Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Nov 2023 09:07 IST

1. వచ్చేది మా సర్కారే

మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని.. డిసెంబరు 6న రైతుబంధు నగదు యథావిధిగా పడుతుందని భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) ప్రకటించారు. కేసీఆర్‌ బతికి ఉన్నంత కాలం రైతుబంధు ఆగే ప్రసక్తేలేదన్నారు. రైతులు ఆందోళన పడొద్దన్నారు. పథకాన్ని దుష్ట కాంగ్రెస్‌ అడ్డుకుందని.. ఆ పార్టీకి పిచ్చి పట్టిందని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేసీఆర్‌ ఖేల్‌ ఖతం

‘ప్రస్తుత ఎన్నికలతో భారాస ఆట ముగియనుంది. మొదటిసారి తెలంగాణలో భాజపా ప్రభుత్వం రాబోతోంది. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కేసీఆర్‌ ట్రైలర్‌ చూశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రజలు పూర్తి సినిమా చూపిస్తారు. ఆయన ఖేల్‌ ఖతమవుతుంది. భారాస అవినీతిపరులను జైలుకు పంపించాలని సంకల్పం తీసుకున్నాం. భూములు, సాగునీటి ప్రాజెక్టులు, మద్యం కుంభకోణాలకు పాల్పడినవారిని, పేపర్‌ లీకేజీ దోషులను, రెండుపడక గదుల ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిన వారిని కటకటాల్లోకి పంపిస్తాం’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇందిరమ్మను తలపించె.. మాటలతో మురిపించె..!

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం భువనగిరిలో నిర్వహించిన విజయ సంకల్ప సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త జోష్‌ నిండింది. ప్రియాంకగాంధీని చూసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా మహిళలు, ప్రజలు తరలివచ్చారు. ప్రియాంకగాంధీ జై బోలో తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దొరల పాలనకు స్వస్తిపలికి, ప్రజల పాలన కోసం కాంగ్రెస్‌ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కదులుతున్న నోట్ల కట్టలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడే సమయం ఆసన్నమైంది. ప్రధాన పార్టీలైన భారాస, కాంగ్రెస్‌, భాజపాలు తమ బలాలు, బలగాల్ని మోహరించి విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నెల 30వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ప్రచారానికి మంగళవారం ఒక్కరోజే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని రోజుల కిందటే ఓటర్లకు డబ్బు పంపిణీ మొదలుకాగా.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రేపటి నుంచి ఎట్టాగబ్బా

ఎన్నికల ప్రచారాల్లో పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు, రోడ్‌షో, సమావేశాలతో బల ప్రదర్శనకు దిగాయి. ఎక్కువ మందిని చూపించాలని నాయకులు పోటీ పడుతూ ప్రజలను ఆహ్వానించారు. వాటి పుణ్యమాని వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర పనిచేసే వారంతా ఆయా పార్టీల తరఫున పోటీలో ఉన్న అభ్యర్థుల పక్షాన నిర్వహించిన ప్రచారాల్లో పాల్గొంటూ నెల రోజులుగా పండుగ చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇక.. నోటు మాటలే...!

ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో కీలకమైన పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు. గెలుపే లక్ష్యంగా ఇన్నాళ్లు ప్రచారం, సభలు, సమావేశాలతో సర్వశక్తులు ఒడ్డిన వారు ఇప్పుడు ఓటర్లకు నేరుగా నగదు పంపకానికి సన్నద్ధమయ్యారు. గతేడాదితో పోలిస్తే రెండో శ్రేణి కార్యకర్తలకు అభ్యర్థులు డబ్బుల పంపిణీ, ముఖ్య నాయకుల కొనుగోళ్లు తగ్గాయి. కొన్ని నియోజకవర్గాల్లో తప్పితే చాలా పల్లెల్లోనూ గతంతో పోలిస్తే ఎన్నికల గొడవలు సైతం తగ్గడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఏడు సెకన్ల పాటు ఓటు చూసుకోవచ్చు

ఈవీఎం ద్వారా పారదర్శకంగా ఓటు వేసే అవకాశం ఉంటుందని నిరూపించేందుకు వీవీప్యాట్‌ ఏర్పాటు చేశారు. మనం వేసిన ఓటును చూసుకునే వెసులుబాటు ఏర్పడింది. గతంలో బ్యాలెట్‌ పేపర్‌ను ఉపయోగించి పోలింగ్‌ నిర్వహించడంతో తాను ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకొని ఓటు హక్కును వినియోగించుకునే వారు. ఈవీఎంల ద్వారా పోలింగ్‌ నిర్వహించే విధానం వచ్చిన తరువాత ఓటరు తాను వేసిన గుర్తుకే పడుతోందా లేదా అనే విషయంలో పలు అనుమానాలు వ్యక్తం చేస్తూవచ్చారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బర్రెలక్కకు యానాం దాతల సాయం

పేద ప్రజలు, నిరుద్యోగ యువత కోసం నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎస్సీ యువతి బర్రెలక్క అలియాస్‌ శిరీషకు పుదుచ్చేరి ప్రభుత్వానికి యానాం నుంచి దిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న మల్లాడి కృష్ణారావు రూ.5.10 లక్షల చెక్కులను అందజేశారు. బర్రెలక్క నిజాయతీ, ధైర్యం నచ్చి, ఆమెకు మద్దతుగా ప్రచారానికి అక్కడికెళ్లి సోమవారం ఈ సహాయం అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 48 గంటలు ఎస్‌ఎంఎస్‌లు నిషేధం

శాసనసభ ఎన్నికల సందర్భంగా మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నిశబ్ద వ్యవధిలో(సైలెన్స్‌ పీరియడ్‌లో) అభ్యంతరకర, రాజకీయపరమైన, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ల ప్రసారం నిషేధమని, వీటి ప్రసారాలపై నిశితంగా పర్యవేక్షించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రలోభానికి లొంగినా నేరమే

న్నికల్లో పార్టీలు పలు విధాలుగా ఓటర్లను ప్రలోభపెడుతుంటాయి. డబ్బులు, మద్యం, చీరలు, క్రికెట్‌ కిట్లు తదితర నజరానాలు పంపిణీ చేయడం సహజం. వీటిని పంచుతూ పార్టీల నాయకులు, అభ్యర్థులు దొరికితే అధికారులు కేసులు నమోదు చేస్తుంటారు. కానీ వీటిని స్వీకరించడం లేదా స్వీకరించడానికి అంగీకరించడం కూడా నేరమే. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 123 ప్రకారం నేరమే అవుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు