logo

ప్రేమజంట బలవన్మరణం

ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం తుమ్మలపెన్‌పహాడ్‌ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

Published : 29 Apr 2024 04:23 IST

ఆత్మకూర్‌ (ఎస్‌), న్యూస్‌టుడే: ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం తుమ్మలపెన్‌పహాడ్‌ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై వై.సైదులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుండగాని సంజయ్‌(25), ఆ గ్రామపంచాయతీ ఆవాస గ్రామమైన కృష్ణసముద్రం గ్రామానికి చెందిన సల్లగుండ్ల నాగజ్యోతి(23) ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని గతంలోనే నాగజ్యోతి ఇంట్లో తెలుపగా.. ఆమె తండ్రి వారించాడు. అప్పటినుంచి వారిద్దరు కొన్ని రోజులుగా విడివిడిగా ఉంటున్నారు. నాగజ్యోతి ఇమాంపేటలోని ఓ కళాశాలలో బీఫార్మసీ పూర్తిచేసింది. ప్రస్తుతం సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తూ ఎం.ఫార్మసీ చదువుతోంది. సంజయ్‌ సూర్యాపేటలో ఉంటూ వాటర్‌ప్లాంట్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తిరిగి వారిద్దరు ప్రేమను కొనసాగిస్తున్నారు. గ్రామస్థులు కొందరు కలిసి నాగజ్యోతి తండ్రి సల్లగుండ్ల శ్రీనుకు వీరిపై లేనిపోని మాటలు చెప్పి ఇద్దరిని విడదీయాలని యత్నించారు. వారి మాటలు నమ్మిన శ్రీను పలుమార్లు ఆమెను కొట్టాడు. యువతి తరఫు బంధువులు కొందరు కొద్ది రోజుల క్రితం సంజయ్‌తో గొడవపడి దూషించి అతడిని కొట్టి ఇబ్బంది పెట్టారు. దీంతో వారిద్దరు మనస్తాపానికి గురై శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి.. రాత్రి సమయంలో తుమ్మలపెన్‌పహాడ్‌ గ్రామశివారులో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తమ పెళ్లికి అడుగడుగునా అడ్డుపడి తమ చావుకు కారణమైన ఏడుగురు వ్యక్తుల పేర్లను సూచిస్తూ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాసిన లేఖ మృతురాలి బ్యాగులో లభించిందని ఎస్సై తెలిపారు. మృతురాలి తల్లి దుర్గమ్మ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు, మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశామని తెలిపారు.


వివాహిత ఆత్మహత్య

కూసుమంచి, న్యూస్‌టుడే: పాలేరుకు చెందిన ఓ వివాహిత ఆదివారం బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు తెలిపిన ప్రకారం... సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కోడిపుంజులగూడేనికి చెందిన తేజశ్రీ(26)కి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరుకు చెందిన రంజిత్‌రెడ్డితో మూడేళ్ల క్రితం వివాహమైంది. భర్త మిషన్‌ భగీరథ ఆపరేటర్‌గా చేస్తున్నారు. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. ఆదివారం భర్త రంజిత్‌ రెడ్డి, మామ రంగారెడ్డి స్థానికంగా లేరు. ఈ నేపథ్యంలో ఇంట్లోని బెడ్‌రూంలోకి వెళ్లిన తేజశ్రీ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఉరికి వేలాడుతున్న విషయాన్ని పిల్లలు గమనించి చెప్పడంతో అత్త వెళ్లి చూసేసరికి ఆమె మృతి చెందింది. తేజశ్రీ ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ తెలిపారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని