TTD: తిరుమలలో క్షురకుల ఆందోళన.. తలనీలాలు సమర్పించేందుకు బారులు తీరిన భక్తులు

తిరుమలలో క్షురకులు ఆందోళనకు దిగడంతో తలనీలాలు సమర్పించేందుకు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి తిరుమలలో క్షురకుల ఆందోళన కొనసాగుతోంది.

Updated : 27 Oct 2022 17:25 IST

 

తిరుమల: తమతో అసభ్యంగా వ్యవహరించిన విజిలెన్స్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తిరుమలలో క్షురకులు నిరసనకు దిగారు. దీంతో ప్రధాన కల్యాణ కట్టతో పాటు పలు ప్రాంతాల్లో తలనీలాలు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. తలనీలాలు సమర్పించే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా భక్తుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో తితిదే నిఘా భద్రతా విభాగం అధికారులు కల్యాణకట్టతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో విజిలెన్స్‌ అధికారులు తమ పట్ల అసభ్యంగా వ్యవహరించారని క్షురకులు ఆరోపిస్తున్నారు. తలనీలాలు తీసే క్షురకుల దుస్తులు విప్పి డబ్బులు ఎక్కడ దాచారంటూ తనిఖీలు చేశారని వారు ఆరోపించారు.

తలనీలాలు సమర్పించేందుకు వేచి చూస్తున్న భక్తులు

క్షురకులు ఆందోళనకు దిగడంతో  ఇవాళ ఉదయం నుంచి తిరుమలకు వచ్చే భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. తితిదేలో దాదాపు 1100 మంది క్షురకులు ఉన్నారు. వీరిలో దాదాపు 750మంది ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్నారు. భక్తుల తలనీలాలు తీసినందుకు తితిదే వీరికి నిర్ణీత రుసుము చెల్లిస్తుంది. ప్రస్తుతం ఒప్పంద క్షురకులు మాత్రమే ఆందోళనకు దిగారు. శాశ్వత ఉద్యోగులుగా ఉన్నవారు విధులు నిర్వహిస్తున్నారు. భక్తుల వసతి సముదాయం-1, 2, 3, నందకం, కౌస్తుభం, ఎస్వీ వసతి గృహాల్లో తలనీలాల తొలగింపు ప్రక్రియ నిలిచిపోయింది. తలనీలాలు సమర్పించే భక్తులు వేల సంఖ్యలో ఉండటం, క్షురకులు తక్కువమంది ఉండటంతో క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని