస్తుతం సంగారెడ్డి పట్టణ పరిధిలో 13 శాతం, ఇతర మండలాల్లో 11 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తున్నారు. జిల్లాలో పని చేసే ఇద్దరు ఉపాధ్యాయులు రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి పటాన్‌చెరు నియోజకవర్గంలోని 24 శాతం హెచ్‌ఆర్‌ఏ పరిధి పాఠశాలకు పోస్టింగ్‌ ఇచ్చేలా అనుమతి పత్రాలు తెచ్చుకున్నారు. రెండు రోజుల క్రితం ఇతర జిల్లాకు చెందిన నలుగురు, శనివారం మరో ఇద్దరు కలిపి.. ఇప్పటి వరకు మొత్తం 8 మంది ఉపాధ్యాయులు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ పరిధి పాఠశాలలకు పోస్టింగ్‌ ఇచ్చేలా డీఈవో కార్యాలయంలో ఇప్పటికే పైరవీ పత్రాలు సమర్పించారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య 20కి మించే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. వీరికి జిల్లా విద్యాధికారి ఒకటి, రెండు రోజుల్లో విధుల్లో చేరేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఉపాధ్యాయ సంఘాలతో డీఈవో నిర్వహించిన సమావేశంలోనే ఈ అంశాన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తెరమీదకు తీసుకొచ్చాయి. పైరవీలకు తావివ్వొద్దని అర్హులైన ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. విద్యాశాఖ తీరుపై అభ్యంతరం తెలుపుతున్నారు.

ఆందోళనకు సిద్ధమవుతున్న సంఘాలు

బదిలీల్లో పైరవీల వల్ల అర్హులకు అన్యాయం జరగుతోందని ఇప్పటికే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు జిల్లా విద్యాధికారి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాయి. మరికొన్ని సంఘాలు పైరవీ ద్వారా వస్తున్న వారికి పోస్టింగ్‌లు ఇవ్వవద్దని నిరసనకు సిద్ధమవుతున్నాయి. జిల్లాలో అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు నష్టపోతున్నారని అంటున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాధికారి రాజేశ్‌ను వివరణ కోరగా.. జిల్లాకు హైదరాబాద్‌ నుంచి కొందరి బదిలీ ఉత్వర్వులు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని